అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డిలకు ఇప్పుడు పెద్ది చిక్కే వచ్చి పడింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని జగన్పై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై నమోదైన అన్ని కేసుల్లోనూ జగన్ తొలి ముద్దాయిగా ఉంటే.. సాయిరెడ్డి రెండో ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులను ఆధారం చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులకు సంబంధించి చార్జిషీట్లను కూడా అటు సీబీఐ, ఇటు ఈడీలు కోర్టులకు సమర్పించాయి. అయితే తొలుత సీబీఐ కేసుల విచారణ చేపట్టాలని జగన్, సాయిరెడ్డిలు వాదిస్తున్నారు. ఈ వాదనతోనే ఈ కేసు విచారణను ఆ ఇద్దరూ ఎప్పటికప్పుడు వాయిదా పడేలా చేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఈ వాదనలకు చెక్ పెడుతూ ముందుగా ఈడీ కేసుల విచారణనే చేపడతామని సీబీఐ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా తేల్చి చెప్పాయి.
జిమ్మిక్కులు కుదరవు
అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానంటూ సాయిరెడ్డి చెబుతున్నారు. ఇదే మాటను సీబీఐ, ఈడీ కోర్టులకు చెబుతూ ఈడీ కేసుల విచారణను వాయిదా పడేలా చేస్తున్నారు. అయితే బుధవారం నాడు నాంపల్లిలోని సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈడీ కేసుల విచారణను తక్షణమే చేపట్టనున్నామని, ఈ విచారణలో తమ వాదనలను జగన్, సాయిరెడ్డి వినిపించాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారట. అంతేకాకుండా ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్లడం ఇక కుదరదని, నిందితులు తమ వాదనలను వినిపించకుంటే.. ఈడీ చెప్పిన మాట ప్రకారమే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారట. అంటే.. తదుపరి విచారణలో జగన్, సాయిరెడ్డి తమ న్యాయవాదులతో వాదనలు వినిపించక తప్పదన్న మాట. అలా కాని పక్షంలో ఈడీ వాదనలనే తుది వాదనలుగా పరిగణించి శిక్షలు ఖరారైపోతాయన్న మాట.
ఈడీ కేసుల విచారణ చాలా కష్టం
అయినా ఈడీ కేసుల కంటే సీబీఐ కేసులను తొలుత విచారణ చేపట్టాలని జగన్, సాయిరెడ్డి కోరడం వెనుక ఓ బలమైన కారణం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలు నిందితులపై మోపిన అభియోగాలకు సాక్ష్యాలను చూపించాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యాలు సరికాదని, దర్యాప్తు సంస్థల వాదనలను తిప్పికొట్టేందుకు నిందితులకు అవకాశం ఉంటుంది. అయితే ఈడీ కేసుల విచారణలో అలా ఉండదు. అభియోగాలను ఈడీనే మోపినా.. ఆ అభియోగాలు తప్పంటూ నిందితులు నిరూపించాల్సి ఉంటుంది. అంటే.. తమపై మోపిన అభియోగాలు తప్పని నిందితులే చెప్పుకోవాలి. ఆ మేరకు తమను తాము నిర్దోషులుగా నిరూపించుకోవాలన్న మాట. ఇది చాలా కష్టమైన పనే కదా. అందుకే కాబోలు.. ఈడీ కేసుల కంటే ముందుగా సీబీఐ కేసులను విచారించాలంటూ జగన్, సాయిరెడ్డి పట్టుబడుతున్నారు. అయితే వారి వ్యూహం ఇప్పుడు బెడిసికొట్టింది. ఈడీ కేసుల విచారణకు హాజరుకాకపోతే.. వారిద్దరితో పాటు మిగిలిన నిందితులు కూడా జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- శ్రీలక్ష్మి మళ్లీ జైలుకెళ్లక తప్పదా?