Income Tax Department Raids On Actor Sonu Sood :
సోనూ సూద్.. సినిమాల్లో విలన్ పాత్రలేసినా.. నిజ జీవితంలో మాత్రం హీరోనే. కరోనా కష్టకాలంలో ఆపదలో చిక్కుకున్న వారికి తానున్నానంటూ రంగంలోకి దిగిన సోనూ.. లక్షలాది మందిని తమ స్వస్థలాలకు చేర్చారు. అంతేనా.. తమకు కష్టం వచ్చిందని, ఆదుకోవాలంటూ ఎవరు అడిగినా.. చేతికి ఎముకే లేదన్నట్లుగా సాగుతున్న సోనూ నిజంగానే రియల్ హీరో అని చెప్పక తప్పదు. అలాంటి నటుడిపై బుధవారం నాడు ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ముంబైలోని ఆయన నివాసంతో పాటు లక్నోలోని ఆయన కార్యాలయం, మరో నాలుగు ప్రాంతాల్లో ఉన్న ఆయన ఆస్తులపైనా ఐటీ రెయిడ్స్ జరిగాయి. తనకు వచ్చిన ఆదాయంపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును సోనూ ఎగ్గొట్టిరన్నది ఆదాయపన్ను శాఖ అధికారుల ఆరోపణ. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం ఉందో తెలియదు గానీ.. సోనూపై ఐటీ రెయిడ్స్ జరిగాయన్న వార్త తెలియగానే.. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
దాడుల వెనుక లోగుట్టు ఇదేనా?
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సోనూ సూద్ హైప్రొఫైల్ మీటింగ్ జరిగిన రోజుల వ్యవధిలోనే ఆయనపై ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘దేశ్ కా మెంటార్’ పథకానికి బ్రాండ్ అంబాసడర్ గా సోనూను కేజ్రీవాల్ ప్రకటించారు. అంతేకాకుండా ఆప్లోకి సోనూ చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున సోనూ బరిలోకి దిగుతున్నారన్న వార్తలూ వినిపించాయి. అయితే, తనకు అలాంటి ఆలోచన లేదని ఆ తర్వాత సోనూ వివరణ ఇచ్చారు. అయినా కూడా కేజ్రీ మాస్టర్ ప్లాన్ రచించారని, ఆ ప్లాన్ లో భాగంగా ఆప్ లో సోనూ క్రియాశీలక పాత్ర పోషించడం ఖాయమన్న వార్తలు వినిపించాయి. ఈ వార్తలు నిజంగానే కేంద్రంలోనే కాకుండా ఇటు గుజరాత్ లోనూ అధికారంలో ఉన్న బీజేపీలో కలవరం మొదలైందన్న విశ్లేషణలు సాగాయి. ఈ క్రమంలో సోనూపై ఐటీ రెయిడ్స్ జరగడంతో ఈ విశ్లేషణలు నిజమేనన్న కోణంలో సరికొత్త చర్చ మొదలైంది.
Must Read ;- ఢిల్లీలో పవన్.. వాటీజ్ ద మ్యాటర్?