వెండితెరమీద ఖరీదైన విలన్ గా తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేసే సోనూ సూద్.. లాక్ డౌన్ కాలంలో రియల్ హీరో అయిపోయిన సంగతి తెలిసిందే. ఎందరో వలస కూలీల్ని తమ స్వస్థలాలకు తరలించడంలో ఎంతగానో సాయపడిన అతడు.. అన్నార్తుల పాలిట దేవుడిగానూ, కష్టాల్లో ఆదుకొనే ఆపద్బాంధవుడిగానూ మారిపోయాడు. అడిగినవారికే కాకుండా.. అడగని వారికి సైతం ఎన్నోసార్లు ఆర్ధికంగా సాయపడి.. ఆదుకున్న అతడు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రియల్ హీరో. ఈ నేపథ్యంలో సోనూసూద్ కు ఒక అభిమాని ఏకంగా గుడే కట్టేశాడు.
తన సొంత ఖర్చుతో సోనూ సూద్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంఘటన ఇటీవలే జరిగింది. అది ఇంకెక్కడో కాదు.. తెలంగాణాలోనే. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలోని, చెలిమితండాలో సోనూసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాజేశ్ రాథోడ్ అనే ఒక యువకుడికి సోనూసూద్ అంటే విపరీతమైన అభిమానం. కరోనా సమయంలో సోనూ కార్యక్రమాలకు అభిమానిగా మారిపోయిన రాజేశ్ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈ విగ్రహానికి రోజూ పూజ చేసి హారతి కూడా ఇస్తున్నాడు రాజేశ్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Must Read ;-సోనూసూద్ సంచలన నిర్ణయం