ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఆదివారం రాత్రి కనిపించిన టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్నా కూడా.. ఇప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, మరోమారు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును సీఎంగా చూడాలని, తద్వారా ఏపీని అభివృద్ధి బాట పట్టించాలని కలలు గంటున్న నేతగా గోరంట్ల తన మనసులోని మాటను గట్టిగా చెప్పేశారు. పార్టీపై తిరుగుబాటు చేసిన నేతగా జనంలో తనపై పడిన ముద్రను కూడా ఈ ఇంటర్వ్యూలో చెరిపేసుకున్నారని కూడా చెప్పక తప్పదు. పార్టీ అధినేతగా చంద్రబాబు ఉన్నా.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ మరింతగా వృద్ధిలోకి రావాలని కోరుకునే నేతగానూ గోరంట్ల తనను తాను ఆవిష్కరించుకున్న వైనం ఆసక్తి కలిగించేదే. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? 2019 ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది? పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలేమిటి? మళ్లీ వాటిని పునరావృతం చేయకుండా సాగేదెలా?.. ఇలా చాలా అంశాలను గోరంట్ల నోట నుంచి వచ్చేలా రాధాకృష్ణ తనదైన మార్కును చూపారు.
పొరపాట్లు పునరావృతం కారాదు
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దారి తీసిన కారణాలను గోరంట్ల నిర్భయంగానే బయటపెట్టేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు సామర్ధ్యం ఆధారంగానే టీడీపీ విజయం సాధించిందని గోరంట్ల చెప్పుకొచ్చారు. ఇప్పుడూ జనంలో అదే భావన వ్యక్తమవుతోందని, 2024 నాటికి ఈ భావన మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. దీనికి ఏపీ సీఎంగా ఉన్న జగన్ అవలంబిస్తున్న విధానాలే కారణమని కూడా గోరంట్ల చెప్పారు. అయితే దీనిని బేస్ చేసుకుని టీడీపీ చూస్తూ కూర్చుంటే కుదరదని, జనంలో జగన్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేలా ముందుకు సాగాలని చెప్పారు. దీనికి చాలా మంది పార్టీ నేతలు చేస్తున్న షో మాదిరిగా ముందుకు సాగితే కుదరదని కకూడా ఆయన నిర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా మంది నేతలు ఏదో నలుగురైదుగురితో ఫొటోలు తీసుకుని వాటిని పార్టీ అధిష్ఠానానికి పంపితే సరిపోతుందన్న రీతిగా వ్యవహరిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రోడ్ల దుస్థితిపై పార్టీ చేపట్టిన నిరసనలు రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసిన వైనాన్ని బుచ్చయ్య ప్రస్తావించారు. 2014 నుంచి 2019 ఎన్నికల దాకా ప్రభుత్వ పాలన, రాష్ట్రాభివృద్ధిపై పెట్టిన శ్రద్ధను చంద్రబాబు పార్టీ నిర్మాణంపై పెట్టలేకపోయారని, ఈ కారణంగానే గతంలో ఎన్నడూ లేనంత ఘొర పరాభవం పాలైందని ఆయన చెప్పారు. ఇలాంటి పొరపాట్లను పునరావృతం కానీయకుండా చూసుకుంటే.. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని, మరోమారు చంద్రబాబు సీఎం కావడం ఖాయమని కూడా గోరంట్ల చెప్పుకొచ్చారు. పార్టీలో యువనేతలు మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని, అలాగని తమలాంటి సీనియర్లను పక్కనపెట్టడం సరికాదన్నారు. పార్టీలో వర్గ విభేదాలకు ఎప్పకటిప్పుడు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసే నేతల విషయంలో అధిష్ఠానం మరింత జాగ్రత్త వహించాల్సి ఉందన్నారు. పార్టీకి ద్రోహం చేసే నేతలను ఏమాత్రం ప్రోత్సహించరాదని కూడా గోరంట్ల చెప్పుకొచ్చారు. పార్టీ పొలిట్ బ్యూరోను మరింత యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు ఓ విజనరీ!
పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఓ విజనరీగా బుచ్చయ్య అభివర్ణించారు. నేడు సైబరాబాద్ ఆ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నా.. రాజధాని కూడా లేకుండానే కొత్త ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రకు రోజుల వ్యవధిలతోనే అందరికీ ఆమోదయోగ్యమైన, అందరికీ అందుబాటులో ఉండేలా అమరావతిని రాజధానిగా ఎంపిక చేసేలా వ్యవహరించిన చంద్రబాబు తనపై జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని గోరంట్ల తేల్చేశారు. అయినా ఇల్లు కట్టుకునేందుకే రెండు, మూడేళ్లు పడుతుంటే.. ఓ రాజధానిని నిర్మించడానికి ఐదేళ్లు సరిపోతాయా? అని తనదైన శైలి ప్రశ్నలను సంధించిన బుచ్చయ్య.. ఈ విషయంలో వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విషయంలో టీడీపీ ఘోరంగా విఫలమైందన్నారు. రాజధానిని అభివృద్ధి చేసే విషయంపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు.. అదే రాజధానిపై విపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకోలేదని చెప్పారు. అయితే రెండున్నరేళ్ల జగన్ పాలన చూశాక జనం తాము చేసిన పొరపాటును గుర్తించారని, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు ఓ స్ట్రాటజీతో ముందుకు సాగితే.. టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని గోరంట్ల చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయితే ఏపీలో మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కుతుందన్న విషయంపై జనం ఇప్పటికే ఓ అంచానకు వచ్చారని పేర్కొన్నారు. ఈ దఫా చంద్రబాబు అధికారంలోకి వస్తే.. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండబబోదని కూడా ఆయన చెప్పారు. ఏపీలో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు, చంద్రబాబును మరోమారు సీఎంగా చూసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ క్రమంలో తనకు పార్టీ నుంచి టికెట్ దక్కినా, దక్కకున్నా కూడా వెనక్కు తగ్గేదే లేదని కూడా గోరంట్ల చెప్పారు.
Must Read ;- మార్పు మొదలైంది!.. టీడీపీ వైపు ప్రకాశం రెడ్లు!











