చిరంజీవి కెరియర్లోనే ప్రతిష్ఠాత్మిక చిత్రంగా ‘ఆచార్య‘ రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కాజల్ అలరించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ – పూజా హెగ్డే ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారనే విషయం అందరిలో మరింత కుతూహలాన్ని పెంచుతోంది. ఇంతకుముందు షెడ్యూల్లో చిరంజీవి .. కాజల్ కాంబినేషన్లోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం చరణ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

చరణ్ ఈ సినిమాలో కనిపించేది కొంతసేపే అయినా, ఆ పాత్ర ప్రభావం సినిమా అంతటా ఉండనుంది. అంతటి పవర్ఫుల్ గా ఆయన పాత్రను మలిచారు. ఇంతకుముందు ‘మారేడుమిల్లి’ ఫారెస్టు ఏరియాలో ‘పుష్ప‘ షూటింగు జరుపుకున్న సెట్లోనే, ‘ఆచార్య’ సినిమాకి సంబంధించి చరణ్ పోర్షన్ ను షూట్ చేయనున్నారనే వార్తలు వచ్చాయి. కొన్ని రోజులుగా అక్కడే చరణ్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మెగా అభిమానులు విజిల్స్ వేసే స్థాయిలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు.
మ్యాట్నీ సంస్థతో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ తో కలిసి ‘జిగేలు రాణి’ పాటలో పూజా హెగ్డే ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుందనే ఆలోచన మెగా అభిమానులకు అప్పుడే వచ్చింది. ఆ ముచ్చట ‘ఆచార్య’ సినిమాతో ఇంత తొందరగా తీరుతుందని అనుకోని ఉండరు. మే 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Must Read ;- శంకర్ చరణ్ మూవీలో విలన్ గా స్టార్ హీరో!











