ఏపీలో ఈఏపీ సెట్(ఎంసెట్ ) షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ షెడ్యూల్ ను శనివారం విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 24న ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దరఖాస్తులను వచ్చే నెల (జూలై) 25 వరకు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆగస్టు నెలలో 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్షల నిర్వహణపై పంతం
కరోనా నేపథ్యంలో ఇప్పటిదాకా టెన్త్ తో పాటు ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం పొంతన లేని ప్రకటనలు చేస్తోంది. కరోనా నేపథ్యంలో పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే లోకేశ్… ఏపీ ప్రభుత్వానికి లెక్కలేనన్ని లేఖలు రాశారనే చెప్పాలి. అయితే పంతానికి పోతున్న ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి తీరతామని చెబుతూ వస్తోంది. అయితే ఇప్పటిదాకా షెడ్యూల్ అయితే విడుదల చేయలేదు. జూలై మొదటి వారంలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల కాకపోతే… పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని స్వయంగా మంత్రి చెబుతున్నా… పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా మాత్రం ప్రకటించడం లేదు. ఓ వైపు సీబీఎస్ఈతో పాటు అన్ని రాష్ట్రాలు టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినా… ఏపీ ప్రభుత్వం మాత్రం పంతాలకు పోతూ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన రేకెత్తేలా చేస్తోందని చెప్పాలి.
ఉన్నపళంగా షెడ్యూల్
ఇలాంటి తరుణంలో ఉన్నపళంగా ఈఏపీ సెట్ షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. మరి కరోనా నేపథ్యంలో ఈఏపీ సెట్ నైనా ఏ జాగ్రత్తలతో నిర్వహిస్తారన్న విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా పరీక్షలకు సరిపడ సమయంతో ఈఏపీ సెట్ షెడ్యూల్ రావడం ఒకింత మేలేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- ‘జగ’మొండి : ఇంకా ప్రాణాలతో చెలగాటమేనా?