సినిమా..వినోదం, సందేశాత్మక అంశం.. నిర్ణీత నిడివిలో ప్రేక్షలను ఆకట్టుకునేలా ఉండాలి. రాజకీయం నిరంతరం..ఒకసారి రాజకీయాల్లోకి అడుగుపెడితే నిరంతరం లక్ష్యసాధన కోసం కష్టపడాలి. అసలు లక్ష్య సాధనకు పట్టుదల లేకుంటే.. ఓర్పు లేకపోతే ఎంత సినీ గ్లామర్ ఉన్నా..స్టార్ డమ్ ఉన్నా.. ప్రయోజనం ఉండదు. అంతేకాదు.. ఆయనను నమ్ముకుని వచ్చినవారు రాజకీయంగా, ఆర్థికంగా కూడా నష్టపోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఎందుకంటే.. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. 9నెలల మేథో మథనం తరువాత ఈ ప్రకటన చేశారు.
అయితే రజినీ కాంత్ రాజకీయాల్లోకి రావడంతో రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావడం ఖాయం. ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఈ సమీకరణాలు మారనున్నాయి. ఇక పార్టీలు పెడుతున్న సినిమా స్టార్లు అనే విషయానికి వస్తే.. అప్పట్లో..ద్రవిడ రాష్ట్రాల్లో రాజకీయాల్లో సంచలనాలు మొదలైందే సినిమా స్టార్లతోనే. తరువాత క్రమేణా ఆ స్టార్ డమ్పై ఆధారపడి ఓట్లను రాబట్టుకోవడం కష్టంగా మారుతోంది.
ఎంజీఆర్, ఎన్టీఆర్లు చరిత్ర..
తెలుగునాట ఎన్టీఆర్, తమిళనాట ఎంజీఆర్ రాజకీయాలను శాసించిన తర్వాత రాజకీయ రంగానికీ, సినిమా రంగానికీ మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. ప్రధానంగా సినీ స్టార్లు రాజకీయాల్లోకి రావడం ఒక ట్రెండుగా మారిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ 57 ఏళ్ల వయస్సులోనే రాజకీయపార్టీ స్థాపించి 9నెలల్లో అధికారంలోకి వచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ ప్రజల్లోకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ చేతిలో టీ.అంజయ్యకు అవమానం జరిగిందనే చర్చ ప్రజల్లో బలంగా ఉండడం, సీఎంల మార్పులతో ప్రజల్లో విసుగు రావడం, మద్రాసీలుగానే ఇంకా జాతీయ స్థాయి పార్టీల భావించడం కారణాలైతే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో రాజకీయ అవకాశాలు లేకపోవడం, స్త్రీలకు సరైన గుర్తింపు లేకపోవడం, సామాజిక ఆర్థిక అసమానతలు ప్రభావిత అంశాలుగా చెప్పవచ్చు. ఇక మిగతా రాష్ట్రాలను చూస్తే..
రాజ్కుమార్ : కర్ణాటకలో కన్నడ కంఠీరవ రాజ్కుమార్ డైరెక్ట్గా పార్టీ పెట్టకున్నా.. ఉద్యమాలు నడిపి.. పార్టీలను శాసించారు. కన్నడ భాషోద్యమంలో ఆయన పాత్ర విడదీయలేనిది. ఆయన కారణంగానే కన్నడ మాద్యమ విద్యాబోధన తప్పనిసరి చేస్తూ అప్పట్లోనే చట్టం వచ్చేలా చేశారు.
Must Read ;- సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యంపై వదంతులు
MGR లెజెండ్: ఎంజీ రామచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచమయే.. తొలుత అన్నదురై నేతృత్వంలోని డీఎంకేలో చేరారు. 1972లో అన్నదురై మరణించారు. డీఎంకేలోని కరుణానిధితో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆలిండియా అన్న ద్రవిడ మున్నెట్ర కళగం పార్టీని పెట్టారు. 1977లో సీఎం అయ్యారు. పార్టీ పెట్టాక 5ఏళ్లపాటు పోరాడారు. తమిళనాట రాజకీయ పార్టీలన్నీ ఈయనకు భారతరత్న ఇవ్వాలని చాలాకాలం డిమాండ్ చేశాయి. ఆయన మరణించాక.. ఏడాదికి 1988లో భారతరత్న లభించింది.
