‘కలర్ ఫొటో’ లాంటి ప్రేమ కథా చిత్రాన్ని అందించిన ‘ఆహా’ ఈసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ విడుదల మీద దృష్టి పెట్టింది. అది ‘అనగనగా ఓ అతిథి’ చిత్రం. ఇందులో పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కన్నడం సినీ రంగంలో అనేక అవార్డు సినిమాలు రూపొందించిన దయాళ్ పద్మనాభన్ తెలుగులో మొదటిసారిగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీని ట్రైలర్ ను ఇటీవలే హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ సినిమా ఈరోజు సాయంత్రం నుంచి ‘ఆహా’లో విడుదలవుతుంది. ఇందులో పాయల్ రాజ్ పాత్ర వెరైటీగా కనిపిస్తోంది. ఆమె వేషధారణ చూస్తుంటే పేదింటి అమ్మాయిలా ఉంది.
కథేంటంటే: ఓ పేద కుటుంబంలో ఓ జ్యోతిష్కుడు చెప్పిన ఫలితం పర్యవసానం ఏమిటి? ఆ ఇంటికి వచ్చిన అతిథివల్ల వారికి ఏర్పడిన పరిణామాలు ఏమిటి? అనేదే కథ. మనిషిలో అత్యాశ, కోరికలు, ఆవేశం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందనే అంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. వాస్తవ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాకి ప్రేరణ అంటున్నారు. ఈ సినిమా నేపథ్యం చూస్తుంటే అతిథి దెయ్యమోభవ అని చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాకి హీరో అనుకోవాలి. ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కింది.
పాయల్ రాజ్ పుత్ లో గ్లామర్ అయితే ఉందిగానీ ఈమధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత ఆమె క్రేజ్ బాగా పెరిగింది. ఆ సినిమాతో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. అయినా హిట్ మాత్రం రాలేదు. ఈ సినిమా మీద ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. తన పాత్రకు మళ్లీ మంచి గుర్తింపు దక్కుతుందన్న నమ్మకంతో ఆమె ఉంది. దీనికి అరోల్ కొరెల్లి సంగీతం సమకూర్చారు. కన్నడ సినిమా కరాళ రాత్రికి ఇది రీమేక్. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఓ అపరిచిత ప్రయాణికుడికి ఆశ్రయం ఇస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఇందులో చూడాలి.
Must Read ;- ఎందుకీ పాయల్ ఘోష.. దేనికీ కంఠశోష?