విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని అధికార వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర కూడా చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా బుధవారం విశాఖకు వెళ్లిన సీఎం జగన్ శారదాపీఠాన్ని దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో విశాఖ స్టీల్ కార్మిక సంఘాల్లోని కొందరు నేతలతో చర్చించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు నాయకులు చెబుతున్నారు. ప్రైవేటు పరం చేయకుండా తమ ముందున్న అంశాలేంటనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అందులో భాగంగా పోస్కోకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, అప్పులను ఈక్విటీగా మార్చడం, గనుల కేటాయింపు చేయడంతోపాటు కంపెనీకి ఉన్న భూముల్లో ప్రస్తుతం వినియోగం లేని 7వేల ఎకరాల భూమి విక్రయం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. వీటిల్లో కంపెనీ అప్పులను ఈక్విటీ రూపంలో మార్చడం, గనుల కేటాయించడం లాంటివి కేంద్రంతో చర్చించవచ్చు. ఇక పోస్కోను విశాఖలో కాకుండా కడపకు తరలిస్తామని, అదీ కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు, కృష్ణపట్నం పోర్టుల వద్ద ఏర్పాటు చేసినా సహకరిస్తామని వ్యాఖ్యానించినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇదే సమావేశంలో ప్రధానికి తాను రాసిన లేఖతో పాటు విశాఖ ఉక్కుకు కావల్సిన గనులపైనా జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాగా గతంలో పోస్కో ప్రతినిధులు కలిసిన సమయంలోనే తాము విశాఖలో కంపెనీ ఏర్పాటు సాధ్యం కాదని, కడపలో ఏర్పాటు చేయమని సూచించినట్టు తెలిపారు. వీటితోపాటు విశాఖలో ఉత్పత్తి దెబ్బతినకుండా ఆందోళనలు చేయడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం, సొంత గనులు లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం, అప్పులపై వడ్డీలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. తాము లేవనెత్తిన అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని పరిశీలిస్తే..
విశాఖ స్టీల్ కంపెనీకి గనులపై చర్యలేవి?
శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు ప్రాంతంలో ఏర్పాటు చేసినా సహకరిస్తామని చెప్పారు. పోస్కోకు సొంత గనులు ఉన్నాయా..ఆ కంపెనీకి గనుల కేటాయింపు సాధ్యమైనప్పుడు కేంద్రంతో మాట్లాడి అవసరమైతే డబ్బులు చెల్లించి విశాఖ స్టీల్ కంపెనీకి కూడా గనులు తీసుకోవచ్చు. ఆ దిశగా వేగంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. కాగా ఇప్పటికే విశాఖ స్టీల్ కంపెనీ ప్రవేటీకరణ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో గంగవరం పోర్టు, విశాఖ పోర్టుల విషయంలోనూ ప్రైవేటు ఆధిపత్యం నడిచే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించనున్నాయనే సందేహాలు గతంలో తలెత్తాయి. మరి ఇప్పుడు భావనపాడు పోర్టు ప్రాంతంలో పోస్కోకు అవకాశం ఇస్తామనడం ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. రెండురోజుల క్రితం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..విశాఖ స్టీల్ భూములపై పోస్కో కన్ను పడిందని, ఆ కంపెనీ ఒడిషాలోనో లేక బెంగాల్ లోనో పెట్టుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు కూడా. 2019లో ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు పార్లమెంటులో సదరు మంత్రి ప్రకటించినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదు. దీంతో తాజాగా చర్చకు వచ్చిన ప్రతిపాదనలపై అనుమానాలు వ్యక్తం కావడంతోపాటు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డకోగలుతుందా అనే సందేహాలూ తలెత్తుతున్నాయి.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!

భూముల విక్రయాలా..
