దేశానికి రాజధాని నగరంలో రూ.65కే నోరూరించే రుచికరమైన చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? అని అడిగితే మీకు నవ్వు రావొచ్చు.. అడిగేవాడికి పిచ్చా.. అని అనుమానం పుట్టొచ్చు. ఆ రేటుకు అసలు చికెను ముక్క కూడా దొరకదని, వెజ్ బిర్యానీ కూడా రాదని అనిపించవచ్చు. కానీ.. అచ్చంగా చికెన్ బిర్యానీ మాత్రం దొరుకుతూ ఉండేది.. నిన్న మొన్నటి వరకు! ఢిల్లీలోని పార్లమెంటు క్యాంటీన్ లోని రేట్లు అవి!
కేంద్రంలోని మోడీ సర్కారు ఈ ధరలకు ‘ఇంకానా ఇకపై చెల్లదు..’ అని చరమ గీతం పాడేసింది. పార్లమెంటు క్యాంటీన్ లో ఆహార పదార్థాలపై ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే పార్లమెంటు సమావేశాల నాటినుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఇక పార్లమెంటు సభ్యలుందరూ పూర్తి ధరలు చెల్లించే తినాల్సి ఉంటుంది. లోక్ సభ స్పీకరు ఓం బిర్లా సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం చిన్నదిగా కనిపించవచ్చు గానీ.. ఒక ఏడాదిలో పార్లమెంటు క్యాంటీన్ లో ఫుడ్ మీద ప్రభుత్వం భరిస్తున్న సబ్సిడీ మొత్తం 17 కోట్ల రూపాయలు అని తెలిసినప్పుడు మాత్రం మనకు ఇది పెద్ద నిర్ణయమే అనిపిస్తుంది.
ఇప్పుడున్నవి పెరిగిన ధరలు..
ఇప్పుడంటే చికెన్ బిర్యానీ రూ.65కు, చికెన్ కర్రీ రూ.50 కు దొరుకుతున్నాయి. అయితే ఇవి పెరిగిన ధరలు అనే సంగతి గుర్తించాలి. 2015కు పూర్వం ఇంకా తక్కువ ధరలుండేవి. అప్పట్లో అప్పటి ఎంపీ, బీజేపీ నాయకుడు బైజయంత్ జే పాండా సబ్సిడీ ధరలను విమర్శించారు. ప్రభుత్వం కల్పించే సబ్సిడీలు పేదలకోసం మాత్రమే ఉండాలని సభలో అన్నారు. ఆ తర్వాత.. అప్పటి ధరలపై 50-70 శాతం వరకు అన్నీ ధరలు పెంచారు. అలా పెంచితేనే.. చికెన్ బిర్యానీ రూ.65కు వచ్చిందంటే.. అంతకు ముందు ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
పార్లమెంటు క్యాంటీన్ లో తినడం అందరికీ సాధ్యం కాదు. ఎంట్రీ పాస్ ఉన్నవారు మాత్రమే రాగలరు. ఎంపీలతో పాటు వారి సిబ్బంది, జర్నలిస్టులు, విజిటర్లు అక్కడ తింటారు. సాధారణంగా.. పార్లమెంటు సెషన్ జరుగుతున్న సమయంలో రోజుకు 4500 మంది క్యాంటీన్ లో తింటారనేది అంచనా.
Must Read ;- బర్డ్ ఫ్లూ దెబ్బకు దారుణంగా పడిపోయిన చికెన్ మార్కెట్
ఇంతకూ ఇప్పుడు కాలం చెల్లిపోయిన పార్లమెంటు క్యాంటీన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా?
బ్రెడ్ బటర్ రూ.6
టీ రూ.5
కాఫీ రూ.5
దోస/వడ రూ.12
బోండా రూ.7
దాల్ రూ.5
పోహా, ఉప్మా రూ.18
వెజ్ కర్రీ రూ.7
కేసరీ బాత్ రూ.24
చికెన్ కర్రీ రూ.50
చికెన్ ఫ్రై రూ.60
చికెన్బిర్యానీ రూ.65
మటన్ కరీ రూ.40
వెజ్ తాలి రూ.35
సూప్ రూ.14
చపాతీ రూ.2
ఖీర్ రూ.18
సలాడ్ రూ.9
ఎన్నెన్నో విమర్శలు
చట్టసభల ప్రతినిధులు తీసుకునే భారీ జీతాలు, పొందే సబ్సిడీల మీద ప్రతిసారీ ఎన్నెన్నో విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. గతంలో ఒక సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉండగా.. ఎమ్మెల్యేల వేతనాల పెంపును ప్రతిపాదించారు. జగన్ సహా అందరూ దానికి ముక్తకంఠంతో సమర్థించారు. అయితే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యతిరేకించారు. పెరిగే జీతాలతో బతుకు సాగించే ఎమ్మెల్యేలు మనలో ఎవ్వరూ లేరని.. ఎమ్మెల్యేలకు జీతాలు పెంచాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నట్లు ఆయన సభలోనే చెప్పారు. అయినా సరే.. బిల్లు యథాతథంగా ఆమోదం పొందింది.
పార్లమెంటు స్ఫూర్తితో అసెంబ్లీ క్యాంటీన్లలో కూడా ధరలు పెంచుతారో.. యథోరీతిగా.. సబ్సిడీ చవక ధరలను మన ప్రతినిధులు అనుభవిస్తారో చూడాలి. సబ్సిడీ ఎత్తేయడం అనే నిర్ణయం చాలా చిన్నదే అయినప్పటికీ.. చట్టసభల ప్రతినిధులకు ప్రత్యకంగా రాయితీలు ఇవ్వాల్సిన అగత్యం, బాధ్యత ప్రభుత్వానికి లేదనే పెద్ద సంకేతం దీని ద్వారా అందుతుంది.
Must Read ;- ఒళ్లు గుల్ల చేసేస్తున్న పెట్రోలు ధరల పెంపు











