ఇల్లంటూ లేని వాడే ఉండకూడదంటూ సిఎం గారు ఊరువాడా ఊదరగొట్టి మరీ ఇల్ల స్థలాల పట్టాల పంపిణీ లాంచనంగా మొదలెట్టారు. ఈ ఇల్ల పట్టాల పేరుతో వైకాపా నాయకులు ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నారో తాజాగా బయటపడ్డ ఒక సంఘటన నిరూపిస్తుంది. వైకాపాకు చెందిన నాయకుడొకడు ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ ఓ మహిళను నమ్మించాడు. అందుకోసం కాస్త ఖర్చవుతుందంటూ ఏకంగా 30 వేలు తన జేబులో వేసుకున్నాడు. కనీసం అలా తీసుకున్న ఆ నాయకుడు స్థలం ఇప్పించాడా అంటే అదీ లేదు. ప్రభుత్వం విడుదల చేసిన లిస్ట్ తన పేరు లేకపోవడంతో ఆ మహళ అవాక్కైంది. చివరికి పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో ఇంటి స్థలం తీసిస్తానని వైకాపా నాయకుడు సురేంద్ర, అదే గ్రామానికి చెందిన పార్వతమ్మతో ప్రభుత్వం అందిస్తున్న ఇంటి పట్టా తనుకు మంజూరు అయ్యే విధంగా ఏర్పాటు చేస్తానని ఆమెతో రూ. 30,000 ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకోసం ముందుగా అడ్వాన్స్ రూపంలో 5 వేలు కూడా తీసుకున్నాడు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం రానే వచ్చింది. తనకు పట్టా అందిస్తారని ఆశగా ఎదురుచూసింది పార్వతమ్మ. కానీ ఇంటి పట్టాలు అందుకోబోతున్న అర్హుల జాబితాలో తన పేరు లేకపోవడంతో పార్వతమ్మ అనుమానం వచ్చింది.
వెంటనే వైకాపా నాయకుడు సురేంద్రను పట్టుకుని నిలదీయడంతో, అతను తిరిగి పార్వతమ్మపై తిరగబడ్డాడు. ఇంక చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది పార్వతమ్మ. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కొన్ని విస్తుపోయే నిజాలు తెలిసాయి. కేవలం పార్వతమ్మ వద్ద మాత్రమే కాదు.. ఇంటి పట్టాల పేరుతో మరి కొంతమంది వద్ద నుంచి కూడా వసూళ్లు చేసినట్టు ప్రాధమిక విచారణలో తెలిసినట్టు S I రామకృష్ణ తెలిపారు.
సురేంద్ర వ్యవహారం కాస్త పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దాకా వెళ్లడంతో సురేంద్రను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడి ప్రాంతంలో సురేంద్ర కుమారుడు వాలంటీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడిని కూడా విధుల నుండి తొలగించి పూర్తి స్థాయిలో విచారణ జరపమని అధికారులకు ఎమ్మెల్యే బాబు సూచించారు.
Must Read ;- ఇల్లూ లేదు.. పట్టా లేదు.. పేరు మాత్రం ‘జగన్మోహనపురమట’..!










