AP Police Have Registered Cases Against 17 Key Leaders Of The TDP :
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటి ముట్టడి కోసం వెళ్లిన వైసీపీ నేతల దురుసుతనాన్ని అడ్డుకోవడమే పాపమన్నట్లుగా.. ఈ ఘటనలో వైసీపీ శ్రేణుల రాళ్లు, జెండా కర్రల దాడులపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లడమే తప్పన్నట్లుగా.. టీడీపీకి చెందిన 17 మంది కీలక నేతలపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేసి పారేశారు. వీరిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారితో పాటుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన వైనంపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు వెళితే.. వారిని లోపలికి అనుమతించకుండా.. గేటు బయటే నిలబెట్టేసిన పోలీసులు.. తాజాగా వారంతా డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అభియోగాలు మోపుతూ కేసులు బుక్ చేసిన వైనం నిజంగానే విస్మయం కలిగిస్తోందని చెప్పాలి.
అసలేం జరిగిందంటే..?
టీడీపీ సీనియర్ నేత, దివంగత స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటైన ఓ సభకు హాజరైన సందర్భంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. అయ్యన్న ప్రసంగం వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రసంగం చేసిన అయ్యన్నను నానా దుర్భాషలాడుతూ వైసీపీ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చారు. అంతేకాకుండా కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలో గత శుక్రవారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకంటూ.. చేతుల్లో జెండా కర్రలతో రంగంలోకి దిగారు. ఆ సమయంలో టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధా, జోగి మధ్య తోపులాట చోటుచేసుకోగా.. వైసీపీ శ్రేణులు రాళ్లు, జెండా కర్రలతో టీడీపీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడులకు దిగాయి. ఈ దాడుల్లో బుద్ధా స్పృహ తప్పిపడిపోగా.. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా అక్కడున్న పోలీసులు వైసీపీ శ్రేణులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించిన టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత.. ఆ సమయంలో అక్కడ బుద్ధా వెంకన్న లేకుంటే పరిస్థితి ఏమిటన్న దిశగా ఆలోచన చేసిన టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రాణహానీ ఉందని ఆందోళనకు గురయ్యాయి. ఈ విషయాన్ని డీజీపీకి చెప్పడంతో పాటుగా వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నాయి. అయితే టీడీపీ శ్రేణులను లోపలికి అనుమతించని పోలీసులు వారందరినీ గేటు బయటే నిలబెట్టారు. ఈ దృశ్యాలు రాష్ట్రంలో కలకలం రేపాయి.
చొచ్చుకెళ్లారట..
డీజీపీ కార్యాలయంలోకి అనుమతే లేని టీడీపీ నేతలు.. డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ తాజాగా ఏఎస్సై మధుసూదన్ రావు ఫిర్యాదుతో టీడీపీకి చెందిన కీలక నేతల్లో 17 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు,. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, అమర్నాథ్ రెడ్డిలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయుడు, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్రకుమార్, బోడె ప్రసాద్, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులున్నారు. వీరితో పాటు మరికొందరు టీడీపీకి చెందిన కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ కేసులను చూసిన వారంతా.. ఆ మందిపైనే కేసులా? మొత్తంగా టీడీపీ నేతలందరిపైనా కేసులు బుక్ చేసి అరెస్ట్ చేస్తే సరిపోయేది కదా అన్నదిశగా సెటైర్లు పడిపోతున్నాయి.
MustRead ;- టీడీపీకి నో ఎంట్రీ.. వైసీపీకి రెడ్ కార్పెట్











