మూర్ఖత్వం, మూఢనమ్మకాలు, మూఢభక్తి ఇలాంటివి పెచ్చరిల్లి మతిలేకుండా వ్యవహరించేవాళ్లు మనకు అనేకులు కనిపిస్తూ ఉంటారు. విద్యావిజ్ఞానాలతో ఇలాంటి మూర్ఖత్వానికి సంబంధం లేదు. ఎందుకంటే.. ఎంతో బాగా చదువుకున్న వారు కూడా.. ఇలాంటి మూర్ఖమైన పనులు చేస్తుంటారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కూడా ఇలాంటి ఘోరం జరిగింది. మంచి జరుగుతుందనే నమ్మకంతో పెళ్లివయసుకు ఎదిగిన ఇద్దరు కూతుళ్లను, డంబెల్స్ తో కొట్టి చంపేసి.. వారి నోళ్లలో రాగిచెంబులు పెట్టి.. మరునాడు ఉదయం నిద్ర లేస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఎంతో చదువుకుని లెక్చరర్లుగా పనిచేస్తున్న వారి మూర్ఖత్వానికి ఇది పరాకాష్ఠ కాక మరేమిటి!
వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లా మదనపల్లి శివనగర్ లో ఒక దారుణం జరిగింది. కన్నతల్లి స్వయంగా ఇద్దరు కూతుర్లను కడతేర్చింది. పద్మజ- ఆమె భర్త ఇద్దరూ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు- సాయి దివ్య (22), అలేఖ్య(27) ఉన్నారు. దంపతులు ఇద్దరికీ భక్తి, పూజలు ఎక్కువ. ఈ భక్తి కాస్తా ముదిరి మూర్ఖభక్తిలాగా తయారైంది. పూజలు ముదిరి క్షుద్రపూజలు అయ్యాయి. ఇలాంటి పూజల మీద నమ్మకంతో వారు, కన్న కూతుళ్లను కడతేర్చారు. పద్మజ స్వయంగా డంబెల్స్ తో కొట్టి ఇద్దరు కూతుళ్లును చంపేసింది. వారి నుదురుమీద కాల్చి.. ఏదో అర్థంకాని పూజలు నిర్వహించారు. ఆ రెండు మృతదేహాల నోళ్లలో రాగిచెంబులు పెట్టి ఉంచారు. మరునాడు ఉదయం తెల్లవారిన తర్వాత.. తమ కుమార్తెలు ఇద్దరూ పునర్జీవితులు అవుతారని ఎదురుచూస్తూ కూర్చున్నారు.
ఎలాగోలా ఈ వ్యవహారం బయటకు పొక్కింది. విషయం పోలీసుల దాకా వెళ్లింది. పోలీసులు వచ్చి విచారించబోయినా… పద్మజ దంపతులు ఇద్దరూ వారిని కనీసం తమ ఇంట్లోకి కూడా రానివ్వలేదు. వారిని మాత్రమే కాదు.. గత కొన్ని నెలలుగా ఇంట్లోనే రకరకాల పూజలు నిర్వహిస్తున్న వారు.. ఎవ్వరినీ ఇంట్లోకి రానివ్వకుండానే గడుపుతున్నారు. తల్లి పద్మజకు మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు.
మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాత్రం.. పద్మజ దంపతులు ఇద్దరూ ఆధ్యాత్మిక చింతనలో మరో స్థాయికి వెళ్లిపోయారని అంటున్నారు. తల్లే డంబుల్స్ తో కొట్టి చంపిందని చెప్పారు. చనిపోయిన అమ్మాయిల తల్లిదండ్రులు బాగా చదువుకొని లెక్చరర్లుగా పని చేస్తున్నారు. వారు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని డీఎస్పీ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
సాంకేతికంగా ఎంతో పురోగమించిన ఇంతటి ఆధునిక సమాజంలో కూడా.. ఇలాంటి క్షుద్రపూజలు చేసే వాళ్లుండడం.. అది కూడా ఎంతో చదువుకున్న వారు.. ఇలాంటి పూజలకు తమ సొంత కూతుళ్లనే బలిచేయడం ఘోరం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Must Read ;- చేపలు కూర.. ఒకరి హత్య, ఏడుగురికి జైలు