Maoists Release Letter On Bauxite Mining :
విశాఖ మన్యంలో లేటరైట్ పేరిట జరుగుతున్న బాక్సైట్ మైనింగ్ పై వైసీపీ పెద్దలకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే ఈ వ్యవహారంపై దర్యాప్తునకు రెండు కమిటీలను నియమిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తును ఎలా తమకు అనుకూలంగా మలచుకోవాలన్న రీతిలో వైసీపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే.. ఎన్జీటీ దర్యాప్తును ట్యాంపరింగ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే.. ఎలాగోలా అధికారులను మేనేజ్ చేద్దామన్న కోణంలో సాగుతున్న వైసీపీ పెద్దలకు ఇప్పుడు అనుకోని ప్రమాదం వచ్చి పడింది. బాక్సైట్ మైనింగ్ ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ సోమవారం నాడు సంచలన ప్రకటన విడుదల చేసింది. బాక్సైట్ మైనింగ్ ను అడ్డుకోవాలని గిరిజనులకు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. అక్రమ మైనింగ్ కు నిరసనగా ఈ నెల 10న ఏపీ బంద్ కు పిలుపునిస్తున్నట్లుగా ఆ లేఖలో ప్రకటించారు. మవోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరిట విడుదలైన ఈ లేఖ ఇప్పుడు వైసీపీ నేతల్లో పెను కలవరమే రేపుతోందని చెప్పాలి.
ఆ లేఖలో ఏముంది?
విశాఖ మన్యంలో లేటరైట్ పేరిట జరుగుతున్న అక్రమ మైనింగ్ కు సంబంధించి ఏ మీడియా సంస్థలకు తీసిపోని రీతిలో మావోయిస్టులు పక్కా వివరాలను వెల్లడించారు. విశాఖ-తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో నాతవరం మండలం భమిడికలొద్ది సమీపంలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో ఏడాదికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర లేటరైట్ ఖనిజాన్ని 15 ఏళ్ల పాటు తవ్వుకునేందుకు జర్తా లక్ష్మణరావు అనే ఆదివాసీకి ఫిబ్రవరిలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని మావోయిస్టులు ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ అనుమతిని ఆధారం చేసుకుని జూన్ లోనే ఖనిజ తవ్వకాలను ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ తవ్వకాలన్నీ కూడా లేటరైట్ కోసం కాదని, లేటరైట్ పేరిట బాక్సైట్ తవ్వకాలే జరుగుతున్నాయని కూడా మావోయిస్టులు ఆరోపించారు. తక్షణమే ఈ తవ్వకాలను ఆపేలా ఆదివాసీలు, గిరిజనులు పోరాటం చేయాలని సూచించారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిని గిరిజనులు తన్ని తరిమేయాలని, అధికార పార్టీ నేతలను నిలదీయాలని, అల్లూరి సీతారామరాజు వారసులుగా తిరుగుబాటుకు సన్నద్ధం కావాలని, మన్యాన్ని కాపాడుకోవాలని,. మొత్తంగా మైనింగ్ ను సమరశీలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ దిశగా గిరిజనులు చేసే పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని కూడా మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మైనింగ్ కు నిరసనగా ఈ నెల 10న చేపట్టనున్న రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాలు విజయవంతం చేయాలని కోరారు.
వైసీపీ నేతల్లో కలవరం
లేటరైట్ పేరిట బాక్సైట్ మైనింగ్ వ్యవహారం మొత్తం వైసీపీ కీలక నేత, సీఎం జగన్ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోనే జరుగుతోందని ఇప్పటికే వెల్లడైంది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఈ మైనింగ్ ను సాగిస్తున్నారని ఆయన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి లవకుమార్ రెడ్డి.. ఓ ఫోన్ కాల్ ద్వారా మొత్తం విషయాన్ని బయటపెట్టేశారు. ఈ ఫోన్ కాల్ సంభాషణ అంతా ఆడియో రూపంలో వెల్లడి కావడంతో వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ భాగోతం మొత్తం బయటపడిపోయింది. ఇప్పుడు మావోయిస్టుల లేఖ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ తీవ్ర కలవరపాటుకు గురైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సీఎం జగన్ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించి.. తన బాబాయి కుటుంబాన్ని నిలువరించే పనిని మొదలుపెట్టినట్టుగా కూడా సమాచారం. మొత్తంగా మొన్నటి ఎన్జీటీ ఆదేశాలతోనే వైసీపీ నేతలు కలవరపాటుకు గురి కాగా.. ఇప్పుడు మావోయిస్టుల లేఖతో వారంతా తీవ్ర అంతర్మదనంలో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే












