హాలీవుడ్ లో సీక్వెల్స్ ఎన్ని పార్ట్స్ తీసినా అవన్నీ సూపర్ హిట్ అవుతుంటాయి. బాలీవుడ్ లోనూ సాధారణంగా సీక్వెల్స్ కు ఎలాంటి సమస్య రాదు. అలాగే ఇతర భాషల్లో కూడా సీక్వెల్స్ బాగానే హిట్ అవుతుంటాయి. కానీ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ కనీసం రెండో భాగం కూడా హిట్టైన దాఖలాలు లేవు. ‘మనీమనీ, మనీమనీ మోర్ మనీ, గాయం2, శంకర్ దాదా జిందాబాద్, ఆర్య2, కిక్ 2, సర్దార్ గబ్బర్ సింగ్, నాగవల్లి, రక్త చరిత్ర 2, మంత్ర 2, సత్య 2’ లాంటి సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. అప్పటి నుంచి టాలీవుడ్ కు సీక్వెల్ గండం ఉందనే మాట స్థిరపడిపోయింది. అందుకే టాలీవుడ్ ప్రేక్షకులకు సీక్వెల్స్ మీద నమ్మకం సన్నగిల్లింది. ఏదైనా సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తుందంటే చాలు.. ఆ సినిమాలపై అంతగా ఆశలు పెట్టుకోరు మనవాళ్ళు.
అయితే టాలీవుడ్ లో త్వరలో రాబోయే కొన్ని సీక్వెల్ మూవీస్ .. ఆ సెంటి మెంట్ ను బ్రేక్ చేయబోతోందని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే.. ఆ సినిమాలన్నీ రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో మంచి హైపు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆరేడు సీక్వెల్స్ వరకూ రూపొందుతున్నాయి. వాటి మొదటి భాగాలు .. సూపర్ హిట్ అవడంతో.. రెండో భాగంపై మంచి హోప్స్ తో ఉన్నారు మేకర్స్.
ఎఫ్ 3 :
అజేయ దర్శకుడు అనిల్ రావిపూడి బిఫోర్ లాస్టియర్ మలిచిన సూపర్ హిట్ మూవీ ‘ఎఫ్ 2’. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ నటించిన ఆ కామెడీ ఎంటర్ టైనర్ .. పూర్తి స్థాయిలో నవ్వులు పంచింది. తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి ఇప్పుడు ‘ఎఫ్ 3’ పేరుతో అవే పాత్రలతో రెండో భాగం రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇందులో ఒక్క సునీల్ పాత్రను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 27న విడుదల కాబోతోంది. ఈ సీక్వెల్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి.
దృశ్యం 2
ఈ ఏడాది ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మలయాళ మూవీ దృశ్యం2. ఆల్రెడీ మొదటి భాగం.. తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ రీమేక్ అయి.. సూపర్ హిట్టైంది. అందుకే ఇప్పుడు రెండో భాగం కూడా తెలుగులో రీమేక్ అవుతోంది. కేవలం 47 రోజుల్లోనే టాకీ పార్ట్ ను కంప్లీట్ చేశాడు.. తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేసిన ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.
డబుల్ ఇస్మార్ట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా మాస్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల్ని భలేగా అలరించింది. అందుకే ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ తీసే ఆలోచనతో ఉన్నాడు దర్శకుడు పూరీ. హీరో రామ్ సైతం దీని సీక్వెల్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన విడుదల కానుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి.
చిత్రం 1.1
దర్శకుడు తేజ డెబ్యూ మూవీగా వచ్చిన సూపర్ హిట్ లవ్ స్టోరీ ‘చిత్రం’. ఉదయ్ కిరణ్, రీమా సేన్ ఈ సినిమా నుంచే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో కేవలం రూ.40 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి మంచి లాభాలొచ్చాయి. త్వరలో దీనికి సీక్వెల్ రూపొందిస్తానని తేజ ఆ మధ్య ప్రకటించారు. దీనికి చిత్రం 1.1 అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అలాగే.. ఈ సినిమాతో 45 మంది కొత్త వారిని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు తేజ. ఈ సినిమా మీద కూడా టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి.
‘గూఢచారి 2, హిట్ 2’
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో శేష్ ఇమేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు . గూఢచారి 2 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకి శశికిరణ్ తిక్కనే దర్శకుడు. అలాగే.. విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ మూవీ కూడా హిట్టైన సంగతి తెలిసిందే. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా కి త్వరలో సీక్వెల్ రూపొందనుంది. అయితే ఇందులో హీరోగా అడివి శేష్ నటించబోతున్నాడు. హిట్ 2 టైటిల్ తో రానున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్ళబోతోంది. ఈ రెండు సీక్వెల్స్ తోనూ అడివి శేష్ ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.
బంగార్రాజు
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగ్ బంగార్రాజు అనే మాస్ పాత్రలో చెలరేగారు. ఇప్పుడు ఆ పాత్రతోనే కళ్యాణ్ సీక్వెల్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. నాగ్ ఇమేజ్ కు తగ్గరీతిలో .. మొదటి భాగానికి ఏ విధంగానూ తీసిపోని విధంగా.. ఈ సినిమా స్ర్కిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. జూన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.
పెళ్ళిసందD
శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ జంటగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మలిచిన దృశ్యకావ్యం పెళ్ళిసందడి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ హిట్. కీరవాణి సంగీత సారధ్యంలోని పాటలు .. ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తునే ఉన్నాయి. అలాంటి ఈ సినిమాకి ఇంతకాలానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు రాఘవేంద్రరావు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరో. రాఘవేంద్రరావు నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోంది. అలాగే..ఇందులో రాఘవేంద్రరావు ఒక ముఖ్యపాత్రను కూడా పోషిస్తున్నారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మరి ఈసీక్వెల్స్ లో ఎన్ని సినిమాలు సూపర్ హిట్టయి.. టాలీవుడ్ సీక్వెల్ గండాన్ని దాటుతాయో చూడాలి.
Must Read ;- చిత్ర పరిశ్రమలో కరోనా ప్రమాద ఘంటికలు











