Did Congress party has finalized Konda Surekha as its candidate in Huzurabad Bypoll:
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించిన చర్చే జరుగుతోంది. రాజకీయ నేతలైనా, సామాన్యులైనా.. హుజూరాబాద్ గురించే మాట్లాడుకునేలా కేసీఆర్ సర్కారు చేసిందని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే.. తనను ధిక్కరించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా కదులుతున్న కేసీఆర్.. ఆ ఎన్నికలో గెలుపు కోసం తాహతుకు మించి ఫథకాలను ప్రకటిస్తున్నారు. వెరసి అంతటా హుజూరాబాద్ చర్చే జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్ధిగా ప్రకటిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెరసి అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. ఇక ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేసే దిశగా స్పీడు పెంచేసింది. మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వానికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ లభించేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహం రచించినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
ముగ్గురిలో కొండాకే ఓటు
హుజూరాబాద్ బరిలో పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటే లాభిస్తుంది అన్న దిశగా లోతైన విశ్లేషణలు చేసిన రేవంత్ రెడ్డి బృందం వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి పేర్లను కలిపి మొత్తం ముగ్గురి పేర్లతో ఓ నివేదికను రూపొందించిందట. ఈ నివేదికను రేవంత్ రెడ్డి.. పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్ కు అందజేశారట. ఈ నివేదికను తీసుకుని ఠాకూర్ శనివారం నాడు ఢిల్లీ ఫ్లైటెక్కనున్నారట. ఈ నివేదికను పరిశీలించనున్న పార్టీ అధిష్ఠానం హుజూరాబాద్ అభ్యర్థిని ఖరారు చేస్తుంది. అయితే మొత్తం ముగ్గురి పేర్లతో నివేదిక వెళ్లినా.. అంతిమంగా కొండా సురేఖనే హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు కానున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేఖ.. వరంగల్ జిల్లాకు చెందినా.. హుజూరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో బంధువర్గాన్ని కలిగి ఉందట. అంతేకాకుండా హుజూరాబాద్ లో బీసీల ఓట్లే కీలకం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా బీసీ వర్గానికి చెందిన గెల్లును అభ్యర్థిగా ప్రకటించింది. ఇదే భావనతో వెళ్లనున్న కాంగ్రెస్ కూడా బీసీల్లోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ మంచి మాస్ ఫాలోయింగ్ కలిగిన కొండా సురేఖను అభ్యర్థిగా నిర్ణయించే అవకాశాలే అధికంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో అధిష్ఠానానికి నివేదిక పంపాలన్న సంప్రదాయం ఉంది కాబట్టి ముగ్గురి పేర్లతో నివేదిక వెళ్లింది గానీ.. అలా కాకుంటే.. నేరుగా కొండా సురేఖను అభ్యర్థిగా ప్రకటించేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కొండా సురేఖ నేపథ్యం..
వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళి సతీమణే కొండా సురేఖ. రాయలసీమ తరహా ఫ్యాక్షన్ కు వరంగల్ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కొండా మురళి.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తనదైన శైలి దౌర్జన్యాలతో ముందుకు సాగారు. ఈ క్రమంలో రాజకీయాల్లో పెద్దగా గుర్తింపు రాక ముందే.. వరంగల్ జిల్లా సహా పొరుగు జిల్లాల్లోనూ ఆయనకు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కొండా వస్తున్నారంటే. హడలిపోయే పరిస్థితులు నాడు ఉండేవి. ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారిపోయిన కొండా మురళి.. తనపై ఉన్న కేసుల కారణంగా తన సతీమణిని ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిపారు. ఈ క్రమంలో బంపర్ మెజారిటీతో సురేఖ గెలవగా.. నాడు టీడీపీలో కొనసాగిన ప్రస్తుత టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాభవం అంతకంతకూ తగ్గిందనే చెప్పాలి. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారి అధికారం చేపట్టగా.. వైఎస్సార్ కేబినెట్ లో కొండా సురేఖకు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ కాంగ్రెస్ పార్టీని వీడటం, కొండా దంపతులు వైసీపీలోకి వెళ్లడం, అక్కడ ఇమడలేక టీఆర్ఎస్ లో చేరడం, ఆపై కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి దక్కడం, ఇటీవలి పరిణామాలతో కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోవడం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ ఎంపికై.. విజయం సాధిస్తే మాత్రం ఇక కొండా దంపతులకు తిరుగే ఉండదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- అప్పటిదాకా సారు స్పీడు తగ్గదబ్బా