నిజమే… ఏపీలో పాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు అబద్దాల కోరుగా ముద్ర పడిపోయింది. అంతేకాదండోయ్… రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానంగా ఉన్న హైకోర్టు బోనులో నిలబడి ఏకంగా దోషిగా కూడా తేలిపోయింది. జగన్ సర్కారు అబద్దాల కోరు అనేందుకు హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కూడా చెప్పక తప్పదు. మొత్తంగా దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చే కోర్టు సాక్షిగానే జగన్ సర్కారు… అబద్దాల కోరుగా చేతులు కట్టుకుని నిలబడిన వైనం నిజంగానే ఆసక్తి రేపుతోందని చెప్పక తప్పదు. ఈ కథాకమామీషు ఏమిటన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
రాగద్వేషాలకు తమ పాలనలో తావుండదంటూ..
తమ పార్టీ అధికారంలోకి వస్తే… కులం, మతం, వర్గం, ప్రాంతం అన్న తారతమ్యమే కాకుండా ఏ పార్టీ అన్న తేడాలు ఏమాత్రం కూడా చూడకుండా అందరినీ సమానంగా చూస్తామని, అసలు రాగద్వేషాలకే తమ పాలనలో తావుండదని… విపక్ష నేత హోదాలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా. ఈ మాటను తాను నిరూపించుకునేందుకు ఒకే ఒక్క ఛాన్స్ అంటూ జనం ముంగిట జగన్ సాగిలపడిన వైనం కూడా మనం చూసిందే. సరే… ఓ సారి చూద్దామన్న భావనతో జనం వైసీపీకి ఓట్లేస్తే… జగన్ సీఎం కుర్చీపై కూర్చున్నారు.
అంతే.. తాను అనుకున్నది దొరికినంతనే… తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు తాను అంతకుముందు ఇచ్చిన మాటలన్నీ జగన్ మరిచిపోయారు. తన ప్రత్యర్థి వర్గంపై కక్ష సాధింపులకు దిగారు. విపక్ష టీడీపీ పేరు విన్నా… ఆ పార్టీ నేతలు అన్నా, ఆ పార్టీ కార్యకర్తలన్నా కూడా తనదైన శైలి ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడో పసిగట్టేసిన టీడీపీ జగన్పై తనదైన శైలి పోరాటాన్ని కూడా మొదలెట్టేసింది. అయితే తాము అధికారంలోకి రావడం ఇష్టం లేని కారణంగానే టీడీపీ తనపై విమర్శలు చేస్తూ వస్తోందన్న వాదనను వినిపిస్తూ జగన్ సాగుతున్న వైనం తెలిసిందే. అయితే టీడీపీ ఆరోపణలు నిజమా? లేదంటే జగన్ చెబుతున్న మాట నిజమా? అని తేల్చే అంశం ఒకటి ఎంట్రీ ఇచ్చేసింది. అదే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు.
కోర్టు మెట్లెక్కిన బిల్లుల చెల్లింపు వ్యవహారం
టీడీపీ అదికారంలో ఉండగా… ఉపాధి హామీ పనులు బాగానే జరిగాయి. ఆ పనులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూనే వచ్చింది. అయితే 2019 ఎన్నికలకు ముందు… అంటే… 2018-19 ఏడాదిలో చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లులు ఎన్నికల కారణంగా చెల్లింపునకు నోచుకోలేదు. ఈలోగా ఎన్నికల ఫలితాలు రావడం, టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. ఇంకేముంది… తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే తన ప్రత్యర్థులపై తనదైన శైలి ద్వేషాన్ని చూపిన జగన్… ఈ ఉపాధి హామీ బిల్లుల చెల్లింపునకు ససేమిరా అన్నారు. ఎప్పటిలాగే ఈ పనులకు కూడా కేంద్రం నిధులు విడుదల చేసినా.. ఇంకా కేంద్రం నుంచి నిధులు రాలేదంటూ అబద్దాలు చెబుతూ జగన్ సర్కారు ముందుకు సాగింది. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్లు ఊరికే ఉండిపోరు కదా. తాము ఖర్చు చేసిన మేరకు నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలంటూ పలుమార్లు జగన్ సర్కారును వేడుకున్నా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారం కోర్టు మెట్లెక్కిందన్న మాట.
Must Read ;- ‘అసైన్డ్’ వ్యవహారంలో హైకోర్టుకు టీడీపీ.. సీఐడీకి చిక్కులేనా..?

20 శాతాన్ని మినహాయించి ఇస్తామని చెప్పికూడా..
