అది రూల్ ప్రకారం లేకపోయినా..అవుట్ ఆఫ్ ది వే చేసేయాలి. ఇది కాదు.. అది కష్టం అనే పదాలు రాకూడదు. అన్నిటికీ ఓకె చెప్పేయాలి.. ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే మీరే సాల్వ్ చేసుకోవాలి. కేసులొస్తే భరించాలి. అప్పుడు కూడా అది మీ నిర్ణయంగానే చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ముందు కట్టప్ప కూడా దిగదుడుపే అనేలా చేయాలి. అలా చేశారంటే మీ కెరీర్ అప్రతిహాతంగా సాగిపోతుంది. రిటైరైనా సరే..ఏదో ఒక పేరుతో ఏదో ఒక పదవి వస్తుంది. ఆ పేరుతో మీ జీతం కంటే ఎక్కువే చెల్లిస్తారు. హోదాకు హోదా… డబ్బుకు డబ్బు..ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులు చేయాల్సింది ప్రజా పరిపాలన కాదు…పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.. వారి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. అలా వారికి సేవలు అందిస్తే చాలు..ప్రజలకు ఎలాంటి సేవలు అందించనక్కర్లేదు.. ఎందుకంటే నేతల సేవల్లోనే..ప్రజల సేవలు కాస్త అటు ఇటూగా మిక్స్ అయిపోయి ఉంటాయి మరి.
దాస్ కు ఎక్స్ టెన్షన్ ఎలా ఇస్తారు?
ఇలాంటి సోది సెక్రటేరియేట్ లోనో.. ఏ అధికారి ఛాంబర్ లోనో మనకు వినపడుతూనే ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు లేటెస్టుగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ఆయన రిటైర్ అయిపోయారు. అయినా గాని ఎక్స్ టెండ్ చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. చెప్పినట్లు వింటూ ఏ పని చేసినా…వారి పదవీకాలం జగన్మోహన్ రెడ్డి పొడిగిస్తున్నారని..అసలు ఆదిత్యానాథ్ దాస్ జగన్ సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్నారని..అందుకే ఆయనకు జగన్ సర్కార్ లో ఎక్కడ లేని ప్రాధాన్యత వస్తోందని ఆరోపిస్తున్నారు.
నీలం సాహ్ని ఉదంతమే నిదర్శనం
మొన్నటికి మొన్న నీలం సాహ్నికి సైతం అలాగే చేశారు. కేంద్ర సర్వీసుల్లో ఆమెను ఏపీకి తెప్పించుకున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఆమె తన విధేయత నిరూపించుకున్నారు. అందుకే కోరి మరీ పిలిపించారు. చీఫ్ సెక్రటరీని చేశారు.చీఫ్ సెక్రటరీగా ఆమె అసలు కోర్టులనే లెక్క చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. హైకోర్టుకెళ్లిన అనేక అంశాల్లో మేడమ్ ఇన్ వాల్వ్ అయి ఉన్నారు. ఎక్కడా సీఎం ఆదేశాలకు భంగం లేకుండా చూసుకున్నారు. అప్పుడు ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఢీ అంటే ఢీ అన్నారు. ఫలితంగా అనేకమార్లు పదవీకాలం పొడిగించబడటమే కాక.. చివరకు సీఎస్ గా పదవీ విరమణ చేసిన మరుక్షణమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ గా కూడా నిబంధనలను ఉల్లంఘించారు. చివరకు హైకోర్టు అక్షింతలు వేసి పోలింగ్ జరిగిన పరిషత్ ఎన్నికలు రద్దు చేసేవరకు…ఆమె తన నిబంధనల ఉల్లంఘన కార్యక్రమం కొనసాగించారు.
కేంద్రంతో దాస్ దొంగాట?
ఇప్పుడు ఆదిత్యానాథ్ దాస్ కు కూడా అలాంటి పదవీయోగం పడుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే లేటెస్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల వ్యవహారంలో… కేంద్రానికి ఇచ్చిన నివేదికల్లో దాస్ దొంగాట ఆడారనే ఆరోపణలు వచ్చాయి. కేంద్రం నిబంధనలను ఉల్లంఘించి అప్పులు చేయడం..గ్యారంటీలు ఇవ్వడం వంటివి చేశారు. వీటన్నింటిపై కేంద్ర అధికారులు ఇప్పటికే ఆయనను పలుమార్లు నిలదీసినట్లు, ఆయా అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు, ఈ ప్రశ్నలతో దాస్ ఉక్కిరిబిక్కిరి అయినట్లు వార్తలొస్తున్నాయి. అయితే రాజకీయంగా కేంద్రం, రాష్ట్రం సన్నిహితంగా ఉంటే..తనకేం కాదనే ధీమాలోనే ఆయన ఉన్నారంటున్నారు. కాబట్టి ఆయనకు కూడా ఏదైనా ప్రత్యేక పదవి త్వరలోనే దక్కడం ఖాయం. కట్టప్ప కేరెక్టర్ ఊరికే రాలేదు మరి.
Must Read ;- ముందు అప్పు చేయ్.. తర్వాత తప్పు చేయ్