పోలవరం ప్రాజెక్టుపై విగ్రహాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రూ.245 కోట్ల వ్యయంతో 125 అడుగుల వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ ప్రకటించారు. దీనిపై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రతి రూపాయిని కేంద్రమే భరిస్తోందని, ప్రాజెక్టుపై మాజీ ప్రధాని వాజ్ పేయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటికే పోలవరంపై రూ.20 వేల కోట్లు ఖర్చు చేయడం వల్లే ఏటా రూ.50 వేల కోట్ల రూపాయల విలువైన పంటలు పండుతున్నాయని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం పోలవరంపై వాజ్ పేయ్ విగ్రహం పెట్టకుంటే బీజేపీ ఆ పని చేస్తుందని ఆయన హెచ్చరించారు. కాగా, పోలవరం అంచనా వ్యయాన్ని రూ. 55 వేల కోట్ల నుంచి రూ. 20,398 కోట్లకు తగ్గించినప్పుడు సోము వీర్రాజు నోరు మెదపకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అవన్నీ పట్టించుకోకుండా విగ్రహాల గొడవను తెరమీదకు తీసుకురావడంపై వైసీపీ, బీజేపీ రెండు పార్టీలు కలసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి.
విగ్రహాలను తెర మీదకు ఎందుకు తెచ్చారంటే?
పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55 వేల కోట్ల నుంచి రూ.20,398 కోట్లకు తగ్గించడంలో బీజేపీ ఏపీ ప్రజలకు ద్రోహం చేసింది. ఇందులో మరో మాట లేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరంకు నిధులు సాధించాల్సిన వైసీపీ కాడి పడేసింది. సీఎంపై ఉన్న కేసుల భయంతో, బీజేపీని ఒక్క మాట కూడా అనటం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అటు బీజేపీ, వైసీపీ రెండు పార్టీలూ ఏపీ ప్రజలను మోసం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పోలవరం నిధుల విషయాన్ని పక్కదారి పట్టించేలా ఒకరు వైఎస్ విగ్రహం పెట్టాలని, మరొకరు వాజ్ పేయి విగ్రహం పెట్టాలని కాలు దువ్వుకుంటున్నారన్న విమర్శలొస్తున్నాయి.
Must Read ;- రాష్ట్రానికి పోల‘వరమా’ శాపమా?
అధికారంలోకి వచ్చేది మేమే..
కామెడీ కాదు. నిజమే. రాసిపెట్టుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వారిమీద వారికి నమ్మకం ఉండటం మంచిదే. కాని ఏపీలో కనీసం బీజేపీ పార్టీ నుంచి ఒక వార్డు మెంబరును గెలిపించి, ఇలాంటి సవాల్ విసిరితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైకు పట్టుకుంటే చాలు వచ్చే ఎన్నికల తరవాత జనసేన– బీజేపీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు చెప్పడంపై అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి.
వైసీపీపై మొదటి సారి విరుచుకుపడ్డ సోము
ఏపీలో ఉపాధి నిధులను అధికార వైసీపీ నేతలు ఎలకల మాదిరి తినేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. టీడీపీ, వైసీపీ రెండూ ఫ్యామిలీ పార్టీలని, వారు రాజకీయ ట్రేడింగ్ చేస్తున్నారని సోము ధ్వజ మెత్తారు. తాను వైసీపీని విమర్శిస్తున్నా, కొందరు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే కొద్ది రోజుల్లో టీడీపీ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని సోము జోస్యం చెప్పారు. ఏదేమైనా వైసీపీ, బీజేపీలు పోలవరం ప్రాజెక్టు సమస్యను గాలికి వదలి, విగ్రహాల వ్యవహారం తెరమీదకు తేవడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చలేరని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Also Read ;- టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!