2018-19లో మొత్తంగా రాష్ట్రంలో 7.89 లక్షల పనులు ఉపాధి హామీ పథకం కింద జరిగాయి. ఈ పనులకు కూలీల మొత్తంగా రూ.409 కోట్లను చెల్లించిన జగన్ సర్కారు… మెటీరియల్ కాంపోనెంట్ కింద కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను మాత్రం నిలిపివేసింది. ఈ మొత్తం కూడా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఉందని సమాచారం. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లంతా కూడా టీడీపీకి చెందిన వారే అయి ఉంటారన్న భావనతోనే… జగన్ సర్కారు ఈ బిల్లుల చెల్లింపునకు విముఖత వ్యక్తం చేసింది. విషయాన్ని గ్రహించిన టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ గ్రామ పంచాయతీ సర్పంచ్ల సంఘం గౌరవాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ పలుమార్లు వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ బిల్లుల చెల్లింపు జరపకపోవడంతో ఉపాధి పనులు చేసిన చాలా మంది అప్పులపాలయ్యారని, వారిని ఆదుకునేలా తక్షణమే బిల్లులు చెల్లించాలని ఆయన నిరసనలు కూడా చేశారు. అయినా జగన్ సర్కారు కరుణించిన పాపాన పోలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులు చేసిన పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇదివరకే ఓ దఫా విచారణ చేపట్టింది. ఆ విచారణ సందర్భంగా కేంద్రం నుంచి నిధులు రాని కారణంగానే తాము బిల్లులు చెల్లించలేదని జగన్ సర్కారు వివరణ ఇచ్చుకుంది. అంతేకాకుండా చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని, కేంద్రం బిల్లుల్లో 20 శాతాన్ని మినహాయించి ఇస్తామని చెప్పింది. దీనికి కోర్టు కూడా ఓకే చెప్పడంతో ఇక బిల్లుల చెల్లింపు మొదలవుతుందని కాంట్రాక్టర్లు ఆశించారు.
అసలు విషయాన్ని గ్రహించిన హైకోర్టు ధర్మాసనం..
అయితే జగన్ తనదైన మొండి వైఖరితోనే ముందుకు సాగి… ఇప్పటికీ ఈ బిల్లుల చెల్లింపునకు ఓకే చెప్పలేదట. వెరసి హైకోర్టుకు చెప్పిన మేరకు కూడా కోతల బిల్లులు విడుదల కాలేదు. దీంతో మంగళవారం మరోమారు ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ సాగగా… జగన్ సర్కారు చేస్తున్న జాప్యంపై పిటిషన్ దారులు అసలు వాస్తవమేమిటన్న విషయాన్ని తమ లాయర్ల ద్వారా హైకోర్టుకు తెలియజేశారు. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన హైకోర్టు ధర్మాసనం… కేంద్రం నుంచి నిధులు రాకుంటే… కూలీల వాటా అయిన రూ.409 కోట్లను ఎలా చెల్లించారని జగన్ సర్కారును నిలదీసింది. అంతేకాకుండా… 2018-19 ఏడాదికి సంబంధించిన నిధులను విడుదల చేయని కేంద్ర ప్రభుత్వం… 2019-20 ఏడాది నిధులను ఎలా విడుదల చేసిందని కూడా ప్రశ్నించింది. ఈ ఏడాది పనులకు నిధులు విడుదల చేశాకే కదా… వచ్చే ఏడాది నిధుల విడుదల గురించి ఆలోచించేది… అలా కాకుండా ఒక్క ఏపీ వ్యవహారంలోనే 2018-19 నిధులను పెండింగ్లో పెట్టి… 2019-20 ఏడాది నిధులను కేంద్రం విడుదల ఎలా చేసింది అంటూ నిలదీసింది.
ప్రభుత్వ న్యాయవాది తీరుపై మరింత ఆగ్రహం..
తాను చేసిన పొరపాటు… టీడీపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు ఎక్కడ గమనిస్తుందోనన్న భయంతో అప్పటికప్పుడు ఏదో చెప్పేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వ న్యాయవాది తీరుపై మరింత మేర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు… 20 శాతాన్ని మినహాయించుకుని మిగిలిన బిల్లులను చెల్లిస్తామని ఒప్పుకుని మరీ వాటిని కూడా ఎందుకు విడుదల చేయలేదంటూ మండిపడింది. ఏప్రిల్ 23నాటికి ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారాన్ని పూర్తి చేయాలని, లేదంటే… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని కూడా కోర్టు ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు అబద్దాలు ఆడి అడ్డంగా దొరికిపోయిందన్న మాట.
Must Read ;- రెచ్చిపోదాం బ్రదర్.. వైసీపీ నేతలకు అధినేత అండ











