Double Electricity Connection Will Stop Your Social Security Pension :
ఏపీలో సామాజిక పింఛన్ల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ఇదేదో.. ఒక ఏడాదిలోనో, లేదంటే రెండేళ్లలోనూ క్రమంగా తగ్గుతున్నది కాదు.. కేవలం ఒకటి, రెండు నెలల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. విపక్షాల ఆరోపణల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికే 2.50 లక్షల మంది పింఛన్లకు జగన్ సర్కారు కోత పెట్టింది. అయితే ఈ సంఖ్య 10 లక్షల మేర ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. ఉన్నదే 60 లక్షల పైచిలుకు పింఛన్లు ఉంటే.. వాటిలో ఒకే నెలలో ఏకంగా 10 లక్షల పింఛన్లకు కోత అంటే.. మామూలు విషయం కాదు కదా. ఈ మాట విపక్షాల నోట నుంచే వస్తున్నా.. వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే.. విపక్షాల మాట వాస్తవమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒక కార్డుకు ఒకటే పింఛన్
ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. దానిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. చంద్రబాబు స్పందనతో సదరు వీడియోలో ఉన్న ఇద్దరు వృద్ధులకు అధికారులు పింఛన్ మంజూరు చేశారు. ఆ వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వందేళ్ల వయస్సున ముదుసలి తల్లి, 80 ఏళ్ల వయసులో ఉన్న ఆమె కుమార్తెలిద్దరికీ ఒకే రేషన్ కార్డు ఉంటే.. జగన్ సర్కారు కొత్తగా తెచ్చిన నిబంధన ప్రకారం ఒక రేషన్ కార్డుకు.. ఒకటే పింఛన్ అంటూ వందేళ్ల బామ్మ పింఛన్ ను కొనసాగించిన అధికారులు 80 ఏళ్ల వృద్ధురాలి పింఛన్ మాత్రం తొలగించారు. సొంతిల్లు కూడా లేని తాము ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ తోనే బతుకు బండి లాగిస్తున్నామని సదరు మహిళ వినిపించిన ఆవేదనతో చంద్రబాబు చాలా వేగంగా స్పందించారు. చంద్రబాబు స్పందనతో కళ్లు తెరచుకున్న అధికారులు ఇద్దరికీ పింఛన్ కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించారు. విషయం వెలుగు చూసింది కాబట్టి సరిపోయింది గానీ.. అసలు బయటకు రాకుండా ఇలాంటి ఘటనలు ఇంకెన్ని ఉన్నాయోనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పుడు కూడా పగోజిలోనే..
ఇక ఇప్పుడు జగన్ సర్కారు పింఛన్ల కోతకు మరో కారణాన్ని ఎంచుకుంది. ఒకటి కంటే ఎక్కువ కరెంట్ కనెక్షన్ లు ఉన్న వారు పింఛన్లకు అనర్హులేనని జగన్ సర్కారు నిర్ధారించింది. ఇదే కారణాన్ని ఆధారం చేసుకుని అధికారులు లెక్కలేనన్ని పింఛన్లను కోసేశారట. మొన్న ఒకటో తేదీ నాడు చేతికందుతుందనుకున్న పింఛన్ రాకపోవడంతో ఆరా తీస్తే.. మీ పేరిట రెండు విద్యుత్ కనెక్షన్లున్నాయి.. అందుకే పింఛన్ తొలగించారు అని చెప్పారట. దీంతో తమ పేరిట తమకు తెలియకుండా రెండు విద్యుత్ కనెక్షన్లు ఎలా ఉన్నాయబ్బా అంటూ లబ్దిదారులంతా విద్యుత్ శాఖ కార్యాలయాలకు పరుగులు పెట్టారు. తమ పేరిట ఎన్ని విద్యుత్ కనెక్షన్లున్నాయో చెప్పండి బాబు.. అక్కడ మా పింఛన్లన్నీ నిలిచిపోయాయి అంటూ ట్రాన్స్ కో కార్యాలయాలకు పోటెత్తుతున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందట. పై ఫొటోలో ఉన్నది కూడా అలా విద్యుత్ కార్యాలయాలకు వచ్చిన వారే. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని పట్టణ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయానికి ఇలా బాధితులు క్యూ కట్టారట. మొన్న ఇద్దరు వృద్ధుల ఘటన కూడా ఈ జిల్లాకు చెందినదే కావడం గమనార్హం.
Must Read ;- జగన్ ను నమ్మి అమూల్ నిండా మునిగిందే!