Roads In Andhra Pradesh :
రోడ్లు బాగుంటేనే ఊళ్లు బాగుంటాయి. ఊళ్లు బాగుంటే.. పరిశ్రమలు, పెట్టబడుల ప్రవాహం మొదలవుతుంది. పరిశ్రమలు తరలివస్తేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ప్రజల జీవన విధానం సైతం మెరుగుపడుతుంది. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా.. రోడ్లే ప్రధానం. రోడ్లే అధ్వానంగా ఉంటే ఇక అభివృద్ధి ఎలా జరుగుతుంది? రాకపోకలు ఎలా కొనసాగుతాయి? అనే విషయాలు ఏపీ ప్రభుత్వానికి పట్టన్నట్టు ఉన్నాయి. గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రహదారులపై గోతులు, గుంతలు ఏర్పడి ప్రమాదానికి నిలయాలుగా మారుతున్నాయి. కనీసం పాదాచారులు నడిచేందుకు వీలు లేదు. ద్విచక్ర వాహనాలు బురదలో ఇరుక్కుంటున్నాయి. ఇక బస్సులు, లారీలు అయితే ముందుకు కదల్లేని దుస్థితి నెలకొంది.
ప్రయాణం.. ప్రమాదకరం
ఆంధ్రప్రదేశ్ లోని ఏ రహదారిపై ప్రయాణించాలన్నా వాహనదారులు భయపడిపోతున్నారు. గుంతలు తేలి, గోతులు ఏర్పడి అస్తవ్యస్తంగా తయారుకావడంతో ప్రయాణం అంటేనే హడలెత్తిపోతున్నారు. కొన్నిచోట్లా ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక.. ఎక్కడ ఏప్రమాదం పొంచి ఉందో తెలియక తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. కిలోమీటర్ ప్రయాణానికే అరగంట సమయం పడుతుందంటే.. ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి రోడ్లపై రాత్రిపూట ప్రయాణించాలంటేనే నరకయాతన అనుభవించాల్సిందే. ఏమాత్రం ఆదమరిచి ముందుకెళ్లినా.. డైరెక్టర్ గా నరకానికి వెళ్లాల్సిందే..
ఎందుకింత నిర్లక్ష్యం
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలుచోట్ల రోడ్ల మరమత్తులు చేపట్టింది. లాక్ డౌన్ సమయంలో రోడ్ల మరమ్మతులు చేసి తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది. కానీ ఏపీ ప్రభుత్వం గత రెండేళ్లుగా మరమ్మతులు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. వర్షాలకు ముందే రిపేర్ చేసి ఉంటే రహదారులు బెటర్ కండిషన్లో ఉండేవి. సకాలంలో రుణాలు అందకపోవడం వల్లనే రోడ్ల మరమ్మతులు చేయలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. రహదారుల నిర్వహణకు 2020-21 బడ్జెట్లో రూ.220కోట్లు కేటాయించిప్పటికీ, రోడ్లకు మోక్షం జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘జగనన్న గుంతల పథకం’ వల్ల రోడ్లపై చేపలు పట్టాల్సి వస్తోందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- జగనన్న.. వైఎస్సార్ పెళ్లి కానుక ఏమైందన్నా?











