ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చినప్పుడు, అది తమ సిటింగ్ స్థానం అయినప్పుడు రూలింగ్లో ఉండే పార్టీ ఎడ్వాంటేజీ తీసుకోవడం, నెగ్గడం చాలావరకు జరుగుతుంటుంది. కానీ.. దుబ్బాకలో ఫలితం తిరగబడింది. టీఆర్ఎస్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. గ్రేటర్ ఎన్నికలు వారికి రెండో లిట్మస్ టెస్టులా మారాయి. గ్రేటర్ లో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేలా విజయం సాధిస్తే.. దుబ్బాక పరాజయానికి రకరకాల సాకులు చెప్పేసి ఊపిరి పీల్చుకోవచ్చునని గులాబీ దళం భావించింది. కానీ.. గ్రేటర్ ఫలితాలు వారికి అంతకంటె చేదుగా వచ్చాయి. 99 స్థానాల వద్ద ఉన్న టీఆర్ఎస్ చివరికి 55 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. కోఆప్షన్ బలం కలుపుకున్నా కూడా మేయర్ పీఠం దక్కని పరిస్థితి. తమ ఓటమికంటె మించి.. బీజేపీ అనూహ్యంగా బలపడి 4 సీట్లనుంచి 48 సీట్లకు ఎదగడం వారికి మరింత మింగుడుపడని సంగతి. మరి ఈ ఫలితాలు ఇతర ప్రాంతాలకు, ప్రధానంగా ఓటరు భావజాలం దగ్గరగా ఉండగల ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి? అనేది ఇప్పుడు కీలకాంశం.
ఏపీ పాలకపక్షానికి హెచ్చరికే!
పాలకుల పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ఏర్పడితే.. దాన్ని ప్రదర్శించడానికి వాళ్లు అయిదేళ్ల దాకా వేచిచూడడం లేదు. ప్రభుత్వం పనితీరు అనుకున్నంత సంతృప్తికరంగా లేనప్పుడు మరికొంత కాలం వేచిచూద్దాం అనే ధోరణి ప్రజల్లో ఇప్పుడు లేదు. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు ఇందుకు ఉదాహరణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లు అవుతున్నాయి. ఈలోగా ప్రభుత్వం అపరిమితమైన అప్రతిష్టను మూటగట్టుకున్నదనడానికి ఇప్పటి ఈ పరీక్ష ఫలితాలు నిదర్శననం.
జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి పరీక్ష ఎదురు కాబోతున్నది. అధికారంలోకి వచ్చిననాటి నుంచి జగన్ ఒక కొత్త పంథాలో పాలన సాగిస్తూ పోతున్నారు. సంక్షేమం అంటే జనం జేబులో డబ్బులు పెట్టేయడమే అనే కొత్త నిర్వచనానికి ఆయన రూపకర్త. అది మంచా? చెడా? కరెక్టా? కాదా? అన్నది ముందుముందు ప్రజాతీర్పులు నిర్ణయిస్తాయి.
అయితే తీర్పు కోరడానికి ప్రజల వద్దకు వెళ్లడానికి కూడా అక్కడ ప్రభుత్వం సిద్ధంగా లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ అనుకున్న సమయానికి నిర్వహించకుండా అడ్డుపడుతూ… కోర్టులో పిటిషన్లు నడుపుతుండడమూ, అసెంబ్లీ తీర్మానం చేయడమే ఇందుకు రుజువులు. నిజంగా తాము అనుకుంటున్న (చేస్తున్న) సంక్షేమమే గెలిపిస్తుందనే నమ్మకం ఉంటే.. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి వెరపు ఎందుకు? అనేది ప్రజల అనుమానం. తాము నియమించే- తమకు అనుకూలమైన ఎన్నికల కమిషనర్ వచ్చేదాకా ఎన్నికలకు వెళ్లకూడదని అనుకోవడం ప్రభుత్వంలో భయానికి కాక మరెందుకు సంకేతం.. ఇలాంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.
కానీ.. వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎదుర్కొనవలసి వచ్చే తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక కూడా దగ్గర్లోనే ఉంది. రాష్ట్రంలో కరోనా ఉంది.. మేం ఎన్నికలు పెట్టం అని మొండికేయడానికి వీల్లేదు. అవకాశం కూడా లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు వీరు ఎన్నికలకు వెళ్లాల్సిందే. అసెంబ్లీలో తీర్మానం చేయడానికి, హైకోర్టులో కేసు వేయడానికీ కుదర్దు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక సర్వత్రా చర్చనీయాంశం కావడం సహజం.
Also Read ;- గ్రేటర్ పరాజయం- దుబ్బాకకు 2.0
విపక్షాల్లో ఆశలు
తెలంగాణ ఫలితాలు ఏపీ విపక్షాల్లో మాత్రం ఆశలు రేకెత్తిస్తున్నాయి. అధికారంలో ఉన్నంత మాత్రాన, హఠాన్మరణం పర్యవసానంగా వచ్చే ఉపఎన్నిక అయినంత మాత్రాన ప్రభుత్వం ఏకపక్షంగా గెలిచిపోవడం అసాధ్యం అనే నమ్మకం వారికి కలుగుతోంది.
తిరుపతి ఉపఎన్నిక విషయానికి వస్తే.. నెల్లూరు జిల్లాలో నాలుగు, చిత్తూరుజిల్లాలో మూడు నియోజకవర్గాలు ఈ ఎంపీ పరిధిలోకి వస్తాయి. ఈ అన్ని స్థానాల్లోనూ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అంతమాత్రాన.. ఏకపక్షంగా వైఎస్సార్సీపీ మునుపటి విజయాన్ని పునరావృతం చేస్తుందనే నమ్మకం లేదు.
