విశ్వశాంతి అనే సంస్థను స్థాపించారంటేనే ఆయన భావాలు ఎలాంటివో అర్థమవుతుంది. విశ్వశాంతి పిక్చర్స్ స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన యు. విశ్వేశ్వరరావు మరణం ఆయన సినిమా రంగానికి చేసిన సేవను ఓసారి గుర్తుచేస్తోంది.
విశ్వేశ్వరరావుది ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం. సినిమాల కోసం ఆయన స్టార్స్ కోసం వెంపర్లాడలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టులతోనే సినిమాలు చేశారు. చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఆయన. ఆయన సొంతూరు కృష్ణాజిల్లా గుడివాడ. సంపన్నుల కుటుంబంలో జన్మించినా మూడుసంవత్సరాల వయసులోనే తండ్రి మరణించారు. మేనమామచేరదీశారు. ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు అక్షరాభ్యాసమే జరగలేదు. వ్వయసాయ పనులు చూసుకుంటుంటే బావ దావులూరి రామచంద్రరావు చదువు విషయంలో ప్రోత్సహించారు.
అలా 14వ ఏట నుండి ముదినేపల్లి, గుడివాడ, ఏలూరు, విజయనగరాలలో చదువు కొనసాగించి బీఎస్సీ డిగ్రీ సంపాదించారు. గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తను ఎక్కడ చదువుకున్నాడో అక్కడే ఉద్యోగం.నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, పి.రాఘవరావు ఈయన దగ్గర చదువుకున్నవారే. ఆ తర్వాత గుడివాడలో జనతా ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పారు. మొదట్నుంచీ ఆయనకు రంగస్థల అనుభవం ఉంది. నాటకాలు వేశారు.. రాశారు.

ఆకలయ్యి అన్నమడిగితే..
ఆయన రాసిన గేయాలు అప్పట్లో చాలా ప్రసిద్ధి. ‘దేశోద్ధారకులు’ సినిమాలో ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు అనే పాట ఆయన రాసిందే. బాలు పాడిన ఈ పాటను సినిమాలో నటుడు పద్మనాభం మీద చిత్రీకరించారు. బావ దావులూరి ప్రోత్సాహంతోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. చెన్నై వచ్చిన తర్వాత పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో చేరారు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పనిచేశారు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమా నచ్చడంతో ఆర్ధికంగా ఏ లోటూ లేని ఆయన తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారారు.
ఆ సినిమా విడుదలై ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో విశ్వశాంతి పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించారు. బహుశా తన కుమార్తె పేరు శాంతి కావడం వల్లనేమో ఆయన నిర్మాణ సంస్థకు విశ్వశాంతి అని పేరు పెట్టారు. 1990లో తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలివచ్చినా ఆయన మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. విప్లవ భావాలతో కళాత్మక చిత్రాలు నిర్మిస్తూనే, కమర్షియల్ కథలతో కూడా సినిమాలు చేసి విజయం సాధించారు. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన మార్గంలో పయనించారు. ఆయన చిత్రాలకు దేశ విదేశాలలో మంచి పేరొచ్చింది.
ఇటు ప్రేక్షకుల రివార్డుటు, అటు ప్రభుత్వ అవార్డులు వరించాయి. అందుకే ‘విశ్వశాంతి’ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. కేవలం స్టార్స్ తోనే కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో చిన్న బడ్జెట్ తో కొత్త నటీనటులతోనూ సినిమాలు నిర్మించటానికి ప్రాధాన్యమిచ్చారు. ఈయన నిర్మించి దర్శకత్వం వహించిన ‘నగసత్యం’, ‘హరిశ్చంద్రుడు’ చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రాలుగా జాతీయ అవార్డులు సంపాదించాయి.
‘కీర్తి కాంత కనకం’తో ఉత్తమ దర్శకుడిగా, ‘పెళ్లిళ్ల చదరంగం’తో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డులు అందుకున్న ఘనత ఆయనది. 17వ నేషనల్ అవార్డ్ సెంట్రల్ జ్యూరీ మెంబర్గా పనిచేశారు. సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా చేశారు. విశ్వేశ్వరరావు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు మృతికి నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ కు వియ్యంకుడు
నందమూరి తారకరామారావు హీరోగా కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిశ్చంద్రుడు లాంటి హిట్ సినిమాలను ఆయన నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. ఆ తర్వాత ఎన్టిఆర్ తో వియ్యమందుకున్నారు. ఎన్టిఆర్ కుమారుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణను, విశ్వేశ్వరరావు కూతురు శాంతితో వివాహం జరిగింది. మోహనకృష్ణ, శాంతి కుమారుడే యువ హీరో నందమూరి తారకరత్న.
-హేమసుందర్
Must Read ;- నందమూరి హీరోలతో మల్టీస్టారర్ కు రెడీ అవుతోన్న స్టార్ డైరెక్టర్











