( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారక ముందే డ్రగ్స్ కల్చర్ విస్తృతమౌతోంది. విద్యార్థులే లక్ష్యంగా.. విద్యార్థులను విక్రేతలుగా మారుస్తున్న డ్రగ్స్ మాఫియా ఆగడాలను విశాఖ పోలీసులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఆరుగురిలో ఎల్ఎస్డి (డ్రగ్స్) కలిగి వున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ వివరాలు వెల్లడించారు.
కళాశాలలు కేంద్రంగా..
డ్రగ్స్ కలిగి ఉన్న ఐదుగురిలో ఇద్దరు విద్యార్థులు కావడం గమనార్హం. నిందితుల్లో ఒకరు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుండగా, మరొకరు బెంగళూరులో బిబిఎ పూర్తి పూర్తి చేసాడు. డ్రగ్స్ విక్రయించేందుకు ఓ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లిన ఇద్దరు యువకులను ఆదివారం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మరో ఇద్దరు ఇళ్ల వద్ద పట్టుబడగా, మరొకరు డిగ్రీ కళాశాల వద్ద పోలీసులకు చిక్కాడు. నిందితులైన అరవింద్ అగర్వాల్, కె. సాహిల్, బి. చంద్రశేఖర్, మైకేల్ వెల్కమ్, ఎం. మురళీధర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకడైన అశోక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. అయితే నిందితులంతా విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని విక్రయాలు చేస్తున్నట్టు వారు పట్టుబడిన తీరును బట్టి స్పష్టమవుతోంది. పోలీసులు ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. కళాశాల విద్యార్థులను డ్రగ్స్ బానిసలుగా చేస్తున్నట్టు ఈ వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. గతంలో పలుమార్లు విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న వారు పట్టుబడినప్పటికీ, ప్రస్తుతం విక్రయిస్తున్న వారిలో, కొనుగోలు చేస్తున్న వారిలో యువత, విద్యార్థులు అధికంగా ఉండడం కలవరానికి గురి చేస్తోంది. నగరంలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు విశాఖ పోలీసులు విస్తృతంగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పోతినమల్లయ్య పాలెం పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులను పట్టుకోగలిగారు. ఎప్పటి నుంచో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో డ్రగ్స్ కల్చర్ చాపకింద నీరులా అల్లుకుపోయింది. పరిస్థితులు చూస్తుంటే విశాఖ కూడా ఆ జాబితాలో చేరి పోయేలా కనిపిస్తోంది.
విస్తృతంగా గంజాయి సాగు..
మరోవైపు విశాఖ రూరల్లో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతోంది. గంజాయి పంటలను ఉక్కు పాదంతో అణిచి వేస్తామని పోలీసులు చెబుతున్నప్పటికీ నిత్యం వందల కిలోలు రవాణా అవుతూనే ఉంది. ఒకవైపు గంజాయి… మరోవైపు మద్యం.. ఇంకోవైపు నాటుసారా.. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయాలు జరుగుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి గ్యాంగ్ల ఆగడాలను పోలీసులు ఏ మేరకు అదుపు చేస్తారో వేచి చూడాలి.
Must Read ;- హైదరాబాద్ అభివృద్ధిపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేంద్ర మంత్రి!