ఏపీలో వైసీపీ నేతలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లలో 95 శాతం మందిని వైసీపీ కార్యకర్తలనే నియమించామని పబ్లిగ్గా చెప్పిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తాజాగా మరో వివాదానికి బీజం వేశారు. వైసీపీకి పది వేల మంది సోషల్ మీడియా సైన్యం ఉందని వారికి కొత్త రాజధాని విశాఖలో రాబోతున్న 84 పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై 135 కేసులు పెట్టారని 125 ఉపసంహరించుకున్నారని, మరో ఏడు కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయని, వారికి పార్టీ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం విశేషం.
ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ వైసీపీ జేబు సంస్థా?
ఎంపీ విజయసాయిరెడ్డి మాటలు వింటే మాత్రం ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. రాష్ట్రంలోని యువతకు వారెంచుకున్న రంగంలో శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలు పెంచి ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ను వైసీపీ జేబు సంస్థగా మార్చారా? అనే అనుమానం వస్తోంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం అంటే వారు ఏ స్థాయికి తెగించారో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారం చేసినందుకు, వైసీపీకి అనుకూలంగా ప్రత్యర్థులపై బురద చల్లుతూ చెలరేగినందుకు వారందరికీ వైసీపీ ఎంపీ ఉద్యోగాలు కల్పిస్తానని భరోసా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read ;- నోటికి తాళం : పార్టీ మారితే అంత కష్టమా?
ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ఉపాధి చూపుతారట?
ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కడైనా ‘పార్టీ కార్యకర్తలు’ అనే ట్యాగ్ లైన్ తో ఉద్యోగాలు దొరుకుతాయా? ఇవ్వడం జరుగుతుందా? కానీ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించడం చూస్తుంటే, ఆ సంస్థలు వీరి జేబు సంస్థల్లాగా భావిస్తున్నారనిపిస్తోందని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో నియామకాల్లో కూడా వీరు అక్రమాలకు తెరలేపడానికి కుట్రలు చేస్తున్నారనే అనుమానం వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎంపీ వ్యాఖ్యలపై అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ఇలా బహిరంగంగా ప్రకటించడం అంటే ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను, ప్రత్యర్థులపై బురద చల్లడానికి, మరింత రెచ్చగొట్టడం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్ష నాయకులపై ఎంత విషప్రచారం చేస్తే అంత మంచి ఉద్యోగం ఇస్తామని పరోక్షంగా విజయసాయిరెడ్డి చెప్పినట్టయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లే విషయంపై కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
సమర్థింపు సాధ్యమా?
ఈ వివాదం ముదిరితే ప్రెవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించగలమని మాత్రమే భరోసా ఇచ్చినట్లుగా ఆ పార్టీ నాయకులు సమర్థించుకోవచ్చు గాక, కానీ.. అది అంత తేలిక కాదు. ఎందుకంటే.. ప్రెవేటు సంస్థలైనా సరే.. తమ పనికి ఉపయోగపడే వారినే ఎంచుకుంటాయి. పాలకపక్షం ఒత్తిడితో తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడితే.. ఆ ప్రభావం వారి సంస్థ ఉత్పాదకత మీద ఉంటుంది. అలాంటి ఒత్తిళ్లు అనివార్యం అయినప్పుడు.. సిస్టమేటిగ్గా నడిచే కొన్ని ప్రెవేటు సంస్థలు అసలు తమ ప్రాజెక్టులు ప్రారంభించడానికే వెనకాడవచ్చు. ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు ఆ రకంగా పెట్టుబడిదార్లకు కూడా తప్పుడు సంకేతాలు పంపేలా ఉన్నదనే వాదన వినిపిస్తోంది.
Must Read ;- విజయసాయి యాక్షన్.. సోమిరెడ్డి రియాక్షన్ !











