దేశంలో కరో్నా థర్డ్ వేవ్ ముప్పు దాదాపుగా తరుముకొస్తున్నట్లే లెక్క. ఇప్పటికే తొలి వేవ్ ను ఎలాగోలా గట్టేక్కేసిన దేశం… సెకండ్ వేవ్ లో చాలా నష్టాన్నే చవిచూసింది. సెకండ్ వేవ్ కాస్తంత తగ్గుముఖం పట్టినా… ఇంకా పూర్తిగా తగ్గిపోనేలేదు. ఇలాంటి తరుణంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా సెకండ్ వేవ్ ముగియకుండానే వచ్చేస్తోందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ ఆరంభానికి పెద్దగా సమయం లేదని, రానున్న 6 నుంచి 8 వారాల్లోగానే థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
6 నుంచి 8 వారాల్లోనే ఎంట్రీ
శనివారం ఉదయం ఈ దిశగా గులేరియా సంచలన వ్యాఖ్యలే చేశారు. *రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని తాకవచ్చు. కఠినమైన ఆంక్షల తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేసుల తగ్గుదలతో అన్లాక్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దేశం యొక్క ప్రధాన సవాలు భారీ జనాభాకు టీకాలు వేయడమే. వైరస్ ఇప్పటికీ పరివర్తన చెందుతోంది, కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. దేశంలో మొదట గుర్తించిన అత్యంత ట్రాన్స్మిసిబుల్ వేరియంట్ ఇప్పుడు యూకే లోని మొత్తం కరోనా కేసులలో 99 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త తరంగాల మధ్య అంతరం తగ్గిపోతోంది. ఇది ఆందోళన కలిగించేదే* అని గులేరియా చెప్పారు.
నిర్లక్ష్యంతోనే ముప్పు
ప్రస్తుతం థర్డ్ వేవ్ ఎదుర్కొంటున్న బ్రిటన్ లో డెల్టా వేరియంట్ వ్యాప్తిపై మాట్లాడిన రణదీప్ గులేరియా దేశంలో థర్డ్ వేవ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. *దేశంలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి, మళ్లీ కరోనా నిబంధనలను పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ప్రజల్లో అప్రమత్తత లేదు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అయితే వచ్చే 6 నుండి 8 వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ నుండి తప్పించుకోవాలంటే తగిన జాగ్రత్తలతో పాటుగా, సమూహాలుగా తిరగడాన్ని నివారించాలి. కరోనా కొత్త వేరియంట్ పరివర్తన చెందుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం దేశానికి పెద్ద ప్రధాన సవాలుగా మారింది. కొత్త తరంగం సాధారణంగా మూడు నెలల సమయం పడుతుంది, అయితే ఇది వివిధ అంశాలపై ఆధారపడి తక్కువ సమయంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరగాలి*అని గులేరియా చెప్పారు.
Must Read ;- కొవిడ్ డెల్టా ప్లస్.. మరో కొత్త వేరియంట్ టెన్షన్











