కేసీఆర్ చర్యలు ఒక్కోసారి అర్థం కావు. హఠాత్తుగా ఢిల్లీ టూర్ కు ఏర్పాట్లు చేసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. జిహెచ్ఎంసి ప్రచారంలో భాగంగా బిజేపీతో ఢీ అంటు ఢీ అంటూ పోరాడింది తెరాస. ఇప్పుడేమో ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్ర మంత్రులను కలుస్తారని తెలుస్తుంది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తుంది. కేంద్రం నిధులివ్వలేదని అందువల్లే తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని ప్రచారంలో బిజేపిని దుమ్మెత్తిపోసిన కేసీఆర్, ఇప్పుడు ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమిటా అని చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి తిరుగులేని శక్తిగా ఉన్న కేసీఆర్ కు మొదటి సారిగా బిజేపి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షాకిచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర మంత్రులతో భేటీ
కేసీఆర్ ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రాష్ట్ర సంబంధిత సమస్యలను వారికి వివరిస్తారని సమాచారం. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు గురించి మంత్రుల వద్ద ప్రస్తావిస్తారని తెలియవస్తుంది. వరదలు, కరోనా కారణంగా రాష్ట్రం ఆర్ధిక స్థితి దిగజారిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సాయం చేయాలని కోరనున్నట్లు తెలుస్తుంది.
Must Read ;- మారుతున్న కేసీఆర్ ‘సెంటిమెంట్ ’
అంతర్యం ఏమిటో?
కేంద్ర మంత్రులతోపాటు ప్రతిపక్ష నేతలను కలవనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఢిల్లీ రాజకీయాలను శాసించాలనే తన కోరికను కేసీఆర్ సందర్భం వచ్చినపుడల్లా బయటపెడుతూనే ఉన్నాడు. ఆపై జమిలీ ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నట్లుగా కేంద్రం నుంచి సంకేతాలు అందుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం చవి చూసిన కేసీఆర్ బిజేపీ వ్యతిరేకశక్తులను కూడదీసే పనిలో భాగమా అని కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లు రాష్ట్రంలో బలమైన నేతగా ఉన్న కేసీఆర్ కేంద్రంపై కాస్త సాలోచనగా ఉన్నారు. తన ఉదాసీనతకు ఫలితంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో గట్టి దెబ్బ తగిలింది. అధికార పగ్గాలు ఉండి కూడా మేయర్ ని నిర్ణయించలేని స్థితికి వచ్చింది పార్టీ. ఇంకా మరిన్ని ఇబ్బందులు ఎదురుకాకముందే జాగ్రత్త చర్యల్లో భాగమా అని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.
‘థర్డ్ ఫ్రంట్’ అజెండా
నిజానికి గత ఎన్నికల్లోనే కేంద్ర రాజకీయాల్లో అడుగిడాలని ఆలోచనున్నట్లు కేసీఆర్ తన ప్రచారంలో సైతం ఊదరగొట్టారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పుతారని ప్రచారాలు కూడా జరిగాయి. కానీ మోడీ వేవ్ చూసిన పిమ్మట తెలంగాణ దొరగారు అసలా ఊసే ఎత్తలేదు. ఇప్పుడు మోడీ మేనియా తనదాకా రావడంతో కేసీఆర్ లో కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ ఢిల్లీ టూర్ అంటున్నారు విశ్లేషకులు.
థర్డ్ ఫ్రంట్ అజెండా నేటిది కాదు. బిజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ పార్టీ అవసరం దేశానికి ఉందని కేసీఆర్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా దూకుడు పెంచి కేంద్రానికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగమా అని కూడా అనుమానాలు ఉన్నాయి.
Also Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు