టాలీవుడ్లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే, ఎవరైనా సరే తడుముకోకుండా చెప్పే పేరు పూజా హెగ్డే. కాడమల్లెకు కళ్లూ .. ముక్కు తగిలించినట్టుగా నాజూకుగా కనిపించే ఈ భామ ఇప్పుడు అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆమె చేసిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి విజయాన్ని సాధిస్తూ ఉండటమే అందుకు నిదర్శనం. దాంతో తెలుగులోని స్టార్ హీరోలు మాత్రమే కాదు, తమిళ .. హిందీ భాషల్లోని స్టార్ హీరోలు కూడా ఈ మెరుపుతీగ తమ జోడీగా మెరవాలని ఉత్సాహపడుతున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు పెద్దలు. అలా చక్కబెట్టుకోవాలంటే ముందు ఇల్లు ఉండాలి గదా .. అందుకే ముందుగా పూజా హెగ్డే దానిపై దృష్టిపెట్టింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఇటీవలే ఓ ఖరీదైన ఫ్లాటును కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. త్రీ బెడ్ రూమ్స్ కలిగిన ఈ ఫ్లాటు ఖరీదు కొన్ని కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. అక్కడి నుంచి సముద్రపు అలలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చట. అదే అపార్టుమెంటులో చాలామంది సెలబ్రిటీస్ ఉంటున్నారట. అక్కడ ఒక ఇంటిదానిని కాగలినందుకు ఈ సుందరి సంతోషంతో పొంగిపోతోందని అంటున్నారు.
ఒకప్పుడు హీరోయిన్లు అందంగానే కాదు .. కొంత అమాయకంగా కూడా ఉండేవారు. ఎక్కడికి షూటింగులకు వెళ్లినా స్టార్ హోటల్స్ లో ఉంటూ నిర్మాతలు బిల్ కడితే, ఆ జ్ఞాపకాలతో ఇళ్లకి తిరిగి వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు .. హైదరాబాద్ .. చెన్నై .. బెంగుళూరు .. ముంబై ప్రాంతాల్లో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడే తమ ఇంట్లో ఉంటూ షూటింగులు చేసుకుంటున్నారు. ఆ తరువాత కాలంలో అవకాశాలు లేకపోయినా స్థిరాస్తులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడు పడిపోతుందో తెలియని గ్రాఫ్ ను పట్టుకుని వేళ్లాడుతున్నప్పుడు ఆ మాత్రం ముందుచూపు ఉండాల్సిందే మరి.
Must Read ;- పూజా హెగ్డేతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి!