జయలలిత: ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తెలుగు వాళ్లకు కూడా నటిగా సుపరిచితం అయిన అమ్మ.. ఆ తర్వాత అన్నాడిఎంకే పగ్గాలు తీసుకుని రెండున్నర దశాబ్ధాల పాటు తమిళనాట చక్రం తిప్పారు. దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా పార్టీలు పెట్టి రాజకీయాలు నడిపిన వారిలో వీరు ప్రధానంగా కనిపించారు.
దేవానంద్ : ఇక స్టార్ డమ్ ఉన్న సమయంలో పార్టీలు పెట్టి..తరువాత రకరకాల కారణాలతో పార్టీలు కనిపించడకుండా పోవడమో లేక అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితి ఉన్న పార్టీలు చాలానే ఉన్నాయి. వీరిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన బాలీవుడ్ స్టార్ దేవానంద్. ఆయన 1980ల్లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు. చాలా అంచనాలతో ప్రారంభమైన పార్టీ ఇది. అయితే ఒక్క ఎన్నికల తరువాతే ఆ పార్టీ కనుమరుగైంది.
శివాజీ గణేషన్ : ఇక తమిళనాడులో మరో నటుడు శివాజీ గణేషన్ కూడా పార్టీ పెట్టారు. డీఎంకే నుంచి విభేదించి పార్టీ పెట్టిన శివాజీ గణేషన్ తమిళగ మున్నెట్ర మున్ననై పేరుతో పార్టీ పెట్టారు. 1989లో ఈ పార్టీ దారుణమైన ఓటమి చవి చూసింది. తరువాత పార్టీని జనతాదళ్లో కలిపారు.
విజయకాంత్: మరో తమిళ సినీ నటుడు విజయ్కాంత్ కూడా 2005లో దేశియ ముర్పోర్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీ పెట్టారు.2006 ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్క స్థానంలో మాత్రమే గెలిచారు. 2011లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. 41 సీట్లలో పోటీ చేసి 29 సీట్లను గెల్చుకుంది విజయకాంత్ పార్టీ. తరువాత 2016 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగా ఒక్క సీటూ దక్కలేదు. లోక్సభ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్నది పార్టీకే క్లారిటీ లేని పరిస్థితి. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.
Also Rread ;- అక్కడ విజయ్.. ఇక్కడ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
కర్ణాటకలో ఉపేంద్ర: కర్ణాటకలోనూ రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నా..పార్టీ పెట్టిన వారు తక్కువే. తాజాగా రియల్ స్టార్గా పేరున్న ఉపేంద్ర కర్నాటక ప్రజన్వత జనతా ప్రకాశ ( కేపీజేపీ)- ఉత్తమ ప్రజా పార్టీ పెట్టారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. కంపెనీల్లో స్థానికులకే 70 శాతం ఉద్యోగాలని అప్పట్లో ఆయన చేసిన ప్రకటన సంచలనం రేపింది.
తెలుగు రాష్ట్రాల్లో..
విజయశాంతి: ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..ఎన్టీఆర్ తరువాత సినిమా స్టార్లు పార్టీలు పెట్టినా సక్సెస్ కాలేదు. 2005లోనే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా.. ఎన్నికల్లోనూ పోటీ చేయలేక పోయారు.2009లో టీఆర్ఎస్లో విలీనం చేశారు.
హరికృష్ణ: ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినా.. నడపలేకపోయారు. టీడీపీలో విలీనం చేశారు.