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న 26 వేల ఎకరాల భూమిలో 7వేల ఎకరాలు ఉపయోగించడం లేదన్న కారణంతో ప్రైవేటు ప్లాట్లు చేసి విక్రయించడం, సదరు డబ్బులు, ప్లాట్ల విక్రయ బాధ్యత విశాఖ స్టీల్కి అప్పజెప్పడమనే ప్రతిపాదన వచ్చింది. అలా ప్లాట్లు విక్రయించిన డబ్బుతో విశాఖ స్టీల్కి ఉన్న దాదాపు రూ.2500కోట్ల అప్పు తీర్చవచ్చు, గనులు కొనుగోలు చేయవచ్చు అనే ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూముల విక్రయానికి తమ ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తుందని జగన్ చెప్పారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పనే కాబట్టి భూముల విక్రయానికి సిద్ధపడతారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. విశాఖ కంపెనీ నుంచి గుండుపిన్ను పోయినా.. సెంటిమెంట్ పరంగా కోట్లాది మంది భావోద్వేగాలు దెబ్బతినే పరిస్థితి ఉన్న నేపథ్యంలో 7వేల ఎకరాల విక్రయం ఏంటనే చర్చ నడుస్తోంది. 1965 నుంచి లెక్కిస్తే దాదాపు 20 ఏళ్ల పోరాటం, శ్రమతో విశాఖ స్టీల్ కంపెనీ పూర్తిస్థాయి నిర్మాణం (1990లో) పూర్తయింది. 32 మంది ప్రాణాలు త్యాగం చేయడం, 22వేల మంది రైతులు అప్పట్లో భూములు స్వచ్ఛందంగా ఇవ్వడం, వాటిలో కొన్నింటికి ఇంకా పరిహారం ఇవ్వక పోవడం, ఆ భూములు కాకుండా కురుపాం జమీన్ దారులు ఇచ్చిన 6వేల ఎకరాలు ఎలా విక్రయిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గనులు కేటాయించేలా చేయడం ద్వారా..ఆ భూములను వినియోగించి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం పెంచి కూడా లాభాల్లోకి తెచ్చే అంశం ఎందుకు విస్మరించారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ కమిటీల నివేదికలేవీ..
ప్రభుత్వం చెబుతున్నట్లు.. విశాఖ స్టీల్ కంపెనీకే భూముల విక్రయ బాధ్యతలు అప్పజెప్పినా.. అసలు భూముల విక్రయం వెనుక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. కాగా విశాఖపట్నంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూముల కబ్జాలు చేస్తున్నారని, ఓ ముఖ్య నాయకుడు అదే పనిమీద ఉన్నాడన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఏంటనే చర్చ నడుస్తోంది. విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి టీడీపీ అధికారంలో ఉన్నసమయంలో సబ్ కమిటీ వేసింది. జగన్ సర్కారు కూడా ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదికల్లో ఏముందనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. అలాంటిది ఇప్పుడు విశాఖ స్టీల్ భూముల విక్రయం ఎలా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
పురపాలక ఎన్నికల్లో భాగమేనా?
కాగా ఏపీలో మొత్తం వైసీపీ గాలి వీచినా..విశాఖలో 2019 ఎన్నికల్లో టీడీపీకి 4 సీట్లు వచ్చాయి. ఈ నాలుగు గ్రేటర్ విశాఖ పరిధిలోనూ, చుట్టుపక్కల ఉన్నవే. ఈ నేపథ్యంలో విశాఖలో పట్టు పెంచుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పదేపదే అధికార పార్టీ చేస్తున్న ప్రకటనలు కూడా అందులో భాగమే అన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు సర్కారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద కొన్ని అంశాలు తప్ప..మిగతా వాటి విషయంలో ప్రభుత్వం మడమ తిప్పకుండా అమలు చేస్తే.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో బుధవారం నాటి చర్చలు కూడా కేవలం డైవర్ట్ చేసే చర్యగా భావించాల్సి ఉంటుంది. రానున్న కాలంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనే అంశాన్ని బట్టి దీనిపై క్లారిటీ రానుంది.
Also Read ;- ఇక్కడా, అక్కడా బలైయింది రైతులే.. విశాఖ ఉక్కు బాధితులకు అమరావతి రైతుల సంఘీభావం











