ఒక తరంలో హీరోలుగా ఎన్టీఆర్, ఏయన్నార్ లు తెలుగు సినిమా రంగానికి హీరోలుగా ఎలాగైతే రెండు కళ్లు అంటున్నారో అలాంటి రెండు దర్శకత్వ రంగంలోనూ ఉన్నాయి. వారిలో ఒకరు బీఎన్ రెడ్డి అయితే, ఇంకొకరు కె.వి. రెడ్డి.
బీఎన్ రెడ్డిది పూర్తిగా కళాత్మక దృష్టి. మనం తీసేదే జనం చూడాలంటారాయన. కె.వి. రెడ్డి అలాంటివారు కాదు. ఆయన సినిమా రంగంలో క్యాషియర్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. బాక్సాఫీసు కలెక్షన్లను ఎలా కొల్లగొట్టవచ్చో ఆయన నుంచి నేర్చుకోవచ్చు. అంటే వ్యాపారాత్మక కళాదృష్టి కేవీ రెడ్డిది. కళను కామర్స్ తో బ్యాలెన్స్ చేసి జనం కోరేదే మనం తీయాలంటారాయన. నాటి నుంచి నేటి వరకూ కేవీ రెడ్డి బాటలోనే ఎందరో దర్శకులు పయనిస్తున్నారు. అలాంటి కేవీ రెడ్డి 109వ జయంతి జూన్ 1. ఆయన పూర్తి పేరు కదిరి వెంకట రెడ్డి.
తెలుగు సినిమాకి ఊపు
తెలుగు సినిమా రంగానికి మెరుపు, ఓ ఊపు ఆయనే. ‘భక్తపోతన’, ‘పాతాళభైరవి’, ‘పెద్దమనుషులు’, ‘మాయాబజార్’, ‘దొంగరాముడు’, ‘జగదేకవీరుని కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ లాంటి సినిమాలను అన్ని తరాల వారూ ఆదిరిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఆధునిక వివాహ వ్యవస్థ మీద ‘పెళ్లినాటి ప్రమాణాలు’ సినిమాని ఆరోజుల్లోనే తీశారు. ఆయనను చూస్తే ఖద్దరు పంచెకట్టుతో పల్లెటూరి పెద్ద మనిషిలా కనిపిస్తారు. ఈయనా ఇలాంటి సినిమాలు చేసింది అనిపిస్తుంది. ఆయన బి.ఎస్.సి (ఆనర్స్) చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది.
అనంతపురం జిల్లా, తాడిపత్రికి దగ్గరలో ఉన్న తేళ్ళమిట్టపల్లి ఆయన సొంతూరు. తండ్రి కొండారెడ్డి ఆ ఊరి మునసబు. నూట యాభై ఎకరాల భూస్వామి ఆయన. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం ఆ గ్రామంలో చదువుకున్న వ్యక్తి కొండారెడ్డి ఒక్కరే. ఆయనకున్న ఒక్కగానొక్క కుమారుడు కె.వి.రెడ్డి. కె.వి.రెడ్డి తల్లిది తాడిపత్రి. అది కూడా సంపన్న కుటుంబమే. కేవీ రెడ్డి రెండేళ్ల వయసులోనే తండ్రి కొండారెడ్డి చనిపోయారు. దాంతో కె.వి. రెడ్డి తల్లితోపాటు తాడిపత్రిలోని తాతగారింటికి వచ్చేశారు. చదువుసంధ్యలన్నీ మేనమామ పర్యవేక్షణలో సాగాయి.
స్కూలు ఫైనల్ వరకు కె.వి. రెడ్డి తాడిపత్రిలోనే చదువుకున్నారు. స్కూల్లో కె.వి. రెడ్డికి ఉన్న ప్రాణ స్నేహితుడు ఎవరో కాదు.. మూలా నారాయణ స్వామి. వీరిద్దరి మనసుల్లోనూ సినిమా ఆలోచనే ఉండేవి. పదిహేనేళ్ల వయసులోనే సినిమా నిర్మాణం ఆలోచనలు చేశారు. పైచదువుల కోసం మకాం మద్రాసుకు మారిపోయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదవాలని కోరడంతో అక్కడే చేర్చారు. విక్టోరియా హాస్టల్లో కె.వి.రెడ్డి ఉండేవారు. ఇంగ్లీషు సినిమాలు చూడటం అక్కడే మొదలైంది. తనలోని సృజనాత్మకతను మెరుగుపర్చుకోడానికి అది ఉపయోగపడింది. అక్కడ ఆయనతో పాటు చదువకున్న వారంతా ప్రముఖులే.
