తెలుగుకు తెగులు పట్టిన రోజులివి. ఇంకా ఈ తెలుగు నేలపై తెలుగు భాష కొనఊపిరితో ఉందంటే అది భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, డాక్టర్ కవితిలక తిరునగరి రామానుజయ్య లాంటి మహానుభావుల పుణ్యమే. అలాంటి తిరునగరి రామానుజయ్య (75) ఈ ఏప్రిల్ 25 ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనను ఆలేరు ఆణిముత్యం అని అందరూ అంటుంటారు. దాశరథి పురస్కార గ్రహీత తిరునగరి తెలుగు భాషకు చేసిన సేవ అద్వితీయం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తిరునగరి స్వస్థానం. ఆయన తెలుగు పాఠం చెబుతంటే మనసు మరోచోటుకు మళ్లదు.
అచ్చ తెనుగులో అంత చక్కటి బోధన చేసే ఉపాధ్యాయులు అరుదు. పద్యం, గద్యం, వచన కవిత్వంలో తిరునగరి ఘనాపాటి. అద్భుతమైన ధారణా ప్రతిభ, వాచకం ఆయనను గొప్ప వక్తను చేశాయి. అనేక పుస్తకాలలోని ఆణిముత్యాల లాంటి కొటేషన్లు ఆయన నోటి నుంచి వచ్చే అందమే వేరు. ఎందరికో కవితా రచనలో దారి చూపి మార్గదర్శకులయ్యారు. సాహితీ సమీక్షలో ఆయన అందెవేసిన చేయి. ఆయన కలం పట్టి రాసిన అక్షరాలు చదివితే మనం కాలాన్నే మరచిపోతాం.
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి కలం పట్టి అక్షర సేద్యం చేస్తారు.. దాన్ని జనం ముందు నైవేద్యంగా పెడతారు. దాదాపు 30 కవితా సంకలనాలు వెలువరించారు. బాలవీర (శతకం), తిరునగరీయం (ముక్తక పద్య సంపుటలు), కొవ్వొత్తి, వసంతంకోసం, వానా-వాడా, అక్షరధార, గుండెలోంచి, ఈ భూమి, నీరాజనం, మాపల్లె వంటి కవితాసంపుటులను ఆయన వెలువరించారు. ఇక ఆయన రాసిన సాహితీ వ్యాసాలు, సమీక్షలు ఎన్నో మాటల్లో చెప్పలేం.
ఎందరెందరికో అక్షరభిక్ష
తిరునగరి రామానుజయ్య ఆలేరు జిల్లా పరిషత్ హైస్కూలులో ఎందరో విద్యార్థులకు అక్షరభిక్ష పెట్టారు. ఆయన దగ్గర చదువకున్న ఎందరో విద్యార్థులకు రచయితలుగా, జర్నలిస్టులుగా, కవులుగా మారారు. సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. అబ్దుల్, మాయ శ్రీనివాస్, పద్మలత, సయ్యద్ అక్రమ్ ఘోరీ, మహమ్మద్ సిరాజ్, రాంబాబు, ఉప్పలయ్య, మొరిగాడి శ్రీనివాసగౌడ్, నాగేందర్, బజ్జూరి రవీందర్, మిట్టపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి ఆంజనేయులు, నాసర్ షరీఫ్, సముద్రాల శివకుమార్, చిట్టిమల్ల భాస్కర్, అంజిరెడ్డి, పడిగెల రాజేశ్వర్, చొల్లేటి భూషణం తదితరులంతా ఆయన ఒకప్పుడు ఆయన విద్యార్థులే.
‘ఆయన మరణం మా మనసులను కలచివేసింది. సార్ కుటుంబంతో మాకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు సాహిత్యం పట్ల మాకు అభిరుచి కలిగింది అంటే ఆయన పుణ్యమే. ఎన్నో కథలు పద్యాలు, పురాణాలను మనసుకు హత్తుకునేలా బోధించేవారు. ఆయన శిష్యులు కావడం మేమెంతో గర్వించే విషయం. వారు ఏ సభలో ఉంటే ఆ సభకే నిండుదనం వచ్చేది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి దాశరథి అవార్డు ఇవ్వడం గర్వకారణం. దాశరథి గారన్నట్టు కవి వేగుచుక్క లాంటివాడు. అక్షరం ఉన్నన్ని రోజులు ప్రజల హృదయాల్లో తిరునగరి సార్ జీవిస్తూనే ఉంటారు’ అంటూ ఆయన శిష్య బృందం నివాళులర్పించింది. ఆయన కుమారుడు, మా బాల్య మిత్రడు తిరునగరి శ్రీనివాస్ కు ఇలాంటి తరుణంలో కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామన్నారు.
ప్రముఖుల సంతాపం
తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆధునిక విలువలను మేళవించి వచన, పద్య కవితాధారలు కురిపించారని ఆయన అభివర్ణించారు. ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ కవి ఎస్. హరగోపాల్, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన నడిచే గ్రం థాలయంగా పలువురు కొనియాడారు.
Must Read ;- ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రావణ్ కన్నుమూత