విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్రతో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్కు ఉన్న అనుబంధం ఏంటో రెండు తెలుగు రాష్ట్రాల వారీకీ తెలుసు. తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం, ఏపీ సీఎం జగన్ కోసం ఆయన యాగాలు చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. వారికి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఇక వారు విశాఖ శారదాపీఠానికి వెళ్తే.. వాళ్లకి ఇచ్చే మర్యాదలు వేరు. ఏపీలో వైసీపీ నాయకుల స్వామి వారి ఆశీస్సుల కోసం తపిస్తుంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
కాస్త భిన్నంగా..
సాధారణంగా ఉగాది అంటే ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణ కార్యక్రమాలదే ప్రత్యేకత. వ్యక్తిగత, ప్రాంతీయ, జాతీయ, రాశుల వారీగా, రంగాల వారీగా పంచాంగ శ్రవణాలు ఉంటాయి. అందులో భాగంగా ఆయా సంస్థలు, వ్యక్తులు, పార్టీలు వారివారి ఆస్థాన పండితులతో లేదా నమ్మకమైన పండితులతో పంచాంగం చెప్పించుకుంటారు. ఇక శారదాపీఠంలోనూ అదే జరిగింది. కాకపోతే..ఆ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర కాస్త భిన్నంగా చెప్పారు. చెప్పీ చెప్పనట్లుగా ఓ పెద్ద నేతకు కష్టాలుంటాయని చెప్పారు. అదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ల జాతకం బాగుందని చెబుతూనే పెద్దనేతకు కష్టాలు తప్పవని చెప్పారు. ఆ పెద్ద నేత పేరు మాత్రం చెప్పలేదు.
చెప్పీ..చెప్పకుండా..
శారదా పీఠం ఆధ్వర్యంలోని ఉగాదిని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఇద్దరూ పంచాగాన్ని పఠించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ ప్లవ నామ సంవత్సరాన్ని ప్రస్తావిస్తూ.. ప్లవ అంటే నావ అనే అర్థం వచ్చేలా..కష్టాల కడలిని దాటేందుకు సహాయపడుతుందన్నారు. ప్లవ నామ అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపుతుందని వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలైన వికారి, శార్వరి నామ సంవత్సరాల కాకుండా ఈ ప్లవ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్, జగన్ల జాతకాలు బాగున్నాయన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకాలు తొలగుతాయని పరోక్షంగా సూచించారు. గ్రహాల అనుకూలత అంతగా లేకుండా..మంచే జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. అదే సమయంలో ఈ ఏడాది ఓ పెద్ద నేతకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుంటాయని వ్యాఖ్యానించారు. ప్లవ నామసంవత్సరంలో భగవంతుడ్ని, రాజశ్యామల ఆరాధనను విశేష అర్చనలు నిర్వహిస్తామని చెప్పారు. పంటలు బాగా పండాలని, అన్ని వర్గాలవారూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా..ఆ పెద్ద నేతకు కష్టాలు అనే అంశమే చర్చకు వస్తోంది.
ఎవరా పెద్దనేత..
స్వామి స్వరూపానందేంద్ర చెప్పిన ఆ పెద్ద నేత ఎవరా అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్దనేత, ఏపీకి చెందిన పెద్ద నేత, లేదా దేశానికి సంబంధించిన పెద్దనేతకు ఇబ్బందులు వస్తాయా..అనే చర్చ నడుస్తోంది. ఇదే అదనుగా వైసీపీ వారు మాత్రం పరోక్షంగా ఓ నాయకుడి పేరును ప్రస్తావిస్తూ..ఆయనకే ఆ కష్టాలని కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
పంచాంగం అలా కూడా చెబుతుందా..
ఇక సాధారణంగా పంచాంగం, జాతకం చెప్పించుకుంటే (నమ్మకం ఉన్నవారు) ఆ పంచాంగం చెప్పేవారు 90 శాతం వరకు బాగానే ఉందని చెబుతారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెబుతూనే వాటి పరిష్కారానికి ఏ పూజలు చేయాలి.. ఏ యాగాలు చేయాలి..అనేది చెబుతారు. అంతేగాని ఎవరో ఎక్కడో ఉన్న వ్యక్తులకు కష్టాలు వస్తాయని చెప్పడం సాధారణంగా జరగదు. అలా చెప్పాల్సి వస్తే..ఆయన కుటుంబీకులతో, శ్రేయోభిలాషులకో, సంబంధీకులకో చెబుతారు. కాని బహిరంగంగా చెప్పరు. ఓవైపు గ్రహాలు అనుకూలంగా లేకున్నా.. అంతా బాగానే ఉంటుందని భావిస్తున్నామని చెప్పిన స్వామి, వారికి పలానా పెద్దనేతకు కష్టాలు వస్తాయని గ్రహాలు ఏ కోణంలో చెప్పాయనే చర్చకూడా మొదలైంది. ఆ పెద్దనేతకు కూడా గ్రహాలు అనుకూలంగా లేకున్నా.. ఆయన పరిస్థితి బాగానే ఉంటుందని ఎందుకు భావించకూడదనే ప్రశ్నకూడా తలెత్తుతోంది. తమ వారి మెప్పు కోసం ఓ పెద్దనేత అని వ్యాఖ్యానించడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక్కడే సోషల్ మీడియాలో పరోక్షంగా మరికొన్ని కామెంట్లూ వస్తున్నాయి. ఏపీలో ఆలయాలపై దాడులు, దాష్టీకాలు, విగ్రహాల ధ్వంసం విషయాల్లో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప.. స్పందించని వ్యక్తులు ఇప్పుడు పంచాంగ శ్రవణంలోనూ పరోక్షంగా పెద్దనేతకు కష్టాలు అని వ్యాఖ్యానించడం ఏంటనే అంశంపై పలువురు పండితుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో జరగాల్సింది జరగకుండా ఉండదు..జరగనిది ఎన్నటికీ జరగదు.. అంతిమ విజయం ధర్మానిదే అనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి.
Must Read ;- జగన్, స్వామిలు పొగుడుకుంటున్నారు.. ఇచ్చిపుచ్చుకుంటున్నారు!