ఒక్క మహారాష్ట్రలోనే నిన్ని 62వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రతి రోజూ 30 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసులు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. మరో 15 రాష్ట్రాల్లో రోజుకు ఒక్కో రాష్ట్రంలో ప్రతిరోజూ 15వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 18 రాష్ట్రాల్లో రాత్రి కర్ప్యూ అమలవుతోంది. వ్యాపార సంస్థలు సాయంత్రానికే మూసివేస్తున్నారు. మరికొన్ని మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయినా కరోనా వేగం మాత్రం తగ్గడం లేదు.
రికార్డు స్థాయిలో కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో 30 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. రోజుకు ఒక్క మహారాష్ట్రలోనే సగటున 60వేల మంది కరోనా భారిన పడుతున్నారు. ప్రతిరోజూ అక్కడ సగటున 800 మందికిపైగా మృత్యువాత పడుతున్నారు. మహారాష్ట్ర సర్కార్ కరోనా కట్టడికి పది రోజుల క్రితమే లాక్ డౌన్ వేసినా కరోనా కట్టడి మాత్రం సాధ్యం కావడం లేదు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలే తగిన నిర్ణయాలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్ వేసే అధికారం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వడంతో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ విధించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో మినీ లాక్ డౌన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
ఏపీలో వారంలో లక్ష కేసులు
ఏపీలో కరోనా వేగం పెంచింది. గడచిన వారం రోజుల్లోనే ఏపీలో లక్ష మంది కరోనా భారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే 17 వేల మందికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది. కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో కరోనా పరీక్షల ఫలితాలు రావడానికే కొన్ని జిల్లాల్లో వారం పడుతోంది. కరోనా టెస్టులు పెంచితే ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా రోగులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం కష్టంగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న కళ్యాణమండపాలను కరోనా కేంద్రాలుగా మార్చాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో విజయవాడలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పలు కళ్యాణమండపాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సమీపంలో ఉన్న కళ్యాణ మండపాలను కరోనా కేర్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు అన్వేషణ ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలోనే రోజుకు 2 వేల మంది కరోనా భారిన పడుతున్నారు. దీంతో అక్కడ బెడ్లు దొరకడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు రోజులు చికిత్స పూర్తి చేసుకున్న వారి బెడ్లు ఖాళీ చేయించే స్పెషల్ డ్రైవ్ ను వైద్యాధికారులు చేపట్టారు. ఆరోగ్యం నిలకడగా ఉన్న వారిని గుర్తించి, వారి బెడ్లు సీరియస్ గా ఉన్న వారికి కేటాయించే కార్యక్రమం చేపట్టారు.
గాంధీలో శవాల గుట్టలు
తెలంగాణలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తెలంగాణలో రోజుకు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 89 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. గాంధీలో ఆసుపత్రికి వస్తున్న అంబులెన్సులను కూడా వెనక్కు పంపుతున్నారు. ఇక గాంధీ ఆసుపత్రి శవాగారంలో 300 శవాలు పేరుకుపోయాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు వైద్యం చేస్తున్నా, సామాన్యులు భరించే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ చెల్లించాల్సి రావడంతో మధ్య తరగతి జనం కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఒక వేళ బెడ్ దొరికినా రెండు గోళీలు ఇచ్చి వైద్యులు పట్టించుకోవడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో లాక్ డౌన్ వేయడంతో అక్కడ నుంచి 4 లక్షల మంది కూలీలు తెలంగాణకు తరలి వచ్చారు. వీరిలో వేలాది మంది కరోనా లక్షణాలతో తెలంగాణ ఆసుపత్రులకు చేరుతున్నారు. దీంతో తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.
అమెరికా ఆంక్షలు
భారత్ లో కరోనా కల్లోలం రేపుతోంది. ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే 4 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో అనేక దేశాలు ఇండియాతో సంబంధాలు నిలిపివేస్తున్నాయి. మే 4 నుంచి భారత్ కు విమానాలు నడపవద్దని అమెరికా విమానయాన సంస్థలను ఆదేశించింది. ఇక పొరుగుదేశాలు బంగ్లాదేశ్, భూటాన్ సరిహద్దులను మూసివేశాయి. భారత్ లో నివశించే పౌరులు జాగ్రత్తగా ఉండాలని పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.
Must Read ;- కరోనా ధాటికి విలవిల.. 16 ఏళ్ల తరువాత సాయం స్వీకరిస్తున్న భారత్