చిరంజీవి: తెలుగురాష్ట్రాల్లో ఈ పార్టీ ఓ సంచలనం. 26 ఆగస్టు 2008న తిరుపతిలో జరిగిన పార్టీ ప్రారంభోత్సవ సభ చూస్తే.. అప్పటి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు ఓడిపోవడం ఖాయం అన్న ఇమేజ్తో వచ్చింది ప్రజారాజ్యం పార్టీ. అయితే ప్రారంభోత్సవం, కమిటీల ఏర్పాటు బాగానే ఉన్నా, ఎన్నికల సమయంలోనే అసలైన పరీక్ష ఎదురైంది. పలు ఆరోపణలు వచ్చాయి. 294 స్థానాల్లో పోటీ చేస్తే 18 సీట్లు మాత్రమే వచ్చాయి. చిరంజీవి తన సొంత ప్రాంతమైన పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో గెలిచారు. ఎంతోకాలం పార్టీని నడపలేక పోయారు. 2011లో కాంగ్రెస్లో కలిపారు. ఆ పార్టీ గెలవడం విషయం పక్కన బెడితే.. టీడీపీకి అధికారం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్కి ఉపయోగపడిందని అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.
పవన్ కల్యాణ్: 2014లో జనసేనను రాజకీయ పార్టీగా మార్చారు. తొలుత బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమ సాధించగలిచారు.
రానున్న కాలంలో తేలాల్సినవి..
- ప్రస్తుతం తమిళనాడులో చాలా పార్టీలు కొత్తగా వచ్చాయి. కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ తరుపున తమిళనాడులోని 39 లోక్సభ సీట్లకు పోటీ చేస్తున్నారు. ఈయనకు ఎలక్షన్ కమిషన్ టార్చిలైట్ గుర్తును కేటాయించింది. రానున్న కాలంలో ఆయన ప్రభావం ఎంత అనేది తేలాలి.
- విశాల్ కూడా ఫ్యాన్ క్లబ్ ‘మక్కల్ నాలా ఇయక్కమ్’ను రాజకీయ పార్టీగా మార్చారు. ఆ పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందా లేదా అనేది తేలాలి.
- తాజాగా రజినీకాంత్ కూడా పార్టీ ఏర్పాటును ఖరారు చేశారు.
- టి.రాజేంద్రన్ ఆలిండియా లట్చియ ద్రవిడ మున్నెట్ర కళగం పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు.
- శరత్ కుమార్.. ఆలిండియా సమత్తువ మక్కల్ కట్చీ( ఏఐఎస్ఎంకే) పేరుతో పార్టీ పెట్టారు. వీరిలో కమల్ హాసన్, రజనీలకు ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు రాజకీయాలతో ప్యత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సంబంధాలున్నాయి.
- కేరళలో మాత్రమే సినిమా స్టార్లు పెద్దగా పార్టీలు పెట్టడం లేదు. మమ్ముట్టి, సురేష్ గోపి, మోహన్ లాల్ లాంటివారు పార్టీలకు సానుభూతిపరులుగా ఉన్నా..పార్టీలు పెట్టడం చాలా తక్కువ అని చెప్పవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పెట్టడం ఒక ఎత్తయితే ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడం, అభ్యర్థుల ఎంపిక, టిక్కెట్ల కేటాయింపు, సామాజిక సమీకరణాలు, ఆర్థిక వనరులు, తిట్టడం-తిట్టించుకోవడం, ఒక వేళ పార్టీ ఓడిపోయినా.. కనీసం దశాబ్దకాలం నడిపేంత ఓపిక, ఓర్పు ఇవన్నీ మరో ఎత్తు. మరి రానున్న కాలంలో విమర్శల విషయంలో సున్నితంగా స్పందించే కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వారు విమర్శలను తట్టుకోగలుగుతారా..పోరాడగలుగుతారా అనేది చూడాలి.
Also Read ;- క్రియాశీలక రాజకీయాల్లోకి శశికళ