ప్రధానంగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్.. పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నేను సొంతంగా గెలిచానే తప్ప.. జగన్ బొమ్మతో కాదని వరప్రసాద్ ఆ మధ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కూడా. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మీద అసంతృప్తితో బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓటింగ్ ప్రభావం చూపగలిగేంత శక్తి ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ కు దెబ్బ తప్పదు.
మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ స్థానిక నాయకత్వం, స్థానికంగా వారి వారి వ్యవహార సరళి మీద ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ సంక్షేమ పాలనను, డబ్బులు ఉదారంగా అందరికీ పంచి పెట్టేసే టెక్నిక్ ను నమ్ముకుంటున్నదో.. ఆ సిద్ధాంతానికి- స్థానిక నాయకులపై వ్యతిరేకతను మించిన జనాదరణ ఉన్నదో లేదో ఈ ఎన్నికల్లో సూచన ప్రాయంగా తేలుతుంది.
ప్రతిపక్షాల ఆశ కూడా అదే.. ఏపీలో ప్రతిపక్షాలు చాలా క్రియాశీలంగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తొలినుంచి ప్రభుత్వపు ప్రతి వైఫల్యం మీద విరుచుకుపడుతోంది. ఏ మాత్రం అవకాశం వచ్చినా విడిచిపెట్టడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం జగన్ తో స్నేహపూర్వక విమర్శలు చేస్తున్నట్టుగా ఉంటున్నది గానీ.. తిరుపతి ఉప ఎన్నిక విషయానికి వస్తే వారికి చాలా ఆశ ఉంది. గతంలో ఒకసారి ఇక్కడ పార్టీ గెలిచిన చరిత్ర ఉండడంతో.. మళ్లీ నెగ్గగలమని అనుకుంటున్నారు. చాలా తీవ్రంగా ఈ ఉప ఎన్నిక గురించి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుదఫాలుగా తిరుపతిలోనే స్థానిక నాయకులతో రాష్ట్ర జాతీయ స్థాయి వ్యూహకర్తలు, నాయకులు సమావేశాలు నిర్వహించుకుని ముందుకు సాగుతున్నారు. వారితో పొత్తులు పెట్టుకుని ఉన్న పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఈ సీటునుంచి ఆయన స్వయంగా తన పార్టీ తరఫున ఎవరినీ బరిలోకి దించకపోవచ్చు గానీ.. ఎన్నికల నేపథ్యంలో పార్టీని యాక్టివేట్ చేయడానికి తుపాను పరామర్శ యాత్ర పెట్టుకున్నారనే విమర్శ ఉంది. రాష్ట్రంలో ఆరు జిల్లాలు నివర్ బారిన పడి తీవ్రంగా నష్టపోతే.. గుంటూరు-కృష్ణా జిల్లాలకు ఒక్కరోజు కేటాయించి, నెల్లూరు-చిత్తూరు జిల్లాలకు మూడు రోజులు కేటాయించడం వెనుక ఆంతర్యం కూడా ఎన్నికలే అనే వాదన ఉంది. అంటే- విపక్ష పార్టీలన్నీ ఈ ఎన్నికలను చాలా సీరియస్గానే తీసుకుంటున్నాయనే సంగతి అర్థమవుతోంది.
బలాబలాలు బేరీజు వేస్తే..
2019 ఎన్నికల్లో ఇక్కడినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 2,28,376 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్ కు 7,22,877 ఓట్లు వస్తే, తెలుగుదేశం అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి లభించిన ఓట్లు 4,94,501 మాత్రమే. బిజెపి అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావుకు కేవలం 16,125 ఓట్లు వచ్చాయి. అయినా వారు దుబ్బాక, గ్రేటర్ ఫలితాలను చూసుకుని మురిసిపోతూ.. తిరుపతిలో కూడా గెలిచేయగలమని బీరాలు పలుకుతున్నారు.
బీజేపీ కూడా బలం పెంచుకుని పోటీకి దిగుతోంది. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించిన పవన్ ఇక్కడ ఎన్నిక గురించి పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ.. ఈ దఫా అలా వదిలిపెడతారని అనుకోలేం. వారు గట్టిగా తలపడితే తమ ఓట్లను బాగా పెంచుకుంటారు. తెలుగుదేశం కూడా- ప్రజల్లో తమకు బలం పెరిగి ఉంటుందనే భావనతోనే ఉంది. పైగా అభ్యర్థిని అందరికంటె ముందు ప్రకటించడం ఎడ్వాంటేజీ అవుతుందనే విశ్వాసంతో ఉంది. ఇలా తెలుగుదేశం, బిజెపి-జనసేన పార్టీలు ఇద్దరూ బలంగా పోటీ పడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటాయని- అంతిమంగా మళ్లీ వైఎస్సార్ సీపీ లాభపడుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఖరారుగా ఇలా జరుగుతుందనుకోలేం. అందుకే విపక్షాలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి.
ఏది ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఒక విషయం నిరూపించాయి. పాలకపక్షాలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు వెనుకాడడం లేదు.. అనేది నిరూపణ అయింది. అదే సూత్రం తిరుపతిలో కూడా పనిచేస్తుందని.. ఏపీలో రాజకీయ మార్పులకు ఈ ఎన్నికలు బీజం వేస్తాయని విపక్షాలు ఆశలు పెంచుకుంటున్నాయి.
.. సురేష్ పిళ్లె
Must Read ;- పోలింగ్ శాతం ఫ్లస్సా, మైనస్సా.. ఎవరి అంచనాల్లో వారు











