వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. జగన్ పై లేఖల దాడి కొనసాగిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో, పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ జగన్ సర్కారును నడిబజారులో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక అంశాలపై లేఖలు రాసిన రఘురామరాజు సోమవారం మరో లేఖను సంధించారు. శాసనమండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెజార్టీ ఉన్నప్పుడు మండలిని రద్దు చేస్తే.. ప్రజలు పార్టీ చిత్తశుద్ధిని నమ్ముతారన్నారు. మెజార్టీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సందేహాలను తీర్చాలంటే సభలో మెజార్టీ ఉన్న సమయంలో మండలిని రద్దు చేయాల్సిందేనని తన లేఖలో పేర్కొన్నారు. మండలిని కొనసాగించడం వృథా అని స్వయంగా పేర్కొన్న జగన్ వ్యాఖ్యలను ో వైపు జనం గుర్తు చేస్తుంటే… విలాసాల కోసమే జగన్ రూ.26 కోట్లు ఖర్చు చేశారని మరోవైపు విపక్షాలు ఆరోపిస్తున్న వైనాన్ని ఆ లేఖలో రఘురామరాజు ప్రధానంగా ప్రస్తావించారు.
60 కోట్లు అవసరమా?..
గతంలో సీఎం జగన్ మండలిపై పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైనం తెలిసిందే. మండలి అనేది సలహాలు, సూచనలు ఇవ్వడానికి మాత్రమే అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఉండగా మండలి అవసరం ఏముందని జగన్ నాడు తేల్చి చెప్పారు. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రానికి ఉపయోగం లేని మండలి అవసరమా? అని ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రశ్నించారు. ఈ తరహా వ్యాఖ్యలన్నీ జగన్ సర్కారు నిర్ణయాలను దునుమాడుతూ సంచలన నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా వినిపించినవే. ఏపీకి మూడు రాజధానులంటూ జగన్ సర్కారు చేసిన తీర్మానాన్ని తిప్పి పంపుతూ మండలి వ్యవహరించిన సందర్భంగా జగన్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా మండలి అవసరం లేదని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలన్నింటినీ ప్రస్తావిస్తూ రఘురామరాజు తన తాజా లేఖలో ప్రస్తావించారు.
గౌరవం పెరుగుతుందిగా
శాసన మండలిలో మెజారిటీ లేని సమయంలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఇప్పుడు మెజారిటీ ఉన్న సమయంలో మండలిని రద్దు చేయడం ద్వారా జనంలో పార్టీకి మైలేజీ పెరుగుతుందని, వ్యక్తిగతంగా జగన్ కు కూడా జనంలో గౌరవం పెరుగుతుందని… మొత్తంగా పార్టీకి సుదీర్ఘ ప్రయోజనాలు చేకూరుతాయని రఘురామరాజు తన లేఖలో సూచించారు. ఇచ్చిన మాట మీద నిలబడే నేతగా తనను తాను ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకునే జగన్… ఆ తరహా అభిప్రాయాన్ని జనంలో మరింతగా పెంచేందుకు మండలి రద్దు బాగా ఉపయోగపడుతుందని రఘురామరాజు సూచించారు. మరి రఘురామరాజు సూచనలను జగన్ ఏ మేర పరిగణనలోకి తీసుకుంటారన్నది చూడాలి.
Mjust Read ;- ఏపీ అప్పులపై దృష్టి పెట్టండి.. ప్రధానికి రఘురామరాజు లేఖ