ఈరోజుల్లో డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. అవును నిజమే.. డబ్బుంటే పార్టీ పెట్టొచ్చు.. ఎవరినైనా పార్టీలోకి రప్పించొచ్చు..ఎవరికైనా మనం ఏ కథలైనా చెప్పొచ్చు. డబ్బులిస్తే మన కోసం ఏడ్చేవాళ్లుంటారు.. మన కోసం నినాదాలిచ్చేవాళ్లుంటారు. మన కోసం వచ్చి మాట్లాడే సెలెబ్రిటీలుంటారు. మనం కోసం అవసరమైనప్పుడు అవసరమైన విధంగా వార్తా కథనాలు వండి వార్చే మీడియావారుంటారు. ఇన్ని ఉన్నా.. మరి జనం వస్తారా అంటే.. ఎందుకు రారు.. కులం, మతం వీటికి తోడు డబ్బు కొడితే వారు కూడా వస్తారు.
తాత ఫ్యాక్షనిస్టు.. తండ్రి రాజకీయ నేత..
ఇదంతా ఎందుకో మీకిప్పటికే అర్ధమై ఉంటుంది. షర్మిలక్క పార్టీ వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. రాజకీయంలో అనుభవం లేదు. కేవలం రాసిచ్చిన స్క్రిప్టులు లయబద్ధంగా చదవటం తప్ప.. ఇంకేం తెలియదు. కేవలం భర్త ఔపోసన పట్టిన హిప్నోటిక్ స్పీచ్ స్టయిల్ తప్ప.. ఇంకేం తెలియదు. తాత ఫ్యాక్షనిస్టు.. తండ్రి రాజకీయ నేత.. పైగా రాటుదేలిన నేత.. తప్పులు చేసినా.. జనానికి కాస్తో కూస్తో మేలు చేశాడు కాబట్టి.. వారి హృదయంలో స్థానం సంపాదించుకున్న నేత. అన్న పదేళ్లు కష్టపడి.. ముఖ్యమంత్రి అయ్యాడు. మరి తాను కూడా సీఎం అవ్వాలనుకోవటంలో తప్పేముంది..?

జనానికి సంక్షేమ పథకాల ఎర
అన్న మాత్రం ఏం చేశాడు. పాదయాత్ర చేశాడు.. ఉపన్యాసాలు ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ని కన్సల్టెంట్గా పెట్టుకుని.. కుల, మతాల లెక్కలను చీల్చి చెండాడాడు. ఎందరో నేతలను తిట్టి, కొట్టి బయటకు పంపించాడు. ఇంకెందరో డబ్బు పెట్టి మరీ ఆయన దగ్గరే చేరారు. డాడీ పవర్లో ఉన్నప్పుడు దోచుకున్నందుకు.. సీబీఐ కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసు నుంచి బయటపడేందుకు కేంద్రంలోని బీజేపీకి సలాం చేస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్షం మళ్లీ కోలుకోకుండా దెబ్బ తీస్తున్నాడు. జనానికి సంక్షేమ పథకాల ఎర వేసి.. మళ్లీ మళ్లీ ఓట్లు దండుకునేలా అన్నీ ఫిక్స్ చేసేస్తున్నాడు. అంతేగాని రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ది చేస్తున్నాడా.. అడ్మినిస్ట్రేషన్ కోసం ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా.. అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? అందుకే నేను కూడా సీఎం కావొచ్చని షర్మిలక్క అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే మరి ఏపీలో అన్న ఉండగా ఛాన్స్ లేదు కాబట్టి.. తెలంగాణకు వచ్చింది.
సీఎం అవ్వాలని చెప్పేది పైకి మాత్రమే..
ఇక్కడ కూడా సీఎం అవ్వాలని చెప్పేది పైకి మాత్రమే. అవ్వాలనేది టార్గెట్టే. కాని రీచ్ కావాలంటే కొన్ని త్యాగాలు తప్పదు కదా. ముందు కేసీఆర్ గారికి కోఆపరేట్ చేయాలి..అవసరమైతే బీజేపీకి హెల్ప్ చేయాలి.. ఇవన్నీ చేసి.. ఈ మెట్లు కూడా దాటాక.. అప్పుడు సీఎం కావొచ్చు.. లేదు ఈ తతంగమంతా నడిచేలోపు అన్న జైలుకెళితే.. తనకే ఛాన్స్ వచ్చేలా చేసుకోవచ్చు. అప్పుడు బీజేపీ, కేసీఆర్ అందరూ సపోర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కదా.
అన్నిటిలోనూ డబ్బే..
పార్టీ కోసం సమావేశాలు మొదలెట్టిన దగ్గర నుంచి, ఇప్పటివరకు …రేపు 9న ఖమ్మంలో జరిగే బహిరంగసభ వరకు.. అన్నిటిలోనూ డబ్బే కనపడుతోంది. ప్రజాభిమానం ఎక్కడా కనపడటం లేదు. ఒకప్పుడు వెలుగు వెలిగి ఖాళీగా ఉన్న నేతలు, అధికారులు డీల్ మాట్లాడుకుని మరీ వచ్చి చేరుతున్నారు. చిన్నా, చితక సెలెబ్రిటీలు కూడా ఏదో కాల్షీట్ ప్రకారం వచ్చినట్లు వచ్చి మీడియా ముందు మాట్లాడి వెళుతున్నారు. అంతేగాని ఏదీ రియల్గా జరుగుతున్నట్లే అనిపించడం లేదు. అయినా మీడియాలో ఇలా ఎక్కడా రాదు.. అంతా సూపరనే చెబుతారు. అంతా డబ్బు మహిమ మరి.
Must Read ;- చిచ్చు పెట్టు, ఓట్లు పట్టు.. విభజించడమే పీకే వ్యూహం!











