కరోనా సెకండ్ వేవ్లో దేశ వ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో కర్ఫ్యూలు మొదలయ్యాయి. మొదటి దశలో వచ్చిన దానికంటే ఈ సారి సెకండ్ వేవ్లో వస్తున్న కరోనా ప్రమాదకరంగా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు.. సెకండ్ మ్యుటేషన్ ఇప్పటి వరకు చూసినా.. థర్డ్ (త్రిపుల్) మ్యుటేషన్ (రెండు స్ట్రెయిన్లు కలిసిన కొత్త వైరస్ ) మరింత ప్రమాదకరంగా మారుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా థర్డ్ వేవ్ రాకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. త్రిపుల్ మ్యుటేషన్ స్ట్రెయిన్ల ద్వారా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని, మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్లలో ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్ కనిపించినట్లు మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ డా. మధుకర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి మ్యుటేషన్పై అధ్యయనం జరగాలని, జెనోమ్ సీక్వెన్సింగ్ కారణాలేంటనే అంశంపై అధ్యయనాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కాగా పలు మెడికల్ జర్నల్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
ట్రిపుల్ మ్యుటేషన్ అంటే..
రెండు కరోనా స్ట్రెయిన్స్ కలిపితే డబుల్ మ్యూటేషన్ కాగా ఆ డబుల్ మ్యూటేషన్ తన జన్యుపరమైన మార్పులతో ఆవిర్భవించిన కొత్త స్ట్రెయిన్నే (అంటూ కోవిడ్ మూడు రకాల వేరియంట్లు) ట్రిపుల్ మ్యుటేషన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం డబుల్ మ్యుటేషన్ కారణంగానే చిన్న పిల్లలకూ ఈ వైరస్ ప్రమాదకరంగా మారింది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొదటి వైరస్ (గతంలో వచ్చిన) సోకిన వ్యక్తి నుంచి ఒకరిద్దరికి మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందగా డబుల్ మ్యుటేషన్లో ఏడెనిమిది మందికి వ్యాప్తి చెందడంతోనే కేసులు పెరుగుతున్నాయని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే త్రిపుల్ మ్యుటేషన్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు. ఇటీవల 18 రాష్ట్రాల్లో సేకరించిన కోవిడ్ నమూనాల్లో ఒక కొత్త మ్యుటేషన్ వేరియంట్ కనిపించినట్లు పూణేలోని ఎన్ఐవీ అభిప్రాయ పడింది. జనవరి–మార్చి మధ్య కాలంలో సేకరించిన 361 నమూనాల్లో 61శాతం డబుల్ మ్యుటేషన్ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అంటే E484Q, L452R రెండు స్ట్రెయిన్లు కలిసిన వైరస్ని B1-617 గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ధిల్లీలో వస్తున్న కేసుల్లో డబుల్ మ్యుటేషన్ ఉన్నట్లు గుర్తించారు. తాజాగా పశ్చిమబెంగాల్లో త్రిపుల్ మ్యుటేషన్ కేసు బయటపడినట్టు పలు మెడికల్ జర్నల్స్ వార్తలను ప్రచురించాయి. B1-618గా దీన్ని పిలుస్తున్నారు. ఈ ట్రిపుల్ మ్యుటేషన్ కేసులు బెంగాల్లో బయట పడినట్లు తమకు సమాచారం అందినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొనడంతోపాటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- రెమ్డెసివిర్ ఇంజక్షన్ల ధరలు నిర్ణయించిన కేంద్రం

అధ్యయనానికి 10 ల్యాబ్లే..
కాగా జీనోమ్ సీక్వెన్స్పై పరిశోధనలు చేయడానికి దేశంలో పలు ల్యాబ్లు సిద్ధమైనా మొత్తం మీద 10 ల్యాబ్లకే ఆ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు కూడా దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. దేశంలో ఆగస్టు నాటికి దీనిపై స్పష్టత రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆసక్తి కలిగిస్తున్న కొవాగ్జిన్ ప్రకటన
కాగా డబుల్ మ్యుటేషన్, త్రిపుల్ మ్యుటేషన్లపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్కి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కొత్తరకం వైరస్ పైనా సమర్థవంతంగా పనిచేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి(ICMR) బుధవారం ప్రకటించింది. విజయవంతంగా బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్లపై పరిశోధన కూడా జరిగిందని, వీటిని కొవాగ్జిన్ అడ్డుకుందని వెల్లడించింది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్లను కూడా కొవాగ్జిన్ నిలువరిస్తోందని వెల్లడించింది. కాగా తమ సంస్థ నుంచి వచ్చిన కొవాగ్జిన్ టీకా తీసుకున్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని, అన్ని ప్రమాణాలు పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం, పరిశోధనలు పూర్తి చేసుకున్న తరువాతే వ్యాక్సిన్ బయటకు వచ్చిందని భారత్ బయోటెక్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు.
Also Read ;- రోజుకు 3లక్షలకు చేరుతున్నకరోనా కేసులు.. ఏపీలో ఆందోళనకరం











