పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీకి ఎన్నికల సంఘానికి మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఎన్నికల కమిషన్ మాటలు విని అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే.. బ్లాక్ లిస్టులో పెడతామని, తాము ఆ అధికారులను గుర్తుంచుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం బహిరంగంగా హెచ్చరించారు. దీనిపై ఈసీ సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలు నియమావళి ఉల్లంఘనతోపాటు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపే చర్యలకు ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిబంధకమని చెబుతూ మంత్రి పెద్దిరెడ్డి ఫిబ్రవరి 21వరకు ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ డీజీపీని ఆదేశించారు. అదే సమయంలోఈ ఉత్తర్వులు అత్యవసర సమయంలో (ఆరోగ్యపరమైన) విషయాల్లో వర్తించవని, అలాంటి సమయంలో ఆయన మీడియాతో మాట్లాడకుండా చూడాలని, మంత్రిత్వ శాఖకు సంబంధించి ఉత్తర ప్రత్త్యుతరాల్లాంటి అధికారిక కార్యకలాపాలకు అడ్డంకి కాబోదని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కిషన్ సింగ్ తోమర్ VS మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ అహ్మదాబాద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించాకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న ప్రభుత్వం
కాగా ఈ ఉత్తర్వుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించింది. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది.
ఉత్తర్వులు అందాక స్పందిస్తాం- డీజీపీ
కాగా ఈ ఉత్తర్వుల విషయంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. తమకు ఇంకా లిఖిత పూర్వక ఆదేశాలు అందలేదని, అందాక చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగత విషయాలను పట్టించుకోమని వ్యాఖ్యానించారు.
పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
కాగా ఈ ఉత్తర్వులపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెలాంటివాడినో ప్రజలకు తెలుసనని వ్యాఖ్యానించారు. ఆయన ఉత్తర్వులపై ఏం చేయాలో అది చేస్తామన్నారు. చంద్రబాబుతో కలసి నిమ్మగడ్డ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, మ్యాడ్ ఫెలో అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అతిపెద్ద అధికారిగా నిమ్మగడ్డ ఫీల్ అవుతున్నారని, కేవలం పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అని వ్యాఖ్యానించారు. తాను ఇంట్లో ఉన్నా..బయట ఉన్నా జరగాల్సింది జరుగుతుందని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ఇలాంటి ఉత్తర్వులు ఇస్తారని ఊహించామని, సీఎంకు కూడా సమాచారం ఉంటుంది కదా అని ప్రశ్నించారు. కాసేపటి తరువాత మరోసారి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే మరోసారి ఎన్నికల కమిషనర్పై విమర్శలు చేశారు. చంద్రబాబుతో కలసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ లిస్ట్లో పెడతామన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వ్యాఖ్యానించారు. కాగా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయవర్గాల్లో పలు అంశాలు చర్చకు వస్తున్నాయి.
Must Read: మంత్రి పెద్దిరెడ్డి బరితెగింపునకు పరాకాష్ట
మరోసారి స్పీకర్ నోటీసుకి?
కాగా ఎన్నికల కమిషనర్ చేసిన వ్యాఖ్యలు తమ పరువుకు భంగం కలిగించాయని, సభా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రవిలేజ్ కమిటీ ఈ అంశంపై విచారణ జరుపుతోంది. తాజాగా ఏపీ మంత్రి కదలికలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరోసారి సభాహక్కుల ఉల్లంఘన విషయం తెరపైకి వచ్చింది. కాగా ఈ ఉత్తర్వులూ ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకే వస్తాయని కొందరు నాయకులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికై రాజ్యాంగ బద్ధమైన పదవిలో, మంత్రిగా ఉండే వ్యక్తిపై ఎలాంటి చర్యలు (క్రిమినల్ లేదా ఇతర అత్యవసర విషయాలు మినహా) తీసుకోవాలన్నా..స్పీకర్ అనుమతి అవసరం ఉంటుందని, ముందుగా వివరణ అడగకుండా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం కచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. స్పీకర్ పరిధిలో ఉండే ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.
గవర్నర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ..
కాగా జిల్లాల్లో అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారని చెబుతూ టీడీపీ నేత వర్లరామయ్య ఆధ్వర్యంలో టీడీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. బోండా ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, గద్దె రామ్మోహన్లతో కలసి వర్ల రామయ్య రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శికి లేఖ ఇచ్చారు.
ఉద్యోగులు భయపడొద్దు..: SEC
కాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల సంఘం మరో ప్రకటన చేసింది. ఉద్యోగులు భయపడాల్సిన పని లేదని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడడమే లక్ష్యమని పేర్కొంది. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఎన్నికల కమిషన్ ప్రకటన జారీ చేసింది. ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలా నిలుస్తుందని తెలిపింది. ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ఎస్ఈసీ అనుమతి తప్పనిసరని ప్రకటన జారీ చేసింది.
కేంద్ర హోంశాఖకు SEC లేఖ..
ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకునే విషయంలో జాప్యం జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, తదుపరి కార్యకలాపాల విషయంలో తమకు మార్గనిర్దేశం చేయాలని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదే అంశంపై ఏపీ SEC గవర్నర్ కి కూడా లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా మంత్రి వ్యాఖ్యలున్నాయని సదరు లేఖలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మమ్మల్ని ఇరికించొద్దు..బొప్పరాజు
కాగా ఎన్నికల విధుల్లోకి తీసుకునే విషయంలో గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని, దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని తాము గతంలో ఎన్నికల సంఘాన్ని కోరామని, ఈ మేరకు ఎన్నికల సంఘం అంగీకరించిందని అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు ఉద్యోగులు కట్టుబడి ఉన్నారని, ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తారని తెలిపారు. అదే సమయంలో వివాదాల్లోకి ఉద్యోగులను లాగొద్దని, ఇరుకున పెట్టవద్దని వ్యాఖ్యానించారు.
వైసీపీ విమర్శలు..
ఇక మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు సరికాదని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను, మంత్రులను అగౌరపర్చేలా ఎన్నికల కమిషర్ వ్యవహరిస్తున్నారని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ వ్యాఖ్యానించారు. కాగా ఎన్నికల కమిషనర్ చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని, ఎన్నికల కమిషనర్ , చిన్నమెదడు చితికినట్టుంది అని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో ఎన్నికల కమిషనర్ని చంద్రబాబు బెదిరించారని, ఆ వ్యవహారంలో చంద్రబాబుకి ఉరిశిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించే ఉద్యోగుల విషయంలో చర్యలు తీసుకుంటామంటే తప్పేంటని ప్రశ్నించారు.
Also Read: చంద్రబాబు చంద్రముఖిలా మారారు!











