దేశ వ్యాప్తంగా నిషేధం విధించిన గుట్కా, పాన్ పరాగ్లు, తంబాకు ఏపీలో మరల అందుబాటులోకి రానున్నాయా? అవుననే అంటున్నారు...ఫుడ్ సేఫ్టీ అధికారులు. గుట్కాపై నిషేధం ఎత్తి వేయాలంటూ తయారీదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించి అనుకూల తీర్పు సాధించడంతో త్వరలో గుట్కాలు, పాను పరాగ్, మసాలా, తంబాకులు అధికారికంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశారు. గుట్కా తయారీదారులు కోర్టులో అనుకూల తీర్పు సాధించడంతో ఇక ఏపీలో నిషేధిత గుట్కాలు అధికారికంగానే అందుబాటులోకి రానున్నాయి.
ఏమార్చి, పేర్లు మార్చి
కేంద్రం గుట్కాలను నిషేధించడంతో తయారీదారులు ఆయా ఉత్పత్తుల పేర్లు మార్చి మరలా అనుమతులు సాధిస్తున్నారు. గుట్కాలో హానికారక పొగాకు మిశ్రమం ఉండటంతో కేంద్రం ఈ పదార్థాల తయారీ, అమ్మకాలను నిషేధించింది. తయారీదారులు పేర్లు మార్చి, కొత్త ఉత్పత్తుల పేరుతో మార్కెట్ను శాసిస్తున్నారు. తక్కువ ఖర్చుతో వేల కోట్లు వెనకేసుకునే ఉత్పత్తులు కావడంతో తయారీదారులు కోర్టులను ఆశ్రయించి అనుకూల తీర్పులు వచ్చే వరకు పోరాడి గెలుస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి. దీంతో గుట్కా తయారీదారులు అనేక రాష్ట్రాల్లో ఉత్పత్తుల పేర్లు మార్చి మార్కెట్లోకి గుట్కాలను తీసుకువస్తున్నారు.
ఏటా రూ.50వేల కోట్ల వ్యాపారం
దేశంలో ఏటా రూ.50 వేల కోట్ల రూపాయల గుట్కా వ్యాపారం నడుస్తోందని అసోశామ్ అంచనా వేసింది. తయారీదారులంతా గుజరాత్కు చెందినవారు కావడం బీజేపీలో మంచి పలుకుబడి కలిగి ఉండటంతో మరలా గుట్కాల తయారీకి మార్గం సుగమం చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని కబలిస్తూ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకు కారణం అవుతున్నాయని గుట్కాలను కేంద్ర ప్రభుత్వం 2014లోనే నిషేధించింది. అయినా ఆ తరవాత కూడా ఆయా కంపెనీలు పలు రకాల పేర్లతో మార్కెట్లో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇప్పటికే అలవాటు పడిన జనం గుట్కాలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఉత్పత్తులకు అలవాటు పడ్డారు. అందులో కూడా నిషేధిత పదార్థాలను వాడుతున్నా అధికారులు అదుపు చేసే చర్యలకు దిగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పొగాకు నమలడం ఆరోగ్యానికి హానికరం అని వందల కోట్లు ఖర్చు చేసి ప్రచారం నిర్వహిస్తోన్న కేంద్ర ఆరోగ్య శాఖ అలాంటి ఉత్పత్తులను నిషేధించి, మార్కెట్లో దొరక్కుండా చేయడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Must Read ;- రెండు చుక్కల ఆయిల్.. ఆ కిక్కే వేరప్పా..
ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ
గుట్కా తయారీకి 50 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని అంచనా. వాటిని మార్కెట్లో రూ.10 నుంచి 12దాకా అమ్మకాలు సాగిస్తున్నారు. అంటే 20 రెట్లు లాభం అన్నమాట. అందుకే గుట్కా, పాన్ మసాలాల తయారీదారులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, వాటిలో ఉండే లొసుగులను ఆసరాగా చేసుకుని కొత్త ఉత్పత్తులను తీసుకువస్తున్నారు. ఇక కోర్టులో కేసులు వేసి అనుమతులు సాధిస్తున్నారు. గుట్కా తయారీ మాఫియాలా తయారైంది. కేంద్రంలోని అధికార పార్టీకి గుట్కా తయారీదారులు పెద్దఎత్తున ఆర్థిక సాయం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గుజరాత్లోని గుట్కా తయారీదారుల నుంచి అధికార బీజేపీ నేతలకు ఎన్నికల ఖర్చుల కింద ఆర్థిక సాయం కోట్లలోనే అందుతోందని, అందుకే కేంద్ర వారిపట్ల పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఏపీ పరిస్థితి భిన్నంగా ఉందా?
ఏపీలో అధికారిక గుట్కాలు, మసాలాలతో పాటు కొందరు గుట్కా అక్రమంగా తయారు చేస్తూ మాఫియాగా తయారయ్యారు. గుంటూరులోని పొగాకు గిడ్డంగుల్లో నిషేధిత గుట్కాలను తయారు చేస్తూ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి రూ.300 కోట్లు వెనకేసుకున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పోలీసులు దాడి చేసి ఏదో ఒక చోట నిలువరించినా స్థావరం మార్చి మరోచోట గుట్కాల అక్రమ తయారీ ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. ఇక గుట్కాలు, పాన్ మసాలాల వినియోగానికి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక తయారీదారులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే గుట్కాలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోవడంతో తయారీదారులు కోర్టుల్లో అనుకూల తీర్పులు వచ్చే వరకు పోరాడుతున్నారని తెలుస్తోంది.
Also Read ;- 200 కేజీల గంజాయి సీజ్ చేసిన ఎన్సిబి అధికారులు