వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వైసీపీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ లేఖల దాడి చేస్తున్నారు. గతంలో జగన్ సర్కారు ఇచ్చిన హామీలను స్పష్టంగా బహిర్గతం చేస్తున్నారు. ఏదో కక్ష సాధింపు చర్యగా కాకుండా.. ఏపీ ప్రజల ప్రయోజనాల గురించి లేఖలు రాస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. జర్నలిస్టుల సమస్యలు, విద్యార్థుల పరీక్షలు, శాసనమండలి రద్దు, పంచాయతీ రాజ్ వ్యవస్థ లాంటి కీలక అంశాలపై లేఖలు రాసి, ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాలపై లేఖలు రాసిన రఘురామరాజు తాజాగా పేదల ఇళ్లపై లేఖ సంధించారు.
ఇన్నిసార్లు శంకుస్థాపనలా?
‘నవ సూచనలు’ పేరుతో రఘురామరాజు లేఖ రాశారు. ఈ లేఖలో.. గూడు లేక పేదలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. ఏపీలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్లాన్ చేసిందని, మొదటగా రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి రూ.70,000 కోట్లకు పెంచిందని ఆరోపించారు. ఇవన్నీ పక్కన పెట్టి, మళ్లీ కొన్ని నివాసాలకు శంకుస్థాపన చేయబోతున్నారని, ఇన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తుంటే.. యమలీల సినిమా గుర్తుకొస్తుందని తనదైన శైలిలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. ‘మా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ’’ డైలాగ్ గుర్తుకు వస్తోంది అంటూ రఘురామరాజు పంచ్ డైలాగ్ పేల్చారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మెరుగైన సౌకర్యాలతో ఇళ్లను నిర్మించి ఇస్తేనే.. పేదలు ఉండలేదని గుర్తుచేశారు. కనీస వసతులు లేకుండా పేదలకు ఇళ్లు ఇస్తే ఎలా ఉంటారని ప్రశ్నించారు. పేదల ప్రయోజనాల గురించి ఆలోచించి ప్రభుత్వం వెంటనే అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓం బిర్లాకు..
రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టిన వైనంపై రఘురామరాజు గతంలోనే లోక్సభ స్పీకర్, కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. అన్ని రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడా లభించింది. తాజాగా… వైసీపీ ప్రభుత్వం వేధిస్తుందని, చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని లోక్సభ సభాపతి ఓం బిర్లాకు లేఖ రాయడం కూడా సంచలనంగా మారుతోంది.
Must Read ;- పేదల జగనన్న ఇళ్లు త్వరగా పూర్తి చేయండి : ఎంపీ రఘురామరాజు లేఖ











