అంతరిక్షంలోకి అడుగిడుతున్న తొలి తెలుగు అమ్మాయిగా శిరీష బండ్ల చరిత్ర సృష్టించ బోతున్నారు. మరోసారి జులై 11న అంతరిక్ష ప్రయాణానికి వర్జిన్ గెలాక్టిక్ టీమ్ సిద్దమవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటించిన తమ టీమ్లో తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడ ఉండటం విశేషం. రోదసీ పర్యటనలను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్తో వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
వర్జిన్ గెలాక్టిక్లో పరిశోధనల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా..
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అంతకుముందు భారత్ మూలాలున్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్లు అంతరిక్షంలో అడుగు పెట్టినా తొలి తెలుగు అమ్మాయి శిరీష కావడం విశేషం.
ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకే..
అంతరిక్ష ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకే దీన్ని నిర్వహిస్తున్నట్లు రిచర్డ్ బ్రాన్సన్ చెప్పారు. జులై 11న మొదలయ్యే ఈ ప్రయాణంలో తనతో సహా 8 మంది అంతరిక్షంలోకి వెళ్తున్నట్టు ఆయన తెలిపారు. డేవ్ మెక్ కే , మైకేల్ మశుచి, సీజే స్టర్కో, కెల్లీ లాటిమర్ (ఈ నలుగురు పైలెట్లు), చీఫ్ ఆస్ట్రోనాట్ శిక్షకులు బెథ్ మోజెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కొలిన్ బెనెట్, శిరీష బండ్లలు వర్జిన్ గెలాక్టిక్ టెస్ట్‘ఫ్లైట్’లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
17 ఏళ్ల పరిశోధనల తర్వాత
మేలో తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ).. కమర్షియల్ లాంచ్ లైసెన్స్ను మంజూరు చేసిందని బ్రాన్సన్ చెప్పారు. అయితే, అంతకన్నా ముందు మరిన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని, వ్యోమగాముల అనుభవాల ఆధారంగా విశ్లేషణ చేస్తామని ఆయన తెలిపారు. దాదాపు 17 ఏళ్ల పరిశోధనల తర్వాత దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ నెల 11న జరిగే ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన వెల్లడించారు. తిరిగొచ్చేటప్పుడు మరింత మందికి అవకాశం ఇచ్చే ఓ మంచి విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.
శిరీష పూర్వీకులది తెనాలే..
తెనాలి అలంకార్ ధియేటర్ యజమాని, పురపాలక సంఘ మాజీ చైర్మన్ బండ్ల పుల్లయ్య చౌదరి మునిమనవరాలు శిరీష బండ్ల.శిరీష తండ్రి డాక్టర్ బండ్ల మురళీధర్ ,తల్లి అనురాధ. శిరీష తల్లిదండ్రులు చాలా కాలం క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. మైక్రోగ్రావిటీలో సబ్జెక్టులో నిష్టాతురాలయిన శిరీష యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని. అంతరిక్షంలోకి అడుగిడుతున్నతొలి తెలుగు అమ్మాయి శిరీష పూర్వీకులది గుంటూరు జిల్లా కావడంతో ఆ జిల్లా వాసులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
భారతీయులందరికీ గర్వకారణం: చంద్రబాబు
వర్జిన్ గెలాక్టిక్ నిర్వహించే అంతరిక్ష యానానికి అమెరికా భారత సంతతి అమ్మాయి శిరీష బండ్ల ఎంపిక కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా భారత సంతతి మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారని కొనియాడారు. తెలుగు మూలాలున్న శిరీష బండ్ల జులై 11న వీఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. రోదసి యానంలో సరికొత్త అధ్యాయానికి ఈ ప్రయాణం తెరలేపుతోందని, శిరీష బండ్ల ఇప్పుడు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తోందని చంద్రబాబు కొనియాడారు.
Must Read ;- ధాబాలో ప్లేట్లు కడిగి.. టోక్యో ఒలింపిక్స్ లో చోటు సాధించి!
Indian-origin women continue to break the proverbial glass ceiling and prove their mettle. On July 11th, @SirishaBandla with Telugu roots is set to fly to space aboard VSS Unity with @RichardBranson and the team marking the dawn of the new space age, making all Indians proud! pic.twitter.com/oecuztDRBe
— N Chandrababu Naidu (@ncbn) July 2, 2021











