నరేంద్ర మోదీని కొత్తగా చాయ్ వాలాగా పరిచయం చేశాడు. సోషల్ మీడియలో కొత్త ట్రెండ్ తెచ్చాడు. మొబైల్లోకి పాలిటిక్స్ తెచ్చేశాడు. మోదీని గెలిపించాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ని బిజెపిని ఎదురొడ్డి మరీ సీఎం చేశాడు. పంజాబ్లో అమరీందర్ సింగ్ని…ఏపీలో జగన్ని..తమిళనాడులో స్టాలిన్.. బెంగాల్ లో మమతను గెలుపుబాట పట్టించాడు. ఇప్పుడు ఎవరితో ఆట మొదలెట్టాడో..వారి ఆటే కట్టించాలనుకుంటున్నాడు. నరేంద్ర మోదీని ఆకాశమంత ఎత్తుకు ఎత్తి చూపించినవాడు..ఇప్పుడు ఆ పేరు ఎత్తితేనే మండిపడుతున్నాడు. ఏమైనా గద్దె దించాలని పట్టుబడుతున్నాడు. అతడే ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వ్యూహకర్త. పాలిటిక్స్ మెజీషియన్.
లెక్కల ఆధారంగానే వ్యూహాలు
కులం, మతం, ప్రాంతం అన్ని లెక్కలను పట్టుకుంటాడు. ఆ లెక్కల ఆధారంగానే వ్యూహాలు రచిస్తాడు.అవసరమైతే కుంపటి పెడతాడు.. కావాలనుకుంటే ఆ కుంపటిపై నీళ్లు పోస్తాడు. ప్రజల ఆలోచనల్లోనే ఏధో ఒక అలజడి రేపే ప్లాన్లు వేస్తాడు.. సక్సెస్ అవుతాడు. అందుకే అందరూ పీకెని వ్యూహకర్తగా పెట్టుకోవాలని కోరుకుని.. కోట్లకు కోట్లు చెల్లించుకుంటారు. బెంగాల్లో బిజెపిని సవాల్ చేసి మరీ ఓడించాడు. కాని ఫలితాల తర్వాత తానిక వ్యూహకర్తగా ఉండబోనని చెప్పాడు. ఇప్పుడు లేటెస్టుగా శరద్ పవార్తో సమావేశమయ్యాడు. వ్యూహకర్తగా ఉండనని..రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినవాడు శరద్ పవార్తో మీటింగు ఎందుకు పెట్టుకున్నాడు? అసలు తప్పుకుంటానని ఎందుకన్నాడు? ఇప్పుడు చేస్తున్నప్రయత్నాలు దేని కోసం?
మోదీని గద్దె దించాలనే..
నరేంద్ర మోదీని గద్దె దించాలనేదే అసలు లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రత్యామ్నాయంగా ధీటైన నాయకుడు కావాలి. రాహుల్ గాంధీని అలాగే చేయాలనుకున్నాడు పీకె. కాని కాంగ్రెస్ పార్టీని లైనులో పెట్టడం పీకె వల్ల కాలేదు. ఏ అభిప్రాయాన్ని కాంగ్రెస్ వారు పట్టించుకోకపోవడం.. రాహుల్ సైతం ఫాలో కాకపోవడం.. వారిలో వారు కొట్టుకుంటూ పార్టీని డ్యామేజ్ చేయడం వంటి పరిణామాలు.. పీకెకు చిరాకు తెప్పించాయి. అందుకే తానిక వ్యూహకర్తగా ఉండనని చెప్పాడు. అదే ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అంత పెద్ద పార్టీని గైడ్ చేయడం కష్టమని కూడా చెప్పాడు. అదే సమయంలో నరేంద్ర మోదీని ఓడించలేం.. మనకు ఆర్ధిక బలం లేదు..లాంటి పిచ్చిఆలోచనలు వదిలేయాలని కూడా చెప్పాడు. అక్కడే స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ మనోగతం అర్ధమైపోతుంది. మోదీని ఓడించాలి..రాహుల్ సరిగా పని చేయాలి..కాని కాంగ్రెస్ గాని..రాహుల్ గాని పీకె మాట వినలేదు.. తాననుకున్న లక్ష్యం నెరవేరటం లేదు..అందుకే విరక్తి చెందాడు.
ఏ నాయకుడిని ఎంచుకోవాలనే..
కాని మనసులోని లక్ష్యం పీకెని పీకుతూనే ఉంది. అందుకే శరద్ పవార్తో భేటీ. మోదీకి ప్రత్యామ్నాయంగా ఏ నాయకుడిని ఎంచుకోవాలనే దానిపైనే ఆ మీటింగ్ అని తెలుస్తోంది. దేశంలో ఎలాంటి రాజకీయ కూటమి రావాలి.. ఎవరు నాయకత్వం వహించాలి.. ప్రధాని అభ్యర్ధిగా ఎవరుండాలి వంటి అంశాలపైనే పీకె కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అవకాశాలూ ఉన్న రాహుల్ ఎటూ తేల్చటం లేదు. మరోవైపు ప్రజల్లో మోదీపై భ్రమలు తొలగిపోయాయనే విశ్లేషణలు వస్తున్నాయి. మోదీ ఇమేజ్ మసక బారిందని బిజెపిలోనే చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎక్స్పోజర్ పెంచుకోవాల్సిన రాహుల్ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయారు. కనీసం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా పూర్తి చేయలేకపోతున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ని ఫైనల్ చేయలేకపోతున్నారు.
మరి ప్రశాంత్ కిషోర్ రాహుల్నే లైనులో పెడతాడా..లేక వారితో పని కాదని..వేరే ఇంకెవరినైనా ముందుకు తెస్తాడా అనేది మరికొన్నిరోజుల్లో తేలిపోనున్నది.
Must Read ;- ప్రశాంత్ కిషోర్ VS బీజేపీ.. ఇక డైరెక్ట్ వార్