(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడం, అసలు అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం..ఈ రెండింటిలో ఏది పెద్ద తప్పిదం అంటే ఎవరైనా టక్కున చెప్తే సమాధానం.. అనుమతులు లేకుండా నిర్మించడమే. కానీ రెండో కోవకు చెందిన తప్పిదానికి పాల్పడ్డారు అంటూ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిర్మాణాన్ని ఆదివారం జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ లెక్కన చూసుకుంటే విశాఖపట్నం లో 80శాతం నిర్మాణాలు… గాజువాకలో 99 శాతం నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తారా? ప్లాన్కు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా బిపిఎస్ స్కీంను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఆ పథకంలో పల్లా శ్రీనివాసరావు భవనాన్ని క్రమబద్దీకరించే అవకాశం ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో కొనసాగుతున్ననందుకు ఇటువంటి చర్యలకు పాల్పడింది.
రోజుకో సాకుతో కూల్చివేతలు..
ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు పేరిట తొలగింపులు చేపడుతున్న ప్రభుత్వం ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో అంగుళం ప్రభుత్వ భూమిని కూడా పరాధీనం కాకుండా కాపాడతామని ప్రకటించిన ప్రభుత్వం… విశాఖలోని అన్ని నిర్మాణాలు , ఆక్రమణల పైన చర్యలు తీసుకోగలదా? అదే జరిగితే విశాఖలో ప్రముఖ ప్రాంతమైన గాజువాక మొత్తం నేలమట్టం చేయాల్సి వస్తుంది.
1970 నుంచి భూమి వివాదం..
ఇక్కడి భూములపై 1970 నుంచి వివాదం నడుస్తోంది. అప్పటి నుంచి ఇక్కడి భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదు. సుమారు 900 ఎకరాల భూములకు సంబంధించిన వివాదం ప్రైవేటు వ్యక్తులు, రెవెన్యూ శాఖకు మధ్య కోర్టు పరిధిలో నలుగుతోంది. కానీ ఆయా భూముల్లో వేలాది నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికీ అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. గాజువాక హౌస్ కమిటీ భూవివాదం పరిధిలో ఉన్న ఇటువంటి నిర్మాణాలకు ఎటువంటి ప్లాన్లు మంజూరు కాలేదు.
కమర్షియల్ భవనాలకు సైతం..
గాజువాక ప్రధాన రహదారిలో ఉన్న కోట్లు విలువ చేసే కమర్షియల్ భవనాలకు సైతం ఎటువంటి అనుమతులు లేవు. టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రసన్నం చేసుకుని కోట్ల రూపాయల వ్యయంతో గాజువాక ప్రధాన రహదారిలో వందలాది కమర్షియల్ భవనాలు వెలిశాయి. జీవీఎంసీ నిబంధనల ప్రకారం అనుమతులు లేని ఆయా భవనాలకు నూరుశాతం అధికంగా పన్నును విధించాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధన ఎక్కడా అమలు కాదు. వీటన్నింటినీ పక్కన పెట్టి ప్లాన్కు దరఖాస్తు చేసి, జీవీఎంసీకే లక్షలాది రూపాయల టాక్స్ చెల్లించి నిర్మిస్తున్న భవనంపై అధికారులు విరుచుకుపడటం ఎంతమేరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేయాలి.
గత ప్రభుత్వం హయాంలో..
గాజువాక భూ సమస్య పరిష్కారానికి గతంలో హౌస్ కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు.. టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ప్రత్యేక జీవోను జారీ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే ఇందులో కోర్టు తీర్పు అనుసారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తొమ్మిది వందల ఎకరాల్లో అనేక నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ప్రకారం చూస్తే గాజువాకలో ఉన్నవన్నీ అక్రమ నిర్మాణాలు.. భూ అక్రమణలే… మరి గాజువాక అక్రమ నిర్మాణాలు కూలగొడుతూ పోతే … ఊళ్ళు అన్ని కనుమరుగు అవుతాయి. ప్రతిపక్ష నాయకులే టార్గెట్గా చేస్తున్న తొలగింపులు ప్రక్రియకు ఇప్పటికైనా ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలి. విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత నగరంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు సంఖ్య సుమారు 6 వేలు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సుమారు యాభై రోజుల పాటు నిర్వహించిన సర్వేలో వెల్లడైన నిజం ఇది. మరి జీవీఎంసీ అధికారులు గత నెలన్నర వ్యవధిలో కూల్చిన అక్రమ నిర్మాణాల సంఖ్య ఎంతో తెలుసా? ముచ్చటగా 100. అందులో అత్యధికం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులవే.
Also Read ;- తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
అన్ని టీడీపీ నేతల ఆస్తులే..
కొద్ది రోజుల క్రితం మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి.. ప్రభుత్వ భూమిని ఆక్రమించారు.. అంటూ కొన్ని తొలగింపులు చేశారు. అంతకు ముందు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇంటి ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నం చేశారు. పాతికేళ్ళ క్రితం ఆయన ఆక్రమించారని రెవిన్యూ అధికారులు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గంలోని ఫుట్ పాత్ ఆక్రమణల పేరిట టీడీపీ అనుకూల వర్గానికి చెందిన దుకాణాలను అడ్డగోలుగా తొలగించారు. గీతం డీమ్డ్ వర్సిటీ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఆపై గంటా శ్రీనివాసరావు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా టీడీపీ నాయకుడు కాశీ విశ్వనాథ రాజుకు చెందిన గో కార్టింగ్ ఆస్తులను ధ్వంసం చేశారు. తరువాత గాజువాక మిందిలోని ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ భవనాన్ని కూల్చివేశారు.
ఆదివారమే అనుకూలమా..?
సాధారణంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు సెలవు రోజులను అందుకు ఎంచుకుంటారు. విశాఖలో అధికారులు కూడా ఆదివారం రోజుల్లోనే నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారు. మరి ఈ చర్యలు అక్రమమో… సక్రమమో అధికారులకే తెలియాలి. కోర్టు సెలవు రోజుల్లో, అర్థరాత్రి, తెల్లవారుజామున టీడీపీ నేతల ఆస్తులపై అధికారులు చట్టంలోని సెక్షన్లు అన్నింటినీ వర్తింపజేస్తున్నారు. కక్షపూరితంగా, అధికార పార్టీ నేతల మెప్పుకోసం చేపడుతున్న తొలగింపులను నిలువరించడం తమ వల్ల కాక బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పరిపాలన రాజధాని విశాఖలో అధికారులుగా కొనసాగేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఊడిగం చేస్తున్నారు. వారి మెప్పు కోసమే ఈ పనులన్నీ చేస్తున్నట్టు ప్రజలందరికీ స్పష్టమైంది.
Must Read ;- విజయసాయిరెడ్డి ఆఫర్ ను తిరస్కరించినందుకే : అసలు విషయం ఇదేనన్న పల్లా