ప్రజా సమస్యలపై ఇటీవలి కాలంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తున్న తీరుతో ఏపీలోని జగన్ సర్కారు ఇబ్బందుల పాలు అవుతోంది. కర్నూలు జిల్లా పెసరవాయిలో ఇద్దరు టీడీపీ నేతలను పొట్టనబెట్టుకున్న వైనంపై తనదైన శైలి ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్.. కేడర్ కు అండగా తానున్నానంటూ భరోసా ఇచ్చారు. స్వయంగా పెసరవాయి వెళ్లిన లోకేశ్.. టీడీపీ నేతల అంతిమ యాత్రలో పాలుపంచుకుని.. బాధితుల కుటుంబాలకు ధైర్యం చెప్పిన తీరుపై నిజంగానే ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పార్టీ శ్రేణుల్లో తమకు అండగా లోకేశ్ ఉన్నారన్న భరోసా కూడా కలిగింది. ఈ తరహాలోనే లోకేశ్ సాగితే.. వచ్చే ఎన్నికల నాటికి తమకు ఇబ్బంది తప్పదేమోనని వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కాబోలు.. ఆ తర్వాత లోకేశ్ ఎక్కడికి వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తోంది. అడ్డంకులు కల్పిస్తే.. లోకేశ్ తగ్గుతారని వైసీపీ భావించినట్టుగా ఉంది. అయితే లోకేశ్ జగన్ సర్కారు అడ్డగింతలకు భయపడలేదు కదా.. ఏకంగా జగన్ సర్కారునే భయపెట్టేశారు.
క్షణాల్లో సీఎం చెంతకు రమ్య కుటుంబం
లోకేశ్ దెబ్బకు జగన్ సర్కారు భయపడిందా? అంటూ చాలా మంది సెటైరిక్ వ్యాఖ్యలు చేయవచ్చు గానీ.. గురువారం వరుసగా చోటుచేసుకున్న పరిణామాలను ఓ సారి పరిశీలిస్తే.. లోకేశ్ అంటే జగన్ ఎంతగా భయపడిపోతున్నారో ఇట్టే అర్థం కాక మానదు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరిగి ఇప్పటికే 20 రోజులు కావస్తోంది. రమ్య హత్యకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలు ఎంతగా కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతోనే విమర్శలు వచ్చే ముందుగానే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించిన ప్రభుత్వం.. నిందితుడిని కూడా అరెస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత రమ్య కుటుంబాన్ని పరామర్శించిన దాఖలా కనిపించలేదు. అయితే నరసరావుపేటలో ఏడు నెలల క్రితం హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం లోకేశ్ బయలుదేరితే.. ఆయనను అడ్డగించి అరెస్ట్ చేసి.. చివరకు పెటీ కేసు పెట్టిన పోలీసులు ఉండవల్లి ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను జనం మరిచిపోక ముందే.. సాయంత్రానికంతా రమ్య కుటుంబం సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమైంది. హోం మంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున.. రమ్య తల్లిదండ్రులతో పాటు ఆమె సోదరిని కూడా తాడేపల్లికి తీసుకొచ్చి సీఎంతో భేటీ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు వెలువడినంతనే.. లోకేశ్ నరసరావుపేట పర్యటన భయంతోనే రమ్య కుటుంబ సభ్యులతో సీఎం జగన్ భేటీ అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే.. లోకేశ్ ను భయపెట్టబోయిన జగన్.. లోకేశ్ దెబ్బకు తానే భయపడిపోయారన్న మాట.
జగన్ పై లోకేశ్ అదిరేటి సెటైర్లు
తనను నరసరావుపేట వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ లోకేశ్.. చేసేది లేక చివరకు పోలీసులు చెప్పినట్టుగానే ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన లోకేశ్.. జగన్ పై సెటైర్ల వర్షం కురిపించారు. ‘‘నేను దొంగను కాదు. ఫ్యాక్షన్ లీడర్ ను కాదు. జగన్ రెడ్డిని అసలే కాదు. మరి నన్నెందుకు నరసరావుపేట వెళ్లకుండా అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన పోలీసులు చివరకు సీఆర్పీసీ 41 పేరిట ఓ లవ్ లెటర్ ఇచ్చారు’’ అంటూ లోకేశ్ సెటైర్లు సంధించారు. ఆ తర్వాత తనదైన శైలిలో స్పందించిన లోకేశ్.. రాష్ట్రంలో లైంగిక వేధింపులు, ప్రేమోన్మాదుల దాడులకు గురైన వారు 516 మంది ఉన్నారని, వారి కుటుంబాలన్నింటినీ పరామర్శిస్తానని సంచలన ప్రకటన చేశారు. మొత్తంగా తనను భయపెట్టాలని చూసిన జగన్ సర్కారు, ఏపీ పోలీసులను లోకేశ్ బెదరగొట్టారని చెప్పాలి.
Must Read ;- బరితెగింపు.. లోకేశ్ పై మ్యాన్ హ్యాండ్లింగ్