తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా కాంగ్రెస్, బీజేపీలు ప్లాన్లు రచిస్తుంటే.. హస్తం, కమలం పార్టీలు టీఆర్ఎస్ ను గద్దె దించే వ్యూహానికి పదును పెడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఈ తరహా వ్యూహాలతో తెలంగాణ రాజకీయం బాగా హీటెక్కిపోయిందనే చెప్పాలి. మిగతా పరిణామాలు ఎలా ఉన్నా.. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే. సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పంటికింద రాయిలాగా తగులుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే కొనసాగుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డిని పడగొట్టేందుకు టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
రేవంత్ ఓటమే లక్ష్యం
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం.. రేవంత్ ని ఓడించేందుకు భారీ కసరత్తే జరిగింది. రేవంత్ కి కంచుకోటలా ఉండే కొడంగల్ లోనే.. ఆయనను స్వల్ప మెజార్టీతో ఓడించారు. రేవంత్ ని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసేందుకు కేసీఆర్ చేసిన విశ్వ ప్రయత్నాలు సఫలమయ్యారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలా ఓడించడం అంత సులువు కాదని తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ఆ కొడంగల్ నియోజకవర్గాన్ని.. టీఆర్ఎస్ తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని అధికార టీఆర్ఎస్ ఇప్పటి నుంచే భారీ స్కెచ్చులు వేస్తోంది. ఈ క్రమంలో కొడంగల్ పై కేసీఆర్ తన స్టైల్లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
కొడంగల్ కే ఎందుకంటే..?
దళిత బంధులాగే.. అన్ని వర్గాలకు అలాంటి పథకమే తీసుకొస్తానని కేసీఆర్ చెబుతున్నారు. ఈ క్రమంలో కొడంగల్లో గిరిజన బంధు ఆస్త్రాన్ని ప్రయోగించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ 10 శాతానికి పైగా ఓట్లు ఆ సామాజికవర్గానికి చెందినవే ఉండటంతో గిరిజన బంధు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ను ఎంచుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో ప్రభుత్వంపై పోరాటం చేస్తుండటంతో.. ఆయనకు అదే దారిలో కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం. కేసీఆర్ ఇటీవల కొడంగల్లో నిర్వహించిన సర్వేల్లో అన్ని వర్గాల్లోనూ టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కనిపించిందని తెలుస్తోంది. అందుకే.. రేవంత్ కి వ్యతిరేకంగా అక్కడి ప్రజలను ఆకర్షించేలా.. ఈ గిరిజన పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేలా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే.. కొడంగల్ లో గిరిజన బంధును ప్రారంభించాలని కేసీఆర్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారట. అంటే.. ఇప్పుడు రేవంత్ కూడా కొడంగల్ పై ప్రత్యేక దృష్టి సారించక తప్పదన్న మాట.
Must Read ;- రేవంత్ సభలకు వచ్చేవారికి ఏమిస్తున్నారు?