(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 48 స్థానాల్లో విజయ దుందుభి మ్రోగించి తొలి మేయర్ పీఠాన్ని ఖరారు చేసుకుంది. కార్పొరేషన్లో 50 డివిజన్లకి గాను 48 డివిజన్లలో వైసీపీ, ఒక డివిజన్లో టీడీపీ, మరొక డివిజన్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో 50 శాతానికి పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. వీరి సంఖ్య దాదాపు 25 డివిజన్లకి పైగానే ఉన్నాయి. అత్యధిక స్థానాల్లో గెలిచిన తమ కాపు సామాజిక వర్గం అభ్యర్థికి తొలి నగర మేయర్ పదవి దక్కుతుందన్న ఆశావాహంతో వీరంతా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలకి ముందే మేయర్ పదవిని 17వ డివిజన్ అభ్యర్థిని ఆశపు సుజాతకి ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే కోలగట్ల ప్రకటించినట్టు ప్రచారం జరిగింది.
ఈ విషయంపై అప్పట్లో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించలేదు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మేయర్ పీఠంపై ఆశావాహుల కళ్ళు పడ్డాయి. కేవలం 418ఓట్ల మెజారిటీతో గెలిచిన దేవాంగుల సామాజిక వర్గానికి చెందిన ఆశపు సుజాతకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మేయర్ పదవిని కట్టబెట్టడంపై కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నట్టు సమాచారం. ఈ విషయమై కొందరు ఎమ్మెల్యే కోలగట్ల వద్ద ప్రస్తావనకు కూడా తెచ్చినట్టు తెలుస్తోంది.
సీనియర్లకి మొండి చేయి..
ఇదిలా ఉంటే కార్పొరేటర్ల టిక్కెట్లు ఖరారు సమయంలో ఎమ్మెల్యే కోలగట్ల తన వర్గం వారికి తప్ప ఇంకెవరికీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో అప్పటి వరకు నగర వైకాపాలో వేరు కుంపటి పెట్టి మంత్రి బొత్స వర్గంగా ముద్ర పడ్డ చాలా మంది సీనియర్లకి మొండి చేయి ఎదురైంది. దీంతో వారిలో చాలా మంది కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్లు కూడా వేశారు. అయితే అప్పట్లో వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని పార్టీ పెద్దలు హెచ్చరించినా వారు వెనక్కి తగ్గలేదు. ఐతే అదే సమయంలో మంత్రి బొత్స తన అనుచర గణం అందరికీ కాకుండా కేవలం నాలుగంటే నాలుగు సీట్లు తన అనుకున్న వారికి పార్టీ నుంచి ఇప్పించుకున్నారు. వారిలో 25వ వార్డు యడ్ల కృష్ణ వేణి, 26వ వార్డు యవర్ణ విజయలక్ష్మి, 34వ వార్డు బాలి పైడిరాజు, 48వ వార్డు నడిపిల్లి ఆదినారాయణ ఉన్నారు. ఈ నలుగురు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం.
రేసులో ముగ్గురు మహిళలు ఉన్నా..
మేయర్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో టిక్కెట్లు ఇప్పించుకున్న నలుగురిలో ముగ్గురు బీసీ కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిలో ఎవరో ఒకరిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలన్నది మంత్రి బొత్స వ్యూహంగా అప్పట్లో అంతా అనుకున్నారు. అందులో ప్రధానంగా బొత్స బంధువు, ఆత్మీయ నేస్తం స్వర్గీయ యడ్ల రమణ మూర్తి భార్య యడ్ల కృష్ణ వేణిని మేయర్ని చేయాలన్నదే ఆయన వ్యూహంగా నగర ప్రజలు బాహాటంగానే విశ్లేషించుకున్నారు. అంతా అనుకున్నట్టుగానే 25వ వార్డు నుంచి కృష్ణ వేణి గెలుపు కోసం బొత్స వర్గం కృషి చేసిన విషయం బహిర్గతమే. ఐతే ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన మేయర్ పదవిని ఈ నేతలు ఇరువురు ఎవరికి కట్ట బెడతారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
‘కాపు’ కాసేనా..?
నిన్న మొన్నటి వరకు విజయనగరం ఒక పురపాలక సంస్థ. కానీ నేడు తొలిసారి అయ్యింది నగర పాలక సంస్థ. ఆ క్రమంలో జరిగినవే కార్పొరేషన్ ఎన్నికలు. 48 డివిజన్లలో విజయ ఢంకా మ్రోగించింది అధికార వైకాపా. ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది ప్రతిపక్ష టీడీపీ. అయితే నేడు అత్యంత ప్రతిష్టాత్మక మేయర్ పీఠం అధికార వైకాపాలో ఎవరికి, ఏ సామాజిక వర్గానికి దక్కుతుందనేది నగర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. నియోజకవర్గంలో సుమారు 80 వేలకు పైగా ఉన్న తమ కాపు సామాజిక వర్గానికి తొలి నగర పాలక సంస్థ మేయర్ పదవిని దక్కించుకుని, చరిత్రను లిఖించుకొని, తమ కుల ఉన్నతిని మరింత చాటుకోవాలన్నది కాపు సామాజిక వర్గ కార్పొరేటర్ల అంతర్గత అభిలాష. కానీ వీరిలో నలుగురు తప్ప మిగిలిన వారంతా ఎమ్మెల్యే కోలగట్ల అనుచర గణమే.
వారిలో అంతర్గతంగా మేయర్ పీఠం తమ సామాజిక వర్గానికే దక్కాలన్న ఆశ, ఆసక్తి ఉన్నప్పటికీ, తమకి రాజకీయ జీవితం ఇచ్చి ప్రజా పరినిధులుగా నిలబెట్టిన స్వామన్న మాట జవదాట కూడదన్న విశ్వాసం నెలకొని ఉంది. దీంతో వారంతా జరుగుతున్న పరిణామాలని తీక్షణంగా పరిశీలన చేస్తూ గోడ మీద పిల్లులు మాదిరి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తొలి మేయర్ పీఠం తమ కులానిదే అని గట్టిగా చాటుకోవాలన్న స్వార్థం చాలా మంది కాపు కార్పొరేటర్లలో ఉంది. అందుకే ఈ పీఠ ముడి ఎలా వీడుతుందన్న ఉత్కంఠ వారిలోనూ నెలకొంది. కానీ తమకి రాజకీయ జీవితం, ప్రజా ప్రతినిధులుగా నిలబెట్టిన అన్న ఎమ్మెల్యే కోలగట్ల గీసిన గీత దాటకూడదన్న సంఘర్షణ కూడా వారిని మాట పెగలని స్థితిలోకి నెట్టింది.
Must Read ;- ఆ రెండూ కూడ వదలం.. మైదుకూరు, తాడిపత్రిల్లో వైసీపీ ‘పవర్ ’పాలిటిక్స్

కూతురు భవితకు కోలగట్ల..
విజయనగరం తొలి కార్పొరేషన్లో తొలి మేయర్ పీఠం దక్కితే ఎవరికి లబ్ది, అది ఎవరి భవిష్యత్కి దోహదపడుతుందన్న విశ్లేషణ నగరంలో చర్చకి దారి తీసింది. మేయర్ పదవిని తన అనుంగు శిష్యుడు, అనుచరుడు ఆశపు వేణు సతీమణి ఆశపు సుజాతకి ఇవ్వాలన్నది తొలి నుంచి ఎమ్మెల్యే కోలగట్ల పట్టు. తద్వారా తన రాజకీయ వారసురాలు, కుమార్తె కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి రాజకీయ భవిష్యత్కి మార్గం సుగమం చేయాలన్నది ఆయన సుదూర వ్యూహం. ఆ క్రమంలోనే 48 మంది వైసీపీ కార్పొరేటర్లలో 44 మంది తన అనుచర గణాన్ని కోలగట్ల ఎంతో ఆర్ధిక వ్యయ ప్రయాసలకి ఓర్చి మరీ గెలిపించుకున్నారు. తన అనుచరులకి పార్టీ బీ పార్మ్లు తెచ్చుకోవడం కోసం తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడానికి కూడా కోలగట్ల తెగించారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు మేయర్ పదవిని కూడా తాను ప్రతిపాదించిన ఆశపు సుజాతకి తప్ప వేరెవ్వరికి ఇవ్వడానికి ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన పార్టీ పెద్దల దగ్గర పెద్ద పోరాటమే చేస్తారని అనుచర గణం చెప్పుకుంటున్న మాట. ఆశపు సుజాతకి మేయర్ పదవి, డిప్యూటీ మేయర్ పదవిని తన కుమార్తె శ్రావణికి తెచ్చుకొని తద్వారా నగర పాలనలో తన మార్క్ రాజకీయాన్ని చూపించుకోవాలన్నది కోలగట్ల వ్యూహంగా కనిపిస్తోంది.
రాజకీయ వ్యూహంలో బొత్స..
పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా భవిష్యత్ రాజకీయ వ్యూహంతో అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గ కార్పొరేటరైన యడ్ల కృష్ణ వేణిను మేయర్ ని చేసి, నగర పాలన తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. తద్వారా భవిష్యత్లో విజయనగర నియోజకవర్గ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలన్నది బొత్స విజన్గా అంతా చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన 48 మంది వైకాపా కార్పొరేటర్లలో 20 మందికి పైగా బొత్స సామాజిక వర్గానికి చెందిన కాపు వర్గానికి చెందిన వారే ఉన్నారు.
నలుగురు కోలగట్ల అనుచరులు..
కానీ వీరిలో నలుగురు మినహా మిగిలిన వారంతా ఎమ్మెల్యే కోలగట్ల అనుచరులు, అనుంగులే. ప్రస్తుతానికి వీరంతా ఎమ్మెల్యే కోలగట్ల అడుగు జాడల్లోనే నడుస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయం. అయితే ప్రతిష్టాత్మక తొలి కార్పొరేషన్లో తొలి మేయర్ పదవి తమ కుల మనిషికి కాకుండా వేరెవ్వరికో ఇవ్వడం వారికి మింగుడు పడడం లేదు. దీంతో వారంతా అటు తమ స్వామి అన్న గీసిన గీతకి, ఇటు రాష్ట్ర మంత్రి తమ కాపు కుల పెద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాటకి మధ్య అంతర్గత సంఘర్షణలో ఊగిసిలాడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో తొలి మేయర్ పీఠంను అధిష్టించేది ఎవరన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి మరి.
Must Read ;- ఎంపీ Vs ఎమ్మెల్యే.. జంగారెడ్డిగూడెం పీఠానికి వైసీపీలో గ్రూపులు











