కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. పొత్తు పొడిచిన వేళ.. తరచూ ఇరు పార్టీల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహించాలని, ఫలితంగా ఇరు పార్టీలూ కలిసి ముందుకు సాగే అవకాశాలుంటాయని కూడా ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. అయితే ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఈ సమన్వయ కమిటీ భేటీలు జరిగినా.. ఆ తర్వాత అసలు వీటి ఊసే కనిపించలేదు. అంతేకాకుండా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తామంటే.. లేదు తామే పోటీ చేస్తామంటూ ఇరు పార్టీలు వాదులాడున్నాయి. చివరికి రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లిన పవన్.. బీజేపీ అగ్రనేతలతో వరుస భేటీలు వేశారు. ఫలితంగా తిరుపతి బరిని బీజేపీకి వదిలేసిన జనసేన.. బీజేపీ అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా పరిగణించింది. ఆ తర్వాత కూడా ఇరు పార్టీల మధ్య సమన్వయ భేటీలు జరిగిన దాఖలా లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత శనివారం నాడు ఇరు పార్టీల మధ్య సమన్వయ కమిటీ సమావేశవం విజయవాడలో జరిగింది.
ఎవరువరు వచ్చారంటే..?
అనూహ్యంగా ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా హాజరయ్యారు. ఇదివరకు జరిగిన ఒకటి అరా సమన్వయ కమిటీ సమావేశాల్లో పవన్ కనిపించలేదు. జనసేన ప్రతినిధిగా ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ భేటీలకు హాజరయ్యారు. అయితే శనివారం నాటి సమావేశానికి మాత్రం నేరుగా పవనే హాజరు కావడంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ తో పాటు నాదెండ్ల కూడా ఈ భేటీకి రాగా.. బీజేపీ నుంచి కూడా పార్టీ ఏపీ శాఖ ఇంచార్జీ సునీల్ దేవధర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ తదితరులు హాజరయ్యారు. భేటీలో జగన్ సర్కారు అనుసరిస్తున్న వ్యూహాల మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వైనంపైనా సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఈ తరహా పరిస్థితికి అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? జగన్ కు బ్రేకులు వేసేలా ఏమేం చేయాలి? జగన్ అనాలోచిత నిర్ణయాలతో కష్టాల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి? ఇందుకోసం ఏం చేయాలి? అన్న అంశాలపై సుధీర్ఘంగానే చర్చ జరిగినట్టు సమాచారం.
కలిసి సాగితే జగన్ కు ఇబ్బందే
గతంలో మాదిరిగా కాకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగితే.. ఏపీలోని జగన్ సర్కారుకు ఇబ్బందేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు.. జగన్ సర్కారు తీరుపై ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. ఇష్టారాజ్యంగా అప్పులు చేయడంపై జగన్ సర్కారును హెచ్చరిస్తూ ఇప్పటికే కేంద్రం పలు లేఖలు రాసింది. లెక్కలన్నీ చెప్పాల్సిందేనని, తమ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని కూడా కేంద్రం కాస్తంత స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది. ఈ తరహా పరిస్థితిపై ఇప్పటికే విపక్ష టీడీపీ తనదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేస్తూ.. జగన్ సర్కారును ఆత్మరక్షణలో పడేసిందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో బీజేపీ, జనసేన కలిసి సాగితే.. జగన్ సర్కారుపై మరింత మేర ఒత్తిడి తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే.. అటు టీడీపీతో పాటు ఇటు బీజేపీ, జనసేనల ద్వయం జగన్ సర్కారుపై దండెత్తే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- జగన్ హద్దు దాటారు!