తెలుగు తెరపై ‘అర్జున్ రెడ్డి‘ ఒక సంచలనం. ఈ సినిమా ఒక ప్రభంజనంలా యూత్ ను తాకింది. గతంలో యూత్ కోసం చాలా చిత్రాలు వచ్చాయి .. కానీ ఏ సినిమా కూడా ఈ యాంగిల్లో కథను ఆవిష్కరించలేదు. కథ .. కథనం .. మాటలు .. పాటలు .. ఎమోషన్స్ .. ఇలా అన్ని అంశాల్లోను ఈ సినిమా కొత్తదనానికి తెరతీసింది. కంటెంట్ లోని ఆ కొత్తదనమే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దాంతో వాళ్లు ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురిపించారు. భారీ విజయాన్ని దోసిట్లో పెట్టేసి అందించారు.
సందీప్ రెడ్డి వంగా దర్శక ప్రతిభా .. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. ఇతర భాషల్లోని స్టార్ హీరోలు సైతం ఈ సినిమాను తమ భాషల్లో రీమేక్ చేయడానికి పోటీ పడ్డారంటే ‘అర్జున్ రెడ్డి’ ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అలా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ ను ఊపేసిన సందీప్ రెడ్డి వంగా, మరోసారి విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.
‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి విజయ్ దేవరకొండ – సందీప్ రెడ్డి వంగా మంచి స్నేహితులుగా మారిపోయారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ కలిసి మరో సినిమాను చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. అయితే ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన కుదరలేదు. కానీ వచ్చే ఏడాది ఈ ఇద్దరూ తప్పకుండా సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఒక కథను వినిపించడం .. విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. సందీప్ రెడ్డి ఒక హిందీ సినిమా చేయవలసి ఉండగా, శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేయవలసి ఉంది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.
Must Read ;- విజయ్ తో మైత్రీ మూవీస్.. దర్శకుడు ఎవరు?