సినిమాలపై మద్రాసులో మక్కువ
ప్రముఖ దర్శక నిర్మాత పి.పుల్లయ్య కాలేజిలో కె.వి.రెడ్డికి సీనియర్. ‘ఆంధ్ర మహిళా’ సంపాదకులు ఎ.వి.వి.కృష్ణారావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి చేబట్టిన పట్టాభి రామారావు లాంటివారు ఈయన క్లాస్ మేట్స్. పుల్లయ్యతో కలిసి స్టార్ కంబైన్స్ లాడ్జిలో కథా చర్చలు జరిపేవారు. అవే ఆ తర్వాత కాలంలో సినిమాలయ్యాయి. ఉద్యోగం దొరక్కపోవడంతో స్నేహితుడు ఎ.వి.వి.రెడ్డితో కలిసి ‘ది స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీని ప్రారంభించారు. ఇది మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మూలా నారాయణ స్వామి ఆయనకు జిగిరీ దోస్త్ అని తెలుసుకదా.
రోహిణీ ఫిలిమ్స్ అనే సినిమా కంపెనీలో తాను పార్ట్ నర్ గా ఉన్నానని, ఇంట్రస్ట్ ఉంటే రావచ్చంటూ కేవీ రెడ్డిని కోరారు. ‘ఆరునెలలు వెళ్లి చూసి లాభాదాయకం అనిపిస్తే సినిమా రంగంలో ఉండు. లేకుంటే మన కంపెనీ ఉంది కదా’ అంటూ ఏవీవీ రెడ్డి సలహా ఇచ్చారు. చివరకు కేవీ రెడ్డి అడుగులు రోహిణీ ఫిలిమ్స్ వైపు పడ్డాయి. హెచ్.ఎం. రెడ్డి స్థాపించిన ఈ సంస్థలో మూలా నారాయణస్వామి తోపాటు బి.ఎన్. రెడ్డి, ఛాయాగ్రాహకుడు రామనాథ్, కళాదర్శకుడు శేఖర్, బ్రిజ్ మోహన్ దాస్, నాగిరెడ్డి, సముద్రాల రాఘవాచార్య పార్ట్ నర్స్. నాగయ్య హీరోగా ‘గృహలక్ష్మి’ సినిమా నిర్మించినప్పుడు కె.వి.రెడ్డి క్యాషియర్ గా పనిచేశారు.
మూలా నారాయణ స్వామి రోహిణీ సంస్థ నుంచి విడిపోయి బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి, సముద్రాల, బ్రిజ్ మోహన్ దాసు, కె.వి. రెడ్డి, నాగయ్యలను కలుపుకొని వాహినీ సంస్థను ఏర్పాటుచేశారు. కె.వి.రెడ్డి ఎదగడానికి వాహిని సంస్థ సోపానంగా మారింది. వాహిని పిక్చర్స్ బ్యానర్ మీద బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం ‘వందేమాతరం’. ఇందులో నాగయ్యతో పాటు కె.వి.రెడ్డి కూడా ఓ పాత్రలో కనిపిస్తారు. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘సుమంగళి’, ‘దేవత’ చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. అలా ఆయన సినిమా కెరీర్ దర్శకత్వం చేసే దాకా ఎదిగింది. ‘భక్తపోతన’తో మొదటి సారిగా దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. 1943 జనవరి 7న విడుదలైన భక్తపోతన ఘనవిజయం సాధించింది. అక్కడి నుంచి కేవీ రెడ్డికి తిరుగేలేకుండా పోయింది.
కేవీ రెడ్డికి వేమన అంటే అభిమానం. రెండో సినిమాగా ఆ కథతోనే యోగి వేమన తీశారు. దర్శక నిర్మాత వి.శాంతారాం సైతం యోగి వేమన చూసి కేవీ రెడ్డిని ప్రశంసించారు. ఆ తర్వాత జానపద చిత్రాల వైపు ఆయన పయనం సాగిపోయింది. బాలనాగమ్మ, గుణసుందరి కథలాంటి ఆణిముత్యాలెన్నో ఆయన దర్శకత్వంలో వచ్చాయి. ‘మాయా బజార్’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘జగదేకవీరుని కథ’దర్శకుడిగా కె.వి.రెడ్డిని ఆకాశాన నిలబెట్టాయి. ‘జయంతి పిక్చర్స్’ స్థాపించి ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ నిర్మించారు. సినిమా రంగంలో అనేక శాఖల్లో వేలుపెట్టిన ఘనత కూడా కేవీ రెడ్డికే దక్కుతుంది. అందుకే ఆయన జగమెరిన దర్శకుడు.
-హేమసుందర్ పామర్తి
Must Read ;- ఏయన్నార్ స్థానంలో శోభన్ బాబుకు చోటు