టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత నటిస్తోన్న మూవీ ‘వకీల్ సాబ్’. హిందీ ‘పింక్’ రీమేక్ గా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ భాగం పూర్తి చూసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం అందిస్తుండగా దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ‘వకీల్ సాబ్’ చిత్రంలో శ్రుతిహాసన్ ఒక పాత్రలో నటిస్తోంది. ఈ కథకు ఆమె పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఇప్పటివరకు షూటింగ్ లో పాల్గొనలేదు ఆమె. అయితే ఆమె తాజాగా జరిపిన ఒక సంభాషణలో జనవరి నెలలో వకీల్ సాబ్ షూటింగ్ లో జాయిన్ అవుతానని తెలిపింది.
శ్రుతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అందులో ఒక అభిమాని ‘వకీల్ సాబ్’ సినిమా కోసం అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చింది. పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంటుందని తెలిపింది ఆమె. ఇప్పటికే ఆయనతో రెండు సినిమాల్లో నటించానని, ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నానని, తన పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని కూడా తెలిపింది. అప్పుడే తను ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పింది శ్రుతి. ఆమె మాటలతో అయితే అభిమానులకు ఒక విషయం అర్ధమైంది.
సంక్రాంతి రేసులో ‘వకీల్ సాబ్’ సినిమా లేదని. ఇక సమ్మర్ లోనే సినిమా రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. వారు ఎప్పటి నుండో టీజర్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ టీజర్ కూడా ఇప్పుడప్పుడే ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కొంతకాలం గ్యాప్ తర్వాత నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’ కావడంతో సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఈ చిత్రం కోసం అభిమానులు ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు.
Must Read ;- ‘వకీల్ సాబ్’ టీజర్ విషయంలో నిరాశచెందిన అభిమానులు