ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అందుతుందన్న విషయం తెలియగానే.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అప్రమత్తమైపోయాయి. ప్రజలపై వరాల జల్లులు కురిపించాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో ఈ జల్లు కాస్తంత ఎక్కువగానే కురిసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని గంటల ముందు కూడా తమిళనాడు, పశ్చిమబెంగాల్ సీఎంలు ఓటర్లపై వరాల జల్లు కురిపించారు.
సహకార బ్యాంకులు, సహకార సంఘాల నుంచి మహిళా స్వయం సహాయక బృందాలు పొందిన రుణాలను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి.. శాసనసభలో ప్రకటించారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వారి రుణాలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వన్నియార్ సామాజిక వర్గానికి బీసీ, ఓబీసీ రిజర్వేషన్లలో 10.5% అంతర్గత కోటా ఇస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ ఉపాధి హామీ పథకం తరహాలో.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర పట్టణ ఉపాధి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పథకం కింద దినసరి కూలీలకు ఇస్తున్న వేతనాలను మూడు వర్గాలుగా విభజించారు. నైపుణ్యం లేని కూలీలకు రోజు వేతనాన్ని రూ.144 నుంచి రూ.202కి; ఓ మాదిరి నైపుణ్యం కలిగిన కూలీల దినసరి వేతనాన్ని రూ.172 నుంచి రూ.303కి పెంచారు. కొత్తగా నైపుణ్యం కలిగిన కూలీల పేరిట వర్గాన్ని ఏర్పాటుచేసి.. వీరికి దినసరి వేతనం రూ.404గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో 56,500 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని మమత ట్వీట్ చేశారు. మరి ఓట్ల వీరి పాట్లు ఎంత వరకు ప్రజల ఆదరణ పొందుతాయో తెలియాలంటే.. మే 2 వరకు ఎదురు చూడక తప్పదు.
Must Read ;- దక్షిణాదిలో ఒకే విడత.. పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో











