(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా మత్స్యకార గ్రామాలలో పెద్ద గ్రామమైన వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో అనాదిగా ఒక ఆచారం ఉంది. ఆ గ్రామంలో మూడేళ్లకు ఒకసారి సామూహిక వివాహాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఊరంతా పందిరి వేస్తారు. ఇంటింటా సందడి నెలకొంటుంది. సుమారు 100 నుండి 200 జంటలు ఒకేసారి వివాహం చేసుకుంటుంటారు. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలు, విందులు, వినోదాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. దీన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్ఘఢ్ తదితర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు. అటువంటి సామూహిక వివాహాలు ఆదివారం రాత్రి జరిగి అందరిలోనూ ఆసక్తిని కలిగించాయి.. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు. కారణాలేమిటి, దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటో తెలుసుకుందామా మరి!
మూడు శతాబ్దాలుగా ..
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు .. సంప్రదాయ మత్స్యకార గ్రామం. వీరిది కేవిటీ కులం. ఈ గ్రామంలో సుమారు 12 వేల జనాభా ఉంది. వీరిది ఒడిశా సంప్రదాయం. దాదాపు 300 ఏళ్ల నుంచి సామూహిక పెళ్లిళ్లు చేస్తున్నట్లు గ్రామపెద్దలు చెబుతున్నారు. వీరి పూర్వీకులు ఇప్పటికీ ఒడిశా రాష్ట్రం సుర్ల, సుమండి ప్రాంతాల్లో ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. సామూహిక వివాహాలు చేయడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు అధిగమించగలమంటున్నారు. అధిక జనాభా కలిగిన గ్రామం కావడంతో ఒకేసారి పెళ్లిళ్లు చేస్తే విందు, ఇతర నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఊరంతా పందిరి, విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, మైక్సెట్ శబ్ధాల నడుమ ఒకేసారి వివాహాలు చేయడం అత్యంత ఆనందం కలిగిస్తుందని చెపుతున్నారు. వధూవరుల బల ప్రదర్శన, గవ్వలాట కార్యక్రమాలు ఈ సందర్భంగా మరింత ఆకర్షణకు కలిగిస్తాయని అంటున్నారు. ఈ సందర్భంగా బంధుమిత్రుల కలయిక, కోలాహలం మధురానుభూతిగా మిగులుతుందని, అందువల్ల దశాబ్ధాలుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నామని ఆ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.
Must Read ;- తెలుగు సినిమా శారీ.. కనిపించవా ఓసారి