అమరావతి రాజధాని భూ సేకరణ పేరుతో దళితులకు నష్టం కలిగించారని ఫిర్యాదులు వచ్చాయని చెబుతూ ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై, అప్పటి మంత్రి నారాయణపై సీఐడీ విభాగం ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు, నారాయణలు హైకోర్టును ఆశ్రయించగా నాలుగు వారాల పాటు హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని చెబుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ రైతులు ఎవరనేది మాత్రం అధికారికంగా అప్పట్లో బయటపెట్టలేదు. తాజాగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆ రైతుల వివరాలను పరిశీలిస్తే.. పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు నివాసం విషయంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యవహరించిన తీరుగానే ఈ ఫిర్యాదు కూడా ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
ఫిర్యాదు ఇదీ..
ఎస్సీ, ఎస్టీలకు, బలహీన వర్గాలకు భారీ నష్టం చేస్తూ గత ప్రభుత్వంలోని పెద్దలు లబ్ధి పొందారని… దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్టు సీఐడీ తెలిపింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణలను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ క్రైమ్ నంబర్ 5/2021 నమోదు చేయడంతో పాటు 166, 167, 217, 120 (బి) ఐపీసీ రెడ్విత్ 34, 35, 36, 37 ఐపీసీలతో పాటు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1), (ఎఫ్) (జి)లపైనా కేసు పెట్టారు. ఏపీ అసైన్డ్ చట్టం (పీవోటీ) 1977లోని సెక్షన్ 7ను కూడా చేర్చారు. ఈ మేరకు కొందరు దళిత రైతులు ఫిర్యాదు చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.

రైతులూ..ఫిర్యాదులూ..
ఈ కేసులో రైతుల నుంచి వివరాలు సేకరించే పనిలో ఉంది సీఐడీ. అయితే గత ప్రభుత్వ హయాంతో తమకు లాభమే జరిగిందని కొందరు, తమను మోసం చేయలేదని మరికొందరు రైతులు సీఐడీకి చెబుతున్నట్లు సమాచారం. అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా కొందరి ద్వారా ఫిర్యాదు చేయిస్తున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. మందడం గ్రామానికి చెందిన వెంగళదాసు రాజేశ్వరరావు, వెంగళదాసు నాగేశ్వరరావు, పిల్లి జోజయ్య అనే ముగ్గురు రైతులను సీఐడీ విచారించింది. అయితే తాము స్వచ్ఛందంగానే ఇచ్చామని వారు చెప్పినట్లు తెలుస్తోంది.
వలంటీరుగా పనిచేస్తున్న రైతు
ఇక మీడియాలో వస్తున్న కథనం ప్రకారం.. కె.పావని అనే రైతు వలంటీరుగా పనిచేస్తున్నారని ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈమెకి సంబంధించిన భూమి వ్యవహారంలో 40 సెంట్ల డీకే పట్టా భూమిని విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ భూమిని వెనక్కి ఇప్పిస్తామని చెప్పడంతో సంతకం చేశారని కథనంలో ఉంది. మరో రైతు..ఎ.సాంబశివరావుకి చెందిన భూ వ్యవహారంలో వివాదాలున్నాయి. ఈ వివాదాలు ఉన్నా..ఇద్దరు హక్కుదారులుగా చెబుతూ..వేరే వ్యక్తులకు ఆ భూమిని అమ్మడంతో వివాదం పెద్దదైంది. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఆ భూమిని కూడా వెనక్కి అప్పగిస్తామని చెప్పడంతో సంతకం చేసినట్టు వార్తలూ వస్తున్నాయి. మరో వ్యక్తిగా చెబుతున్న జే. జాన్సన్ పేరు తెరపైకి వస్తున్నా.. రాజధాని ప్రాంతంలో లేని భూమి విషయంలో ఈ ఫిర్యాదు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఫిర్యాదిదారు పి. చిన లక్ష్మయ్య భూమి ఇవ్వలేదని, అయితే మీ తల్లిపేరుతో భూమి ఉందని చెప్పడంతో సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇలాగే మరికొన్ని ఫిర్యాదుల్లోనూ వాస్తవాలేంటి అనే విషయంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సీఐడీ విచారణ ఓవైపు సాగుతుండగా కొందరు రైతులపై అధికార పార్టీ ఒత్తిడి చేసి మరీ ఫిర్యాదులు చేయిస్తోందనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. మరి ఈ కేసులో ఫిర్యాదులు, ఆరోపణలు ఎంతవరకు నిలబడతాయనేది రానున్న కాలంలో తేలనుంది.
Must Read ;- కేసులు వెనక్కు తీసుకోకుంటే ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతాం : మార్టిన్